వారధి నిర్మాణము
ప్రాణభీతితో శుకుడత్యంత రయమున అటనుండి నిష్క్రమించినాడు....సుగ్రీవుడు తనలో 'రావణునకు బెదురు పుట్టినది! శ్రీరామచంద్రుని నా నుండి వేరుచేయుటకు ప్రయత్నించినాడు!" అనుకొనుచూ అట నుండి రామ లక్ష్మణులను వానర సేనయు ఉన్నచోటుకు పోయినాడు.

సుగ్రీవుడు మహేంద్ర పర్వత సానువున కూర్చొని ఏమియో యోచించుకొను చుండగా ఆకాశ మార్గమున దానవుడొకడేతెంచి భువికి దిగి అతని సమక్షమున నిలిచినాడు. "వానరేశ్వరా నేను దానవేశ్వరుడు రావణుడు పంపగా వచ్చినాను. నా పేరు శకుడు. రావణుడు నీతో ఇట్లు విన్నవించుమన్నాడు; "వానర సార్వభౌమా నీవు అరణ్యాధిపతివి. నేను సముద్రాధిపతిని. మైత్రి యన్నది అన్ని విధముల సమూలముగ మన మధ్య నుండవలెను కాని మానవ మాత్రులు రామలక్ష్మణులతో నీకేమి పని? వారి కర్మకు వారిని వదలి, నీవు నీ అపార సేనా వాహినితో కిష్కింధకు మరలిపోయి నిశ్చింతగా రాజ్యపాలనము చేయుచూ నీ ప్రజలను సుఖపెట్టుము. నీకు నా సాయమెప్పుడవసరమైనను తెలియజేయుము అందజేసెదను.
శుకుడంతటితో ఆగక "వానరేంద్రా రావణుడు రాముని పత్నిని తీసికొని పోవుట వలన నీకు కలిగిన కష్టనష్టములేమున్నవి? నీవు ఆ నరుని వదలి రావణునితో మైత్రిని చేసి లబ్ధిని పొందుము" అనెను.
సుగ్రీవునకు కోపము వచ్చినది. 'శుకుడా' దూతగా వచ్చి అధిక ప్రసంగమునేల జేసెదవు? నీవు వెంటనే ఇట నుండి పొమ్ము. పోకున్నచో నా ముష్టిఘాతములతో నీ ఒడలును హూనము చేసెదను!... రావణునీతో ఇట్లు చెప్పుము. 'రామునీతో నా మైత్రి అగ్నిసాక్షిగా జరిగినది. రాముని శత్రువగు నీవు నాకునూ శత్రువువే. అనతికాల ముననె లంకాపురిని ముట్టడించి సంగ్రామమున నిన్ను సంహరించెదము!'
....ప్రాణభీతితో శుకుడత్యంత రయమున అటనుండి నిష్ర్కమించినాడు... సుగ్రీవుడు తనలో 'రావణునకు బెదురు పుట్టినది! శ్రీరామచంద్రుని నా నుండి వేరుచేయుటకు ప్రయత్నించినాడు!" అనుకోనుచూ అట నుండి రాం లక్ష్మణులను వానర సేనయు ఉన్నచోటుకు పోయినాడు.
శ్రీ రాముడు నిరశన వ్రతమున పూని దర్భల పై బరుండి సముద్రుని ధ్యానించి ఇట్లు ప్రార్దించినాడు: 'జలనిథీ' నీయునికి - నా పూర్వులైన సగర చక్రవర్తి కుమారులు సాగరుల వలన కలిగినది. ఆ బాంధవ్యమును పురస్కరించుకొని నిన్నొక యుపకారమును చేయమని ప్రార్ధించుచున్నాను. ఈ తీరము నుండి వానర సైన్యమును నేను నూరు యమడల కావలనున్న లంకాపురీ తీరమునకు చేర్చవలెను. ఈ ఉభయ తీరములకును నడుమ గల నీవు నీ జలరాశితో తొలగిపోయి మాకు దారినిఇమ్ము"
నిరశన వ్రతమున రామునకు ప్రథమ దివసము గడచినది. రెండవ రోజూనూ ముగిసినది. మూడవ దినమును ముగియునున్నది. సముద్రుని నుండి సమాధానమేదియూ రాలేదు. రామునకు ఆగ్రహము కలిగినది. అతడు లక్ష్మణునితో "తమ్ముడా క్షుద్రుడగు ఈ సముద్రుడు నా సాధువవర్తనము అసమర్ధతగా భావించి నన్ను ఉపేక్షించినాడు! నా విల్లమ్ములనిటు తెమ్ము. నా బాణమును వీనిపై ప్రయోగించి వీనిని ఇంకింప జేసేదను!'
రాముడు వింటి నారిని ఆకర్ణాంతము లాగి శరమును సాగరము పై ప్రయోగించబోయినాడు. ఆ క్షణమున కడలి తరంగముల నుండి మహా పురుషుడొకడు వెలువడి వచ్చి "రామప్రభూ వందనములు. నేను సముద్రుడను. నీకు సాయము చేయుటకు ఉపాయము నాలోచించ ప్రయత్నించిన నాకు అది వెంటనే తట్టక నేను నిన్ను దర్శించుట ఆలస్యమైఅనది, క్షమించుము.... నేను పంచభూతములలో ఒకటియగు జలముతో సృజింపబడినాను. సృష్టికర్త నాకొక నియమమును విదించినాడు. నేను నా తరంగములతో ఆకసము వైపు విజృంభించవచ్చును. కాని భూమిపైన హద్దును దాటరాదు. నీవు కోరినట్లు నేనిచ్చట నుండి జలముతో తొలగిపోయినచో ఇచట నాయందలి ప్రాణికోటికి జలాభావము వలన క్షోభ కలుగును. నేను పోయిన నూతన ప్రాంతములు వెల్లువకు లోనై అక్కడి జంతుసముదాయమునకు ఉపద్రవము సంభవించును. నేనిచటి నుండి నీటితో నిష్ర్కమించినచో గోచరించు అగాధము బురదతో నుండును కనుక వానరసేన నడచిపోవుటకు అనువుగా నుండదు. వానరుల కొరకు లంకాపూరి వరకును నాపైన సేతువును నిర్మంచుము.
శ్రీ రాముడు: (సంశయత్ముడై) వారిధి (సముద్రము) పై నూరు యమడల పొడవున వారధి (వంతెన)ను నిర్మించుట సాధ్యమా?
సముద్రుడు: ఎట్లు సాధ్యమో విన్నవించెదను వినుము. ఈ వానర యూధములో విశ్వకర్మ అంశలో జన్మించిన 'నలుడు' అను వాడున్నాడు. అతడు శిలను నీటియందు జారవిడిచిన అది బెండువలె తేలును. వారధి నిర్మాణమునకు అర్భుదముల సంఖ్యలో శిలలు అవసరమగును. అర్బుదముల సంఖ్యలో ఉన్న వానరులను నలుదెసలకును పంపి శిలలను, వృక్ష శాఖలను, ఎండుగడ్డిని రప్పించుము. నలుడు జలమును ప్రవేశించి సేతువును నిర్మించుచుండగా అతనికినీ అతనికి తోడ్పడు కార్మిక సముదాయమునకునూ హాని కలుగకుండ నేను చూచెదను.
శ్రీరామునకు సముద్రుని వచనములు సంతోషమును కలిగించినవి. అతడు అంతవరకునూ హస్తమునందే ఉంచుకొన్న ధనుర్భాణములను జూపుచూ 'సాగరా. నా బాణము వృధా కారాదు. దీనిని ఎవరిపై ప్రయోగించుమందువు?' అని అడిగినాడు.
సముద్రుడు: ద్రుమకుల్యము అనుచోట కొందరు క్రూర కర్ములగు రాక్షసులు వసించుచున్నారు. నీ బాణముతో వారిని సంహరించి అచటి సాధుజనమునకు వారి పీడను వదిలించుము.
శ్రీ రాముడట్లు చేసినాడు.
వారధి నిర్మాణము ప్రారంభమైనది. శతయోజనముల పొడవున నిర్మింపబడనున్న ఆ సేతువు , పదియోజనముల వెడల్పును కలిగియుండ వలెనని నలుడు నిర్ణయించినాడు. కోట్లాది వానరుల నలు వంకలకును పోయి తెచ్చిపడవైచిన శిలలూ మున్నగు నిర్మాణ సామగ్రి పర్వతములంత ఎత్తున గుట్టలుగా ఉన్నది. జలమును ప్రవేశించిన నలునకు తోడ్పడుటకు అధిక సంఖ్యలో వానరుల అనుసరించినారు. ప్రథమ దివసమున పదునాలుగు యోజనముల మేర వంతెన పూర్తియైనది. రెండవ, మూడవ, నాల్గవ దినములందు ఇరువది, ఇరువది యొకటి, ఇరువది రెండు యామడల సేతువును పూర్తిచేసినారు ఐదవ రోజున ఎక్కువసేపు శ్రమించి మిగిలియున్న ఇరువది మూడు యోజనముల వారధిని నిర్మించినారు.
నూరు యమడల పొడవును పది యామడల వెడల్పునుగల ఆ మహా వారధిని ఐదు దినములలో అంత కట్టుదిట్టముగ కట్టగలిగిన నలునీ, తోడ్పడిన వానర యూధమునూ శ్రీరాముడు హర్షముతో అభినందించినాడు.
ఒక శుభ మహుర్తమును శ్రీరామచంద్రుడు తనవారితో లంకాపురికి పయనమైనాడు. వానరుల సంఖ్య అర్పుదములలో నున్ననూ వారధి పది యోజనముల వెడల్పున నుండుటచే ప్రయాణము సమ్మర్ధము లేకుండ సౌకర్యముగ జరిగినది. వానరులు ఆడుచు గెంతుచు ఆనందమున పళ్లికిలించుచు ముందుకు సాగిపోయినారు. మలయానిలుడు వీచుచు వారి బడలికను తగ్గించినాడు. పగలంతయు బడచి రాత్రియగుటతోనే ఆగి విశ్రమించి తెల్లవారు జామున లేచి తిరిగి నడకను ప్రారంభించెడివారు. హనుమంతుడు శ్రీరాముని నడవనీయక తన భుకములపై నెక్కించుకొని తీసికొని పోయినాడు. అంగదుడు లక్ష్మణుని వహించినాడు. విభీషాణుడును సుగ్రీవుడును సేనకు ముందు నడచినారు.
అనతికాలముననె వారధిపై ప్రయాణము ముగిసినది. శ్రీరాముడు దండుతో లంకాద్వీపమును ప్రవేశించి తినుటకు ఫలములునూ త్రాగుటకు జలమునూ లభించు నువేలాద్రియను పర్వత సానువున విడిసినాడు.
* * *
