"ఇప్పుడా!" సతీదేవి నుదురు చిట్లిస్తూ అడిగింది.
"అవును. ఇప్పటి కిప్పుడే" మాధవ్ గురుదేవ్ తమకంగ అన్నాడు.
"ఓ వేళా పాళా....!"
"అనవసరం, పదిసార్లు తిండి తినలేము అందుకే తిండి తినటానికి కావాలి ఓ వేళపాళ ఇది ఎప్పుడంటే అప్పుడే ఎక్కడంటే అక్కడే. "గట్టిగ నవ్వి పెద్దగ చెప్పాడు మాధవ్ గురుదేవ్.
సతీదేవి బాధ మింగుకుంటూ కళ్ళు గట్టిగ మూసుకుంది.
"కళ్ళు మూసుకోవద్దని చెప్పానా!"
"ఇది నా అలవాటని మీకు తెలుసు. పదేపదే అడిగిందే అడిగి నన్ను బాధ పెట్టవద్దు."
"సమయం రానీ అప్పుడు...."కసిగ అనుకున్నాడు మాధవ్ గురుదేవ్. ఆ తర్వాత మారు మాట్లాడకుండా సతీదేవిని మంచం దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
"భగవాన్! నీకు నా పరిస్థితి తెలుసు. అబలను అర్భకురాలిని. ఈ మలినం అగ్నితో పునీతం కావాల్సిందే అంతే....అంతే..."
సతీదేవి పదేపదే బాధగ అనుకుంది.
23
కీర్తి యశ్వంత్ భట్టాచార్య ఆ యింట్లో మాట్లాడుకోటానికి లేకపోయింది.
కీర్తి చక్కగా నటిస్తున్నది రాణి పాత్రలో.
యశ్వంత్ భట్టాచార్య సామాన్యుడుకాదు. ఇంటల్ జంట్ డిపార్ట్ మెంటులో కాకలు తీరినయోధాను యోధుడిగ పేరు పొందినవాడు, తన వంతు పాత్ర చాలా సహజంగ పోషిస్తున్నాడు.
అయినా.
ఆ యింట్లో ఎనిమిది జతలకళ్ళు హమేషా వాళ్ళిద్దరి చర్యలని నిగూఢంగ పరిశీలిస్తూనే వున్నాయి.
యశ్వంత్ భట్టాచార్య రెండురోజులు వుండటం పూర్తి అయింది. ఈ రోజు యాత్రలకని చెప్పి ప్రయాణమైవెళ్ళాలి.
యశ్వంత్ భట్టాచార్య తుండుగుడ్డ తీసుకుని నీళ్ళు పోసుకోటానికి వచ్చాడు. స్నానాల గదిలో చాలాసేపటి నుంచీ జలకాలాడుతున్న కీర్తి గదిలోంచి ఎంతకీ బైటికి రాకపోవటంతో తలుపు మీద తడుతూ 'రాణమ్మా!" అని పిలిచాడు
"ఏంటి తాతయ్యా!" అంది కీర్తి.
"స్నానం చేయటం ఎంతసేపమ్మా! అవతల నేను స్నానం చేయాలి భోంచేయాలి ఊరువెళ్ళాలికదా!"
"అయితే."
"నీవు తొందరగా స్నానం చేసి వస్తే నేను చెయ్యాలి"
"కాసేపు వుండు తాతయ్యా!"
"రేపటి నుంచి గంటల తరబడి చెయ్యి ఈ పూటకి మాత్రం బైటికిరాతల్లీ. మారాణమ్మ మంచిది, బంగారు తల్లి, వరాలకొండ, రతనాల మూట..." యశ్వంత్ భట్టాచార్య పొగిడాడు.
"సరే వస్తున్నాలే."అంది కీర్తి.
రెండు నిమిషాలు ఆగి కీర్తి స్నానాల గదిలోంచి బైటికి వచ్చింది యశ్వంత్ భట్టాచార్య"మా రాణమ్మ మంచిది చెప్పిన మాట చక్కగ వింటుంది. "అంటూ స్నానాల గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని లోపల గడియ పెట్టుకున్నాడు.
అయితే కీర్తి స్నానాల గదిలోంచి బైటికి వస్తూను యశ్వంత్ భట్టాచార్య గదిలోకి వెళ్ళేటప్పుడు వకేవక మాట మాట్లాడుకున్నారు. ఆ మాట ఎవరూ విననంత క్విక్ గాను చాలా సీక్రెట్ గ తగ్గు స్వరంతోను.
"సబ్బు పెట్టెకింద" కీర్తి చెప్పిన మాట అది.
యశ్వంత్ భట్టాచార్య స్నానాల గదిలోకి వెళ్ళితలుపు గడియ వేసుకుని సబ్బు పెట్టె పైకి ఎత్తి చూశాడు.
కీర్తి చెప్పిన ప్రకారం సబ్బు పెట్టె కింద ఏమీలేదు.
యశ్వంత్ భట్టాచార్య కంగారు పడలేదు. పక్కనే చిన్న అరలో గూడు లాంటిది వుంటే అది చూశాడు. అక్కడ నూనె సీసా, ఆముదం సీసా, సీకాయపొడి, కుంకుడు కాయల డబ్బా కాక రెండు సబ్బు పెట్టెలు వున్నాయి. ఓ సబ్బుపెట్టెలో గుడ్డల సబ్బు వుంది. మరో సబ్బు పెట్టెలో బాగా అరిగిపోయిన చిన్న సబ్బు బిళ్ళ ముక్క వుంది.
యశ్వంత్భట్టాచార్య సబ్బు పెట్టెలు తీసి చూశాడు.
అరిగిపోయిన సబ్బు వున్న పెట్టె కింద మడతలుపెట్టిన కాగితం వుంది. చటుక్కున కాగితాన్ని తీశాడు. వెంటనే చదివాడు.
ర్తికీ నషు
దింయిఅదేచింమంట చంహి నత గ్రజాగుత నుచాంహిగ్రనునేది ఆ రుచాంధిశోరిప గంధవి నిరాంనమానుఅ కినమతేయి అరుకాలికెనిట్టెపెనా రిదూరోవఎ కిలోదిగ నచ్చికినమలోం యమసన్నస్తుచేం భోనునేరుమీ.ర్ దా బేసు.
యశ్వంత్ భట్టాచార్య అలా చదివాడోలేదో ఆ అక్షరాలు కాగితం మీద నుంచి మాయం అయాయి.
అలా అక్షరాలు మాయం కావటంలో వింత ఎంత మాత్రం లేదు. ఓరకం యాసిడ్ కలిపి తయారుచేసినఇంకుతో కాగితంమీద రాస్తే ఆ అక్షరాలు పదినిమిషాల తర్వాత ఏఆనవాలు లేకుండా మాయం అవుతాయి. అలాంటి ఇంకు పోసిన రెండంగుళాల పెన్ను కీర్తి దగ్గర వుంది. యశ్వంత్భట్టాచార్య దగ్గర వుంది. మాట్లాడుకోకుండా సమాచారం ఇలా రాశి అందించుకుంటుంటారు.
