Previous Page Next Page 
దేవదాసు పేజి 27

                                                               16
    కలకత్తా నుంచి వచ్చి దేవదాసు కొన్ని రోజులు అలహాబాదులో ఉన్నాడు. ఆ మధ్యలో ఆయన చంద్రముఖికి ఒక ఉత్తరం వ్రాశాడు....కోడలూ, ఇప్పుడు ఎవరినీ ప్రేమించకూడదనే అనుకున్నాను. ఒకటేమో ప్రేమించి రిక్తహస్తాలతో తిరిగివస్తే చాలా యాతన అనుభవించవలసి వస్తున్నది. రెండోది ఈ ప్రపంచంలోని ప్రేమ మార్గమే దుఃఖంతోనూ, దైన్యంతోను నిండి వున్నది.
    దీనికి జవాబుగా చంద్రముఖి ఏమి వ్రాసిందో దానిని ఇక్కడ వ్రాయవలసిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో దేవదాసు మనస్సులో కేవలం ఇదే ఆలోచిస్తూ వున్నాడు. ఒకసారి ఆమె ఇక్కడకు రావడం బాగుంటుందా వుండదా?
    మరుక్షణమే ఆలోచించేవాడు....లేదు-లేదు, ఏం పని లేదు. ఒకవేళ ఏ రోజు అయినా పార్వతి వింటే ఏమంటుంది? ఈ రకంగా ఒకప్పుడు పార్వతి, మరొకప్పుడు చంద్రముఖి ఆయన హృదయంలో వుంటుండేవాళ్ళు. మరొకప్పుడు ఇద్దరి ముఖాలు ఆయన హృదయపు తెరమీద ముద్రింపబడుతూ ఉండేవి. ఇద్దరిమీదా గాఢమైన ప్రేమవున్నట్లుగా హృదయములో ఇద్దరూ ప్రక్క ప్రక్కనే నివసిస్తూ వుండేవాళ్ళు. ఒక్కో రోజు అమాంతంగా వాళ్ళిద్దరూ నిద్రపోయారా అన్నట్లుగా ఆలోచించేవాడు. ఈ సమయంలో ఆయన హృదయం శూన్యంగా వుండిపోయేది. కేవలం ఒక నిర్జీవమైన అసంతృప్తి ఆయన హృదయంలో మిథ్యయైన ప్రతిధ్వనిలాగా ధ్వనించేది. ఆ తరువాత దేవదాసు లాహోరు వెళ్ళిపోయాడు. అక్కడ చున్నీలాల్ ఉద్యోగం చేస్తూ వున్నాడు. కబురు అందగానే కలుసుకొనడానికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత ఈ రోజు మిత్రులిద్దరూ ఒకరి నొకరు చూసి సిగ్గు పడ్డారు. దానితో పాటు సుఖపడ్డారు కూడా. మళ్ళీ దేవదాసు మద్యం తాగడం ప్రారంభించాడు. చంద్రముఖి నీడ ఆయన మనసులో నిలిచే వుంది. ఆమె మద్యాన్ని నిషేధించింది. ఆలోచించేవాడు, ఆమె ఎంత తెలివిగలది! ఎంత ధైర్యం గలది! ఎంత శాంతం గలది! ఆమె ఎంతో స్నేహంగా వుండేది. పార్వతి ఈ సమయంలో న్వప్నం మాదిరిగా మరపున బడివుండేది. కేవలం ఆరిపోతున్న దీపంలాగా అప్పుడప్పుడు ఆమె స్మృతి గుప్పుమని వెలిగేది. అక్కడి వాతావరణం ఆయనకు అనుకూలపడలేదు. మధ్య మధ్యలో జబ్బు పడుతూ వున్నాడు. గుండెలో మళ్ళీ పోటుగా వున్నట్లనిపించేది. ధర్మదాసు ఒకరోజు ఏడుస్తూ అన్నాడు....దేవా, నీ శరీరం మళ్ళీ పడిపోతున్నది. మరోచోటుకు పోదాం పద."
    దేవదాసు పరధ్యానంగా "సరే, వెళదాంలే" అంటూ సమాధానమిచ్చాడు.
    దేవదాసు సాధారణంగా ఇంటివద్ద మద్యం త్రాగాడు. ఎప్పుడైనా చున్నీలాల్ వస్తే త్రాగుతాడు. మరెప్పుడైనా నా బయటికి వెళ్ళిపోతాడు. రాత్రి మూడవజామునో, లేక నాలుగవ జామునో ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఒక్కోరోజు అసలు వచ్చేవాడు కూడా కాదు. ఇప్పటికి రెండు రోజుల నుంచి ఆయన జాడలేదు. శోకం కారణంగా ధర్మదాసు ఇప్పటివరకు అన్నం తినలేదు. ఆఖరుకు మంచినీళ్ళు కూడా త్రాగలేదు. మూడవరోజు జ్వరంతో ఇంటికి తిరిగి వచ్చాడు. మంచం ఎక్కాడు. ముగ్గురు డాక్టర్లు వచ్చి చికిత్స ప్రారంభించారు.
    "దేవదా, కాశీలో వున్న అమ్మకు కబురు పంపించనా?" అడిగాడు ధర్మదాసు.
    "ఛీ!ఛీ! అమ్మకు ఈ ముఖం ఎలా  చూపించేది? ఇది ఆమెకు చూపించదగినదా?" అన్నాడు, దేవదాసు కబురు పంపించ వద్దంటూ.
    "రోగాలనేవి అందరికీ వస్తుంటాయి. అందుకని ఇంత పెద్ద దుఃఖాన్ని తల్లికి తెలియకుండా దాచిపెట్టవచ్చునా? నీవు ఏమీ సిగ్గుపడవలసిన పనిలేదు. దేవదా, కాశీకి వెళదాం పద" అన్నాడు ధర్మదాసు.
    దేవదాసు ముఖం మలుపుకున్నాడు. "వద్దు ధర్మదాస్! ఈ సమయములో ఆమె వద్దకు వెళ్ళలేను. నయం అయిన తరువాత చూద్దాం!" అన్నాడు.
    ధర్మదాసు మనస్సులో ఆలోచించాడు. చంద్రముఖిని ఎంతగానో ద్వేషిస్తున్నాడు. అంచేత ఆమెను గురించి ఆలోచన వచ్చినప్పటికీ అతడు మౌనంగానే వుండిపోయాడు.
    స్వయంగా దేవదాసుకు కూడా చంద్రముఖిని పిలిపించాలనే కోర్కెకలుగుతూ వుంది. కానీ ఏమీ చెప్పలేక పోతున్నాడు. అందువల్ల ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తరువాత ఆయన నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ధర్మదాసుతో "నీకు ఇష్టమైతే పద, ఈ సారి మరెక్కడికయినా వెళ్ళిపోదాం" అన్నాడు.
    "ఇప్పుడు మరెక్కడికీ వెళ్ళవలసిన అవసరంలేదు. వీలైతే ఇంటికి వెళదాం పద. లేకపోతే అమ్మ దగ్గరకి వెళదాం పద."
    సామానంతా కట్టగట్టుకుని, చున్నీలాల్ దగ్గర వీడ్కోలందుకొని దేవదాసు మళ్ళీ అలహాబాదుకు వచ్చేశాడు. శరీరం ఇప్పుడు చక్కగా బాగుపడింది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు ధర్మదాసుతో "ధర్మా, ఏదైనా కొత్త చోటుకు రావా? ఇంతవరకు బొంబాయి చూడలేదు. అక్కడికి వెళదామా?" అన్నాడు.
    ఆయనకు ఆ కోర్కె బలంగా వుండటంతో, తనకు ఇష్టం లేకపోయినా కూడా ధర్మదాసు బొంబాయి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అది జ్యేష్టమాసం. బొంబాయి పట్టణం ఇతర పట్టణాలకన్న అంత పెద్ద వేడిగా లేదు. ఇక్కడకు వచ్చిన తరువాత దేవదాసుకు చాలా విశ్రాంతి లభించింది.
    "ఇక్కడ చాలా రోజులు వున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళటం బాగుంటుంది" అన్నాడు ఒకరోజు ధర్మదాసు.
    "వద్దు, ఇక్కడ బాగున్నాను. ఇంకా కొన్ని రోజులు ఒక్కడే వుంటాను" అన్నాడు.
                       *    *    *    *
    ఓ సంవత్సరం గడిచిపోయింది. అది భాద్రపద మాసం. ఒకరోజు ఉదయం దేవదాసు, ధర్మదాసు భుజానికి ఆనుకొని బొంబాయి ఆసుపత్రి బయటకు వచ్చి బండిమీద కూర్చున్నాడు. "దేవదా! నా సలహా విని ఇప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళడం బాగుంటుంది" అన్నాడు ధర్మదాసు.
    దేవదాసు బొటబొటా కన్నీళ్ళు కార్చాడు. అనేక రోజులనుంచి ఆయన కూడా అమ్మను తలుచుకుంటూ వున్నాడు. ఆసుపత్రిలో పడి వుండి అప్పుడప్పుడూ ఆయన అదే ఆలోచిస్తూ వుండేవాడు. ఈ ప్రపంచంలో ఆయనకు అందరూ వున్నారు, ఎవ్వరూ లేరు కూడా. ఆయనకు తల్లి వుంది, అన్న వున్నాడు, సోదరికన్నా మించిన పార్వతి వున్నది, చంద్రముఖి కూడా వున్నది. ఆయనకు అందరూ వున్నారు. కాని అయన ఎవ్వరికీ లేడు. "ఇంతకన్నా అమ్మ దగ్గరకు వెళ్ళడం మంచిది" అన్నాడు ధర్మదాసు ఏడుస్తూ.
    దేవదాసు ముఖం మలుపుకొని, కన్నీళ్ళు తుడుచుకొని "కాదు ధర్మదాస్! అమ్మకు నా ముఖం చూపించలేకుండా వున్నాను. ఇంకా నాకు సమయం రానట్లే వుంది" అన్నాడు.
    వృద్దుడయిన ధర్మదాసు వెక్కి వెక్కి ఏడుస్తూ వున్నాడు. "అమ్మ ఇంకా బ్రతికే వుందయ్యా!" అన్నాడు.
    ఈ మాటలో ఎంత భావం ఇమిడి వుందో దాన్ని ఆ ఇద్దరి అంతరాత్మలే అనుభవం చేసుకోగలవు. దేవదాసు పరిస్థితి ఇప్పుడు చాలా శోచనీయంగా వుంది. పోట్టనంతటినీ ప్లీహమూ, ఊపిరితిత్తీ కమ్మివేశాయి. ఆ పైన జ్వరము, దగ్గు ప్రబలంగా ప్రకోపించింది.శరీరం నల్లబడిపోయింది. కేవలం కంకాళం మాత్రమే మిగిలి వుంది. కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. వాటిలో ఒక రకపు అస్వాభావికమైన కాంతి మెరుస్తూ వుంటున్నది. తల మీది కేశాలు ఎండి బిరుసెక్కిపోయాయి. ప్రయత్నిస్తే వాటిని లెక్క పెట్టవచ్చు కూడా. చేతివ్రేళ్ళను చూస్తుంటే రోత బడుతున్నది. అవి దుర్బలంగా, సన్నగా, ఇతర నికృష్టమైన రోగాల మచ్చలతో చెడిపోయాయి. స్టేషను దగ్గరకు వెళ్ళిన తరువాత ధర్మదాసు "దేవదా, టికెట్ ఎక్కడికి తీసుకుందాం?" అని అడిగాడు.
    దేవదాసు కొంచెం ఆలోచించి "పద, ముందు ఇంటికి పోదాం, తరువాత చూద్దాం" అన్నాడు.
    బండి ప్లాట్ ఫారం మీదికి వచ్చింది. వాళ్ళు హుగ్లీకి టికెట్ కొనుక్కొని బండెక్కారు. ధర్మదాసు దేవదాసు దగ్గరే వున్నాడు. సాయంకాలానికి కొంచెం ముందే దేవదాసు కళ్ళ నుంచి అగ్నికణాలు రాలుతున్నవా అన్నట్లు అవి ఎరుపెక్కాయి. క్రమంగా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆయన ధర్మదాసును పిలిచి "ధర్మదాస్! ఈరోజు ఇంటికి చేరడం కూడా కష్టమే ననిపిస్తుంది" అన్నాడు.
    ధర్మదాసు భయపడుతూ "ఎందుకయ్యా?" అన్నాడు.
    దేవదాసు నవ్వడానికి ప్రయత్నిస్తూ "మళ్ళీ తీవ్రమయిన జ్వరం వచ్చింది ధర్మదాస్!" అన్నాడు.
    బండి కాశీ దాటిపోయింది. అప్పటివరకు దేవదాసు చైతన్యరహితంగా వున్నాడు. పటనా దగ్గరకు వచ్చేసరికి ఆయన స్పృహలోకి వచ్చాడు. "అయితే ధర్మదాస్, నిజంగానే అమ్మ దగ్గరకు వెళ్ళలేకపోయాం" అన్నాడు ధర్మదాసు.
    ప్రత్యుత్తరంగా దేవదాసు_"పోనివ్వు, ఇప్పుడు మనం ఇంటి దగ్గరకే వెళ్ళే దిగుదాం" అన్నాడు.
    బండి పండువా స్టేషను దగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడు తెల్లవారుతూ వుంది. రాత్రంతా బాగా వర్షం కురిసింది. ఇప్పుడే కొంచెం సేపటినుంచి ఆగి వుంది. దేవదాసు లేచి నిలబడ్డాడు. క్రింద ధర్మదాసు నిద్రపోతున్నాడు. నెమ్మదిగా అతడి తలమీద చేయి వుంచాడు. కాని సిగ్గువల్ల అతణ్ణి మేల్కొల్పలేకపోయాడు. తర్వాత తలుపు తీసుకొని నెమ్మదిగా క్రింది ప్లాట్ ఫారం మీదికి దిగిపోయాడు. బండి నిద్రపోతున్న ధర్మదాసును తీసుకొని వెళ్ళిపోయింది. వణుకుతూ వణుకుతూ దేవదాసు స్టేషనుబయటికి వచ్చాడు. ఒక బండివాణ్ణి పిలిచి "'హాథీపోతా' గ్రామం వస్తావా?" అని అడిగాడు.
    అతడు ఒకసారి ముఖంవైపూ, మరోసారి అటూ ఇటూ చూసి "రాదు బాబూ! దారి బాగోలేదు. గుర్రబ్బండి నీళ్ళ బురదన పడి అటుపోలేదు" అన్నాడు.
    దేవదాసు ఉద్విగ్నుడై "పల్లకీ ఏమయినా దొరుకుతుందా?" అని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS