Previous Page Next Page 
రామాయణము పేజి 20

 

శూర్పనఖ: ముందు నా పగను తీర్చుము. నీ సేనతో పర్ణశాల నుండియే పర్యటనము ప్రారంభించవచ్చును.
   
    ఖరుడు: (క్షణము ఆలోచించి) అటులనే కానిమ్ము.   
    శూర్పనఖ సంతోషించినది. ఖరుడు సర్వసేనాని దూషణుని రావించి విషయమును తెలియజేసి "సైన్యమును సిద్దము చేయుము" అని ఆదేశించినాడు.   
    సైన్య కోలాహలము చెవిని పడుటతోనే రాముడు లక్ష్మణునితో "తమ్ముడా ఖరుడు దండెత్తివచ్చుచున్నాడు. వాని విషయము నేను చూచుకొందును. నీవు జానకిని కాపాడవలెను. ఆమెను చెట్ల మాటున గల కొండ గుహ యందు నిలిపి అప్రమత్తుడవై ఆమెకెట్టి ఆపదయూ వాటిల్లకుండ జూడుము!" అని చెప్పి పంపినాడు.   
    పిమ్మట రాముడు యుద్దమునకు సన్నద్ధుడైనాడు. కవచమును తొడిగినాడు. మున్ను విశ్వామిత్ర బ్రహ్మర్షి యిచ్చిన అస్త్ర శస్త్రములనూ పరశురాముడందించిన 'శౌర్ణము' అను ధనువునూ, అగస్త్యుడొసంగిన అక్షయ తూణీరాదులనూ ధరించినాడు.  
    సేనతో చొరబడిన ఖరునకు పర్ణశాలలో రాముడొక్కడే కనపడినాడు. ఆ దనుజుడు "ఈ రాముని ఒక్క బాణముతో నేను హతమార్చి చెక్కు చెదరని సేనయంతతోనూ సాగిపోయెదను" అనుకొనుచు రామునిపై తన శరమును సంధించినాడు. రాముడు తన అమ్ముతో అసురుని సాయకమును మార్గ మధ్యముననె ఖండించినాడు. దైత్యుడు ఆగ్రహముతో "ఈ బక్క మనుజుని బంధించి తీసికొనిరండు! చిత్రవధ చేయుదము!" అని అరచినాడు. రాముని బాణపరంపర రాక్షస వీరులను పడగొట్టుచుండగా వారా అవక్ర పరాక్రముని చుట్టుముట్టలేకపోయునారు. రాఘవుడే రాక్షస సేనను చొచ్చుకుపోయినాడు. మండు వేసవిని ఎండిన అడవిలో దావానలము విజ్రుంభించి పెటపెటార్భటులతో అడవినంతను బూడిద చేసినట్లు రాముని శౌర కోదండ వినిర్ముక్త సహస్రానేక బాణాఘాతములు రాక్షస సేన నంతనూ అంతము చేసినవి. ఖరుడు సేనతో పర్ణశాలను ప్రవేశించినప్పుడు 'నేను రామునొక్కని చంపివేసి చెక్క చెదరని సేనతో సాగిపోయెదన'నుకున్నాడు. కాని రాముడొక్కడే వారినందరిని యమ సదనమునకు పంపినాడు!   
    జనస్థానమున ఖరదూషణుల సైనిక స్థావరము నామరూపములు లేకుండ పోయినది. ఆ ప్రాంతము మరల మునిజన స్థానమై ప్రశాంతికి నిలయమైనది.   
    శూర్పనఖకు సీతపై పగ హెచ్చినది. ఆ సాధ్వీమణిపై కసి తీర్చుకొనుటకా రక్కసి కొక దుర్బుద్ది పుట్టినది. "సీతకు రామునితో ఎడబాటును కలిగించవలెను!"   
    శూర్పనఖ దక్షిణాపథమును వీడి సముద్రము దాటి లంకాద్వీపమును చేరుకొన్నది. రాక్షసేశ్వరుడునూ, తన పెదతల్లి కుమారుడునూ అగు రావణుని ముందు ప్రత్యక్షమై, కుశలమడిగి పిమ్మట ఇట్లు ప్రారంభించినది:-   
    "తమ్ముడా బ్రహ్మదేవుని తపముచే మెప్పించి గొప్ప వరములను ఆర్జించినావు. యక్షేశ్వరుడు కుబేరుని హడలగొట్టి వాని పుష్పక విమానమును వశము చేసికొన్నావు. స్వర్గము పైకి దండెత్తిపోయి అమరేంద్రుడు నిస్సహాయుడై చూచుచుండగ అప్సరసలను చెరపట్టి తెచ్చినావు. నాగలోకమున సర్పరాజు నోడించి తక్షకుని భార్యనెత్తికొని రాగలిగిన ధీశాలివి..."   
    రావణుడు అగ్రజ పొగడ్తకు సంతోషించుచుండగా ఆమె ధోరణి మార్చి "ముల్లోకములందును నాకెదురు చెప్పగల ధీరుడెవ్వడును లేడను అహంకారముతో నీవు చక్రవర్తిగ నీ విధులను విస్మరించినావు. నలు దిశలకును చౌరులను పంపి ఎక్కడ ఏమి జరుగుచున్నదో ఎప్పటికప్పుడు తెలిసికొనక ప్రమత్తుడవైనావు" అన్నది. ఆమె మందలింపు వాక్యములు రావణునకు కోపము రప్పించలేదు.   
    రావణుడు: అక్కా ఏమి జరిగినది?   
    శూర్పనఖ: హిమాలయములకునూ వింధ్యగిరి పంక్తులకునూ నడుమ గల ఆర్యావర్త దేశము నుండి 'రాముడు' అనెడివాడు తన భార్యతోనూ అనుజునితోనూ వచ్చి దక్షిణాపథమున 'పంచవటి'లో పర్ణశాలను నిర్మించుకొని వసించుచున్నాడు. పంచవటి దండకారణ్యమున జనస్థానమునకు దగ్గరలోనే ఉన్నది కదా. నేను కాలక్షేపము కొరకటుపోగా ఆ రాముని పెండ్లాము సీత నాకు కనపడినది. ఇది వరలో నేనెన్నడునూ అంతటి అందగత్తెను చూచి ఎరుగను. మరుక్షణమున నాకొక ఆలోచన వచ్చినది. ఆ భువనైక సుందరి లంకాపురిలో నీయంతఃపురమున నుండతగినది కాన ఆమె నెత్తికొని వచ్చి నీకు కానుకగా ఇవ్వవలెనన్న సంకల్పము నాకు కలిగినది. ఆ అన్నదమ్ములు అవక్ర పరాక్రములన్న సంగతి తెలియక నేను సీతను పట్టుకొనబోవుచుండగా రాముడు అడ్డువచ్చినాడు. వాడు క్షుద్రుడై తమ్ముని ముందు నన్ను పడద్రోసి 'లక్ష్మణా ఈ రాక్షసిని శిక్షించి తరిమి వేయుము' అన్నాడు....ఆ లక్ష్మణుడు నన్నెంత క్రూరముగా హింసించినాడో చూడుము! నాసికను కోసివేసినాడు; కర్ణములను ఖండించినాడు.   
    శూర్పనఖ శోకించుచూ మెలి ముసుగును తొలగించి ముఖమును దశగ్రీవునకు (పది కంఠములు గల రావణునకు) చూపినది.   
    రావణుడు: (ఆగ్రహముతో లేచి) నేనిప్పుడే పుష్పక విమానములో పంచవటికి పోయెదను; పర్ణశాలలోని ఆ అన్నదమ్ములను వధించి నీవు మెచ్చిన సీతను తెచ్చినా అంతఃపురమున చేర్చెదను...నాకు మేలును తలపెట్టి ఈ కష్టమునకు లోనైతివని విచారించుచున్నాను.   
    శూర్పనఖ: ణా కష్టమును ఓర్చుకొనియెదను. నేను తలపెట్టిన మేలు నీకు జరిగి తీరవలెను. ఆ త్రిలోక సుందరి సీత నీది కావలెను....తరువాత ఏమి జరిగినదో వినుము. నేను రాముని పర్ణశాల నుండి జనస్థానమునకు తిరిగివచ్చి అనుజులు ఖరదూషణులకు చెప్పినాను. వారు సైనిక శిబిరమున గల పదునాలుగువేల రాక్షస వీరులతోనూ పోయి పర్ణశాలణు చొరబడినారు.   
    రావణుడు: రామలక్ష్మణులణు ఇద్దరు బక్కమనుజులను హతమార్చుటకు పదునాలుగువేల దనుజ వీరులెందుకు?   
    శూర్పనఖ: వారిని చంపుటకని కాదు. రాముడు అభయ మిచ్చుటచే దండకాటవిలోని మునులకు రాక్షసులన్న బెదురు పోయినది. ఖరుడు రాముని హతమార్చి పిమ్మట దనుజ సైన్యముతో దండకారణ్యమంతయూ తిరిగి తాపసుల గుండెలలో మరల భీతిని కలిగించా సంకల్పించినాడు. కాని ఖరుడు తలచినట్లు జరుగలేదు. అసుర శూరుడొక్కరుడునూ పర్ణశాల నుండి బయటపడలేదు. ఆ పదునాలుగువేల దానవ వీరులనూ మన తమ్ములు ఖరదూషణులతో సహా రాముడొక్కడే తన అమ్ములతో అంతమొందించినాడు!....అతడు అల్పుడు కాడు. ఋషులు వానిని అవతార పురుషునిగా భావించెదరు.   
    రావణుడు: (ఆగ్రహముతో) జనస్థానమును అరాక్షసము (రాక్షసులు లేనిది)గ జేసిన రాముని నేను వధించెదను!   
    శూర్పనఖ: వలదు, గోటితో సాధ్యమగుచున్న దానికి గొడ్డలి ఎందులకు? మనము మాయలు తెలిసిన రాక్షసులము. నీ మాయతో రామలక్ష్మణులను వంచించి, సీతను అపహరించి లంకాపురికి కొనితెమ్ము. ఆమె ఏమైనదీ తెలియక వినియోగముణు సహించ నేరక రాముడు ప్రాణములను విడుచును. రాముని విడిచి యుండలేని లక్ష్మణుడు మరణించును. అప్పుడు ఖరదూషణాదుల ఆత్మలకు శాంతి లభించును. నా పరాభవాగ్ని చల్లారును. సీత 'ఇంక ఈ లంకేశ్వరుడే నాకు శరన్యుడు' అని సమాధానపడి నీకు వశమగును.   
    రావణునకు శూర్పనఖ సలహా నచ్చినది. శూర్పనఖ - సీతపై తన కసి తీరనున్నదన్న తలంపు తృప్తి కలిగించినది.   
                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS