పదకొండు
1977 కి స్వాగతం
చైనా ఆశలన్నీ వీళ్ళమీదనే వున్నాయి.
వీళ్ళు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ
యంత్రాలు చూసుకుంటారు.
ఒక రెమ్మ మొలిచిన చోట ఇంకెన్నెన్నో
మొలిపిస్తారు.
నూనె కోసం బొగ్గు కోసం
అన్వేషణ సాగించేది వీళ్ళే
కొత్త రైలు రోడ్డు, విశాలమయిన రహదార్లు
కొత్త గృహాలు నిర్మించేది వీళ్ళే
తమ బాల్యంలోని మాధుర్యాన్ని కొంత
భవిష్యత్తులోకి తీసుకువెళ్తూ.
మళ్ళీ తమలాంటి పిల్లల్ని కంటారు.
ఆ పిల్లలు తమ అడుగుజాడల్లో నడుస్తూ
విషయాన్ని విశ్లేషించి, నూతన సృష్టి సాగించడం నేర్చుకుంటారు.
పిల్లలకి తమ శుభోదయ సందేశం
అందజేస్తారు.
- రెవీ అలీ
రెవీ అలీ గృహంలో ఆనాటి (16-12-76) అపరాహ్ణం ఎంతో ఆహ్లాదకరంగా గడిచి పోయింది.
రాత్రి 6.30 గంటలకు పీకింగ్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాంకింగ్ కు ప్రయాణం చేశాము. రైలు బండిలోనే భోజనం. (రాత్ర 8 గంటలకు) భోజనానంతరం మీది బెర్తు మీద ముసుగుతన్ని నిద్రపోయాను.
ఎవరినీ అడిగి తెలుసుకోలేదు గాని చైనా రైలు బళ్ళలో నేను చూసినంతమట్టుకు ఒకే ఒక్క తరగతి (ఫస్టుక్లాసు పెట్టెలు) వున్నాయి. మరి మా కోసం స్పెషల్ ట్రెయిన్ ఏర్పాటు చేశారని నేననుకోను. ఎందుచేతనంటే మాతోబాటు ఎందరో సామాన్య జనం ప్రయాణం చేశారు. భూగర్భ రైల్వే మార్గపు బళ్ళలో కూడా ఎక్కడా తరగతి భేదాలు, తరతమ భేదాలూ లేవు. భూగర్భ రైలు మార్గంలో 17 స్టేషన్ లున్నాయి. మోడల్ లో మాత్రమే ఇది సరళరేఖగా కన్పిస్తుంది. పీకింగ్ మెట్రో నిర్మాణాన్ని జూలై 1965లో ప్రారంభించి, అక్టోబరు 1969లో పూర్తి చేశారు. సర్క్యులర్ రైల్వే ఇప్పుడు నిర్మాణ దశలో వుంది.
17వ తేదీ ఉదయానికింకా రైలుబండిలోనే ఉన్నాము. కిటికీలోంచి చూస్తూ వుంటే పచ్చ పచ్చని పంట పొలాలే హెచ్చు హెచ్చుగా కనిపించాయి. మళ్ళీ నా మనస్సు స్వదేశం మీదకి పోయింది. ఏమయినా, "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" కదా! ఈ ఊహ సరైనది కాదని అబ్బూరి రామకృష్ణారావుగారంటారు.
"మనిషి మాట మరచిపోయి
మనుగడకు దూరంగా
మట్టినేల పైన మమత
మానవులను, వైముఖ్యం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ
జన్మభూమి జనని కాదు
సామాన్య సుమా ఆయమ
వసుమతియగు నామె కొరకు
వల్లభు లెందరు పెనగిరి"
అనే అబ్బూరి గారి "కవిత" లోని గీత పాదాలు జ్ఞాపకం వచ్చాయి. దేశాభిమానం దగుల్బాజీగాడి ఆఖరి ఆశ్రయం అని ఏనాడో డాక్టర్ జాన్సన్ నిర్వచించాడు.
రాజకీయాలకు సంబంధించినంత మట్టుకు దేశాభిమానం కపట మనస్కులు కప్పుకునే ముసుగు అనడాని కెటువంటి సందేహము లేదు.
"దేశమును ప్రేమించుమన్నా" అన్న గురజాడ కూడా.
"దేశమంటే మట్టికాదోయ్.
దేశమంటే మనుషులోయ్!" అని హెచ్చరించాడు.
ఇంతకూ ఇండియాను నేనెప్పుడూ ఒక దేశంగా పరిగణించలేదు. ఇది భరతఖండం. ఇందులో ఎన్నో దేశాలున్నాయి. వాటిలో ఆంధ్రదేశం ఒకటి. అదే నా జన్మభూమి. దానికి నేనేనాడో దూరమయిపోయాను. ఇతర ప్రాంతాలలో ఎందరో తెలుగువాళ్ళలాగా మద్రాసులో నేనో ప్రవాసాంధ్రుణ్ణి.
సమస్త మానవ జాతిని ప్రేమించగల శక్తి నాకుందనుకుంటున్న నేను తెలుగుదేశం అంటే మాత్రం మైమరచిపోవడం మానలేను. చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగుదేశమే నా జనయిత్రి. ఇది సామాన్య అయినా సరే అసామాన్య అయినా సరే ఇదేనా జననధాని!
17వ తేదీ పూర్వాహ్ణం 11.30 గంటలకు మా ప్రతినిధి వర్గం నాన్ కింగ్ స్టేషన్ చేరుకుంది. నాన్ కింగ్ అతిథి గృహంలో మాబస. అక్కడ నా గది నంబరు 307.
చైనా భాషలో పే అంటే ఉత్తరం నాన్ అంటే దక్షిణం. నాన్ కింగ్ ఒకప్పుడు చైనా దేశపు రాజధాని నగరం.
2.30 గంటలకు యాంగ్సినది మీద స్టీమ్ లాంచిలో ప్రయాణం. తూర్పు నుంచి పడమరకు అయిదారు మైళ్ళదాకా ప్రయాణించాము. శీతాకాలం కాబట్టి చలివేస్తున్నా సూర్యుడు మాత్రం చాలా బాగా ప్రకాశిస్తున్నాడు.
పడమటి నుంచి తూర్పుకు మళ్ళింది మా పడవ. సూర్యుణ్ని మా వీపు వెనక వదలిపెట్టి ముందుకు సాగిపోతున్నాము.
ఈసారి దక్షిణోత్తరాలకు విస్తరించిన యాంగ్సీ వంతెనను చేరుకున్నాము. ఇది ప్రపంచంలో రెండో అతి దీర్ఘమైన వంతెన. దీనికి రెండు అంతస్తులున్నాయి. పై అంతస్తు మోటారు రోడ్లు. దిగువ అంతస్తు రైలు మార్గం.
మావో ఆదేశం ప్రకారం, నాన్ కింగ్ లోని ఈ వంతెనను స్వయంశక్తితో చైనా కార్మికులు ప్లాన్ చేసి, స్వహస్తాలతో నిర్మించారు. దీని నిర్మాణం 1960లో ప్రారంభమయింది. 1968 సంవత్సరాంతానికి పూర్తి అయింది.
ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జిల దిగువనున్న డబుల్ ట్రాక్ రైలు మార్గం మొత్తం పొడవు 6772 మీటర్లు. మీదనున్న రహదారి సెక్షన్ పొడవు 4589 మీటర్ల పొడవు. ఇది నాలుగుపేటల మోటారు కార్ల రోడ్డు.
బ్రిడ్జి క్రింద నుంచిపోయి మరికొంత దూరం పడవ ప్రయాణం చేసిన తర్వాత రేవు గట్టు వద్ద పడవదిగి మోటారు కార్లలో వంతెనమీద ప్రయాణం చేశాము. ఒక్కొక్కటి 70 మీటర్ల పొడుగుంటే నాలుగు టవర్లు చూశాము. అందులో ఒకదాని మీదకు లిఫ్టులో వెళ్ళి నాన్ కింగ్ నగరాన్ని సందర్శించాము.
A bridge will fly to span the north and south, turning a deep chasm into a through fare.
ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించిన ఈ వంతెన అగాధమైన అగడ్తను రహదారిగా మారుస్తుంది.
ఈ యాంగ్స్ వంతెన ఉత్తర, దక్షిణ చైనా దేశ భాగాల రహదారి సౌకర్యాలను సుదృఢం కావించి, స్వదేశంలో సామ్యవాద నిర్మాణానికి గాను అత్యంత ప్రాముఖ్యం వహిస్తుంది.
కార్లలో సాయంత్రానికి మా హోటేల్ చేరుకున్నాము.
ఆ రాత్రి, కియాంగ్సూ రాష్ట్రపు విప్లవ కమిటీ ఉపాధ్యక్షుడు మిస్టర్ హూన్ చున్ సియాన్ మాకిచ్చిన విందులో పాల్గొన్నాము.
సగం విందు సాగుతుండగా నాకు పీకింగ్ నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. అచ్చటి భారతీయ రాయబార కార్యాలయపు మొదటి సెక్రటరీ మిస్టర్ మీనన్ (ఒకప్పుడు చైనాలోనూ, రష్యాలోను మన రాయబారిగా పనిచేసిన కె.పి.యస్.మీనన్ గారి మనుమడు) నేను తక్షణమే ఇండియాకు రావలసినదిగా రవిరాజ్ ఇంటర్నేషనల్ వారు టెలిగ్రాం ఇచ్చినట్టు తెలియజేశాడు.
చైనా దేశానికి వీడ్కోలు చెప్పవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించాను.
కాని, మా ప్రతినిధి వర్గంలో ఎవరికీ నేనిలా ఒక్కణ్నే మధ్యలో వెళ్ళిపోవడం నచ్చలేదు.
ఆ రాత్రి మా నాయకుని రూంలో ప్రతినిధివర్గం అందరమూ సమావేశమైనాము. చాలా తీవ్రంగా చర్చలు జరిగాయి. (ఆ వివరాలన్నీ ఇక్కడ రాయడం అనవసరం.)
ఏ సంగతీ ఆలోచించుకోవడానికి తెల్లవారు ఝాముదాకా టైమివ్వండని అడిగాను. నేను నా రూంకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతినిధులు మరికొంతసేపు నా విషయం చర్చించారు.
"ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి ఉండేదీ, వెళ్ళేదీ తేల్చుకునే నిర్ణయం నాకే వదలివేసి" నట్లు మర్నాడు ఉదయం నాకు తెలియజేశారు.
"ఏ క్షణంలో తిరిగిరమ్మన్నా వచ్చేస్తా" నని రవిరాజ్ సంస్థకు నేను మాటిచ్చాను కాబట్టి మరలి పోవడానికే నిశ్చయించాను.
"వీలయినంత త్వరలో వచ్చేస్తున్నాను" అని రవిరాజ్ ఇంటర్నేషనల్ వారికి టెలిగ్రాం ఇచ్చాను.
అప్పటినుంచీ తిరుగు ప్రయాణపు సన్నాహాలలోనే ఉన్నాను.
చైనా మిత్రులు నన్ను సాధ్యమైనంత తొందరగా పంపించడానికి ప్రయత్నించారు. నేను యేరోజు కారోజే బయల్దేరాలనుకుంటూ వచ్చాను ఎంత ప్రయత్నించినా 27వ తేదీకి గాని తిరుగు ప్రయాణం సాధ్యపడలేదు.
2-1-77వ తేదీన నా జన్మ దినం. ఆ తర్వాత వెళ్ళకూడదా అని మా ప్రతినిధులలో ఒకాయన సూచించాడు. ఇది చాలా వేడుకగా జరిపించాలని చైనా మిత్రులనుకుంటున్నారని కూడా చెప్పారు.
"2-1-1978లో మళ్ళీ చైనాలో ఉండకపో"నని ధైర్యంగా అన్నాన్నేను.
