Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 43

 

    విజ్ఞానం కోసం అన్వేషించే సంస్థలోనే ఇంతగా అజ్ఞానం, అసూయ , అసమర్ధత అవినీతి పెరిగిపోయాయంటే - నో ఈ మనిషి అనేవాడిని పుట్టించడం పెద్ద తప్పయిపోయింది. మా ఎక్స్ పెరిమెంటు ఫెయిల్యూర్ రాజూ!"
    "మా ఎక్స్ పెరిమెంట్" అన్నమాట వినబడగానే చురుగ్గా చూశాడు రాజు.
    "మీ ఎక్స్ పెరిమెంటా?" అన్నాడు రాజు.
    రాజు రియాక్షన్ చూసి పరిహాసంగా అన్నాడు సిసిహ.
    "మా ఎక్స్ పెరిమెంటని ఎందుకన్నానంటే మనుషులని సృష్టించింది మేమే కాబట్టి!
    రాజు మోహంలో అపనమ్మకం కనబడింది.
    "ఓహ్! నిన్ను నమ్మించడం కష్టమేలాగుంది. అయితే నిన్ను మా లాబ్ లోకి తీసుకెళ్ళవలసిందే! నాతోరా ! అన్నాడు సైంటిస్టు సిసిహ.
    "భయం లేదు రాజూ!" అన్నది సృష్టి. మళ్ళీ అంతలోనే "ఓహ్! సారీ నీ డిక్షనరీలో భయం అన్నపదం లేనేలేదు కదూ!" అంది వెన్నెల మెట్ల వైపు దారితీస్తూ.
    "మా స్పేస్ షిప్ ఉన్న పరిధిలో మీ భూగోళం తాలుకూ సూత్రాలు పని చేయవులే!" అన్నాడు సిసిహ అహంభావంతో.
    కరెక్టుగా చెప్పాలంటే మా భూమి తాలూకు ఎఫెక్టుని అధిగమించే టెక్నాలజీ మీ దగ్గర ప్రస్తుతానికి వుంది. అంతే తప్ప సూత్రాలు ఎక్కడయినా ఒక్కటే! అన్నాడు రాజు.
    విసిరిన రాయి పైకే వెళ్ళిపోయి కిందపడకుండా ఉండడం, రాత్రి అయినా ఆ ప్రాంతంలో చీకటి పడక పోవడం అతనికి గుర్తొచ్చాయి.
    "రండి -- ఇదేమిటో చూసి వద్దాం" అని నిఖిల్, నిత్యలతో చెప్పి, సృష్టి వెంట నడిచాడు రాజు.
    కాంతి కిరణాలు మెట్ల లాగా ఉన్నాయి. అడుగు వేస్తె అది నిలుస్తుందనే నమ్మకం కలగడం లేదు.
    అడుగువేశాడు రాజు.
    ఆశ్చర్యంగా అతని పాదం కాంతి కిరణం మీద ఫర్మ్ గా నిలిచింది.
    ఆ తర్వాత చకచక మెట్లు ఎక్కేశాడు రాజు.
    అతనికి దగ్గరగా వచ్చింది సృష్టి.
    ఇద్దరి చూపులూ కలిశాయి.
    క్షణంలో సగంలో శతకోటి మాటలని ట్రాన్స్ మీట్ చేశాయి సృష్టి చూపులు.
    "ఐ లవ్ యూ రాజూ"
    "ఐ లవ్ యూ"
    "కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. కంగారు పడకు."
    "నేను నీతోనే ఉంటాను రాజూ. నువ్వు నాకు తోడూ ."
    రాజూ, సృష్టీ , ఆమె తండ్రీ, అతని అనుచరుడు, మెట్ల మీద కాలు మోపగానే కాంతి నిచ్చెన ఎస్కేలేటర్ లాగా పైకి జర్రున జరిగి , వాళ్ళు స్పేస్ షిప్పులోకి రాగానే అదృశ్యమయిపోయింది.
    నిఖిల్ నిత్యా కిందనే ఉండిపోవలసి వచ్చింది.
    "అగు రాజూ- నేనూ వస్తున్నా! అనబోయాడు నిఖిల్.
    అంతలోనే అతని మొహం వివర్ణమైపోయింది. పెదాలు వంకరబోయాయి.
    "అయ్యో! అయ్యో! రాక్షసులెవరో నీతో చెలగాటం అడుతున్నారయ్యా" అంది నిత్య ఏడుపు గొంతుతో.

                                * * *

    పైకి వెళ్ళిన రాజుకి ఆ కొత్త వాతావరణంలో కళ్ళు తిరిగినట్లయింది. కడుపులో తిప్పినట్లయింది.
    చిన్నప్పటి నుంచి యోగా చేసినవాడు కాబట్టీ, ధ్యానంతో ఒంటినీ మెదడునీ అదుపులో పెట్టుకో గలిగిన వాడు కాబట్టీ, కొద్ది క్షణాలలోనే తేరుకుని, ఒక్కసారిగా తల విదలించి , దృష్టి కేంద్రీకరించి చూశాడు.
    ఒక్క క్షణం పాటు అతనికేమీ అర్ధం కాలేదు.
    తలక్రిందులుగా కనబడుతోంది సృష్టి.
    తలక్రిందులుగానే కనబడుతున్నాడు ఆమె తండ్రి సిసిహ కూడా. అయన అనుచరుడు కూడా డిటో!
    కుర్చీలు తలకిందులుగా వున్నాయి. ఒక టేబుల్ కూడా తలక్రిందులుగా ఉంది.
    కాసేపటి తరువాత అర్ధం అయింది రాజుకి.
    తలక్రిందులుగా ఉన్నది వాళ్ళు కాదు.
    తను!
    కదలబోయాడు.
    వెంటనే గాలిలో పల్టీ కొట్టినట్లయింది. దూదిపింజేలాగా తేలిపోతూ కప్పుని తాకాడు.
    వెయిట్ లెస్ నెస్!
    భారరహిత స్థితి!
    ఒళ్ళంతా ఎంతో తేలికగా వుంది. పావురంలా గ్లయిడింగ్ చేస్తూ అతని దగ్గరికి వచ్చింది సృష్టి.
    "ఎట్లా వుంది ?" అంది నవ్వుతూ.
    ఇదొక అనుభవం! అన్నాడు రాజు క్లుప్తంగా.
    గుసగుసగా అంది సృష్టి.
    "నన్నడిగితే - ఆ కుడి వైపు ఉన్న గది వైపు వెళ్ళ వద్దంటాను. చాలా చేదు అనుభవం ఎదురవుతుంది . రాజూ ! జాగ్రత్త!
    వద్దన్న అటు వైపు కదల బోయాడు రాజు. వారించింది సృష్టి.
    సృష్టి తండ్రి సిసిహ అన్నాడు.
    "అయితే నువ్వు రాక్షసుడిని వెతుక్కుంటూ వచ్చావన్నమాట!"
    రాజు ఏదో అనబోయేలోగా మళ్ళీ సిసిహనే అన్నాడు.
    "రాక్షసుడికోసం ఎక్కడో వెదకడం ఎందుకు రాజూ! మీ భూలోకంలో ప్రతి మనిషి ఒక రాక్షసుడే కాదూ?"
    అతన్ని అంచనా వేస్తున్నట్లుగా చూస్తున్నాడు రాజు.
    నిరసనగా అన్నాడు సిసిహ.
    "మనిషిని రాక్షసుడనడం రాక్షసులని అవమానం చేసినట్లు అవుతుంది.
    రాక్షసులకు కూడా కొన్ని నీతి నియమాలు వుంటాయి రాజూ. రావణాసురుడు రాక్షసుడే అయితేనేం! గొప్ప పండితుడు. వీణా విద్యాంసుడు. గొప్ప శివ భక్తుడు. సీత కోసం వెంటబడి ఫినిషైపోయాడు గానీ, అతను నిజానికి గొప్ప రాక్షసుడు. మిగతా రాక్షసులు కూడా ఎట్లా ఉండేవాళ్ళు -- హనుమంతుడు లంకకి వెళ్ళి అక్కడి దృశ్యాలని రాముడితో చెప్పాడు. ఏమనీ ! అక్కడి ప్రతి రాక్షసుడి ఇంట్లోనూ వేదపారాయణం జరుగుతోందిట. రాక్షసుల గురువు శుక్రాచార్యులు మా దేవతలకు వియ్యంకుడు. దేవదానవులు వరసకు అన్నదమ్ములే -- కశ్య ప్రజాపతి తాలుకూ ఇద్దరు భార్యలకు పుట్టిన సంతానమే రాక్షసులూ- దేవతలూ.
    ఇంద్రుడి భార్య శచీదేవి ఒక రాక్షస రాజుకి కూతురు. ఇంద్రుడికీ శచీదేవికి పుట్టిన వాళ్ళు జయంతీ- జయంతుడు. దేవతల బిడ్డ అయిన జయంతిని మళ్ళీ రాక్షసగురువు శుక్రాచార్యుడి కిచ్చి పెళ్ళి చేశారు. వాళ్ళకు పుట్టినదే దేవయాని -- రాక్షసులు రాక్షసులని వాళ్ళని తక్కువ చేయకు. రాక్షసులయినా, దేవతలయినా మేమూ మేమూ ఒకటీ! మధ్యలో మీ మనుషులదే కాకి గోల!" అన్నాడు సిసిహ విసుగ్గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS