ఒక స్త్రీకి ఇదంతా సాధ్యమంటే ఈ తరం నమ్మలేని స్థితికి వచ్చింది. ఆ కధను నాకు చెప్పు సోదరీ!" అని అడిగింది జ్యోతి.
కనులు మిరుమిట్లుగొలిపే ధవళకాంతులను చిమ్ముతున్న శ్వేతకి ఆత్మ రూపం చిరుదరహాసాన్ని చిందించింది. విచ్చిన మల్లెలపై మంచు కణాలు జారుతున్నట్లున్నదా నవ్వు.
"సోదరీ ఆ కధను వింటావా?" అని అడిగింది. అవును అని తలను ఊగించింది జ్యోతి.
శ్వేతకి తన జాతి జనుల శ్రేయః కామనతో తాను సాగించిన ఉద్యమం గురించి చెప్పసాగింది. తన ధవళ హస్తాలతో జ్యోతి కనురెప్పలను తాకిందామె. జ్యోతి విశాల సుందరమయిన నయనాలు ముకుళితం అయినాయి. మనోమయ ప్రపంచం వాకిలి తెరచింది.
అక్కడ శ్వేతకి అద్భుత కధనం కన్పించింది. ఒకరు చెప్తే తాను విన్నట్లు అన్పించలేదామెకు. మనోపటలం మీద దృశ్యంగా నాగ యువతి శ్వేతకి కృష్ణమ్మ కౌగిళ్ళలో పడిన ఆరాటం చూడసాగింది. అది సుప్రభాత సుందర సమయం. కృష్ణాతీరంలోని ఇసుక తిన్నెల మీద ఉదయ భానుడి అరుణ కిరణాలు ఆరబోసినట్లు పరుచుకున్నాయి. గోధుమవర్ణం సైకతాలు అరుణంచితం అయినాయి.
పైరగాలి పచ్చిపచ్చిగా శరీరాలను తాకుతోంది. కృష్ణా జలాలు గులకరాళ్ళపై జలతరంగిణులు పలికిస్తూ కలకల పారుతున్నాయి. నీలినీలి కృష్ణమ్మ తరంగాలలో అరుణ వర్ణం రవి కిరణాలు ప్రతిఫలించి చిత్ర విచిత్ర కాంతుల్ని సృష్టిస్తున్నాయి.
కృష్ణా తీరమంతా నాగులమయం. దిగువ కృష్ణా ప్రాంతాలలో అమరపురి వరకు నాగులే నివాసముంటున్నారు. ఆ దిగువన వజ్రాలదిన్నె ప్రాంతాలలో యక్షులుంటారు.
అత్యధికమయిన తీర ప్రాంతాలను నాగులే ఆక్రమించినారు. నాగజాతీయులు కృష్ణవేణి తీరాన రెండు ప్రక్కలా నివాసముండి వేట, వ్యవసాయమూ ప్రధానమయిన జీవనంగా వర్ధిల్లుతున్న కాలమది.
ఇరుప్రక్కల విస్తరిస్తున్న నాగజాతీయుల కౌగిళ్ళలో కృష్ణమ్మ పౌరుష పరాక్రమాలకూ పవిత్రతకు మారుపేరులా సాగర సంగమానికి పరవళ్ళు తీస్తోంది.
అది శ్రీపర్వాతానికి దిగువభూమి . కృష్ణమ్మ ముద్దాడుతూ అనుకుని నిర్మించిన నాగజాతీయుల నివాసమది! నాగుల నాయకుడు ముచివిందుడు. అప్పటికే అతడు వృద్దుడయినాడు. సుదీర్ఘమయిన నూరు సంవత్సరాల బ్రతుకులో అనుభవాల వల్ల అతని తల పండిపోయింది.
ఇప్పటికయినా పడగ మీసం సవరించినాడంటే పగవారి గుండెలు పగులుతాయి. కోరగా చూశాడంటే క్రూరమృగాలు బెడురుతాయి.
ఆ గణంలోని నాగులకు అతడే ప్రియతమ నాయకుడు. కాని వృద్దుడయినాడు. ముచివిందనాగునికి ఏకైక సంతానం. గారాల కూతురు. ఆమె పేరే శ్వేతకి!
బాల సర్పంలా తరళించే శరీరాకాంతి, కృష్ణ సర్పంలా ప్రతి కదలిక లోనూ చురుకుతనమే నిండారిన యువతి ఆమె! తన ఈడు వారందరినీ సమీకరించి అడవుల వెంట తిరగటమే ఆమె పని.
ఆమె గురించి తండ్రి ఎంతయినా వ్యధ చెందినాడు.
నీలినీలి జలధారలలో ఈదులాడుతోంది శ్వేతకి. సాటి యువతులలో పంతాలు పట్టి పరవళ్ళు చేస్తోంది. వరదలో చిక్కిన కృష్ణసర్పంలా పెనుగులాడుతూ ముందుకు పోతోంది.
రవంత అలసట అయినా తరువాత ఒడ్డుకు చేరిందామే. తన కోసం ఎదురు చూస్తున్న ఒలిపి, ఐరావతి, కుండాలక నాగకన్యలను కలుసుకుంది. రవి కిరణాల వల్ల శరీరం మీది తడియార్చుకుంది.
నారచీరను కట్టుకుని వారంతా తిరుగు పయానమయినారు.
ఆమె కోసమే ఎదురు చూస్తున్న ముచివిందనాగుడు ఆమె అడుగుల సవ్వడిని విన్నాడు. స్నేహితురాండ్రు చేస్తున్న కోడిగాలకు చిరుకోపంతో బదులు చెప్తున్నా ఆమె మాటలు విన్నాడు.
"అమ్మా శ్వేతకి!" అని దగ్గరగా పిలిచినాడు వృద్దనాగుడు. ముచివిందుడు. స్నేహిరులందరినీ సైగలతో అవతలకు పంపి తండ్రి దగ్గరగా వచ్చింది శ్వేతకి.
అతని పాదాలకు నుదురు తాకించి నమస్కరించింది . "తండ్రి మీరు పిలిచినా కారణమేమిటి?" అని అడిగింది.
'అమ్మా! నీవింత ఆకటాయివి అయినావేమి? నీ తండ్రి కృష్ణమ్మ నీడలో బ్రతుకుతున్న నాగగణాలకు భాద్యత గల నాయకుడన్న సంగతి మరచినావు.
కృష్ణాతీరమంతా నాగుల కౌగిలిలో పుణ్యభూమి అయింది. ఈ నాగుల యశస్సు ఔత్తరాహులకు సైతం స్మరణీయమయింది తల్లీ! వేటలోనూ వ్యవసాయంలోనూ నాగగణాలు సుసంపన్నమయి స్థిరజీవనం సాగిస్తున్నాయి.
ఉత్తరాదిన బలవంతులు , స్వార్ధపరులు అయినవారు గణాలను శిధిలం చేసి రాజరికమనే పేరున ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ సంస్కృతీలో కొందరు వ్యక్తులు మాత్రమే గొప్పవారవుతారు. మనవలె ఔత్తరాహులకు సర్వులకు సమాన ప్రతిపత్తి లేదు, కొందరు పాలకులు కొందరు పాలితులు అయినారు.
ఆ సంస్కృతీ దక్షిణాది భూములకు విస్తారించాలని , ఇక్కడి సంపదలను దోచుకోవాలని వారు ఎత్తుగడలు పన్నుతున్నారు.
ఆ స్థితిలో నాగులకు ఆత్మరక్షణ ప్రధాన లక్ష్యం.
పవిత్ర తరంగాలతో దక్షిణాది భూముల్ని పునీతం చేస్తున్న కృష్ణమ్మను ఇరుప్రక్కలా కౌగలించుకుని సుఖ జీవనం సాగిస్తున్న నాగులకు ఇది పరీక్షా సమయం.
వారి నాయకుడుగా ఇది నాకు అగ్ని పరీక్ష!
వారిని రక్షించుకోవలసిన బాధ్యత మనది. నేనా పదిపదులు నిండి పండిపోతున్నాను.
నీవు భాద్యత గుర్తించని ఆకతాయిగానే వున్నావు. ఈ స్థితిలో నీ వుండడం ప్రతిష్టాకరమౌతుందా తల్లీ?" అని ప్రశ్నించాడు ముచివింద నాగుడు.
అతని కంఠం జీరపోయింది. కనులు అశ్రుతపాలయినాయి.
తండ్రి హృదయాన్ని కలచిన కారణమేమిటో గ్రహించింది శ్వేతకి.
"నాన్నగారూ! మీ బిడ్డ నిష్ప్రయోజకురాలు అవుతుందని మీరెందుకు అనుకున్నారు. నేను వేటలో నైపుణ్యం సంపాదించుకుందుకు ధనుర్విద్యా, ఖడ్గచాలనమూ, ఈటె విసరటమూ నేర్చుకుంటున్నాను.
పంట భూముల్లోనే తన కాలమంతా వ్యయపరుచుకుంటున్న అమ్మకు అప్పుడప్పుడు సాయం చేస్తున్నాను. పంట భూములకు వెళ్ళి అమ్మతో పాటుగా వ్యవసాయ విషయాలు తెలుసుకుంటున్నాను.
ఈ నాగగణాలతో మిగిలిన యువతులందరికన్నా నాకు స్నేహితులు అధిక సంఖ్యలో వున్న మాట యదార్ధమే! కాని వారు ఏ ఆకర్షణకు లోను అయి నాతొ మైత్రిని అభిలషిస్తున్నారో నాకు తెలియదు. వారితో కలిసి కృష్ణవేణీ తీరాన తిరుగాడే సమయమంతా వృధా అయినదని నేను అనుకోవటల్లేదు.
అవే నాకు అనందకరమయిన సమయాలు." అని బదులు చెప్పిందామె. ఆ సమాధానం విన్న తరువాత వృద్ద నాగుడు రవంత శాంతుడయినాడు. ఆమె శిరస్సున చేయి వుంచాడు.
