అక్కను కాపాడుకోవాలన్న ఆరాటంలో పన్నెండు అంగుళాలకు మించిన మందం కలిగిన రాతి పలకను కేవలం పలుగులతో బ్రద్దలు కొట్టేందుకు వుద్యమించిందామె.
తాను కూడా చేసేందుకు ఏమీ తోచలేదు. బ్యాటరీని నేలకు విసిరికొట్టి పలుగు చేత బట్టాడు జయకృష్ణ బలీయమయిన రాతి పలకను నడిమికి విరుగగొట్టేందుకు తీవ్రమయిన ప్రయత్నం ప్రారంభమయింది . ఆకాశంలో మబ్బు తునకలు తారాడుతున్నాయి.
నల్లని మబ్బు చెక్కలు రెండు రాచుకున్నప్పుడు మెరుపులు ప్రారంభమయినాయి. ఉరుములు గుండెల్ని గుబులేత్తిస్తున్నాయి.
రాతి పలక మీద వానర దండు లాంటి ఆదిమ జనులు జవసత్వాల ప్రయోగం జరుగుతుంది.
పలుగు తాకినప్పుడల్లా రాతిపలక "ఖణిల్లు' మంటోంది.
* * *
ఉద్విగ్నమయిన మానసిన స్థితిలో వివశురాలాయి రాకాసి గుడిలో కాలు పెట్టింది జ్యోతి. ఆమెకు సమాధి గుడిలో కనులు మిరుమిట్లు గొలిపే కాంతి కన్పిస్తోంది.
సహాస్త్రాబ్దాలనాడు సజీవులైన శ్వేతకి తాలుకూ ఆరాటాలూ, అనుభూతులూ , ఆవేదనలూ , అంతరిక్షలోకపు కల్లోలాలూ తిరిగివచ్చి ఆమె గుండెను తాకుతున్నాయి. హృదయ స్పందనలను శాసిస్తున్నాయి. స్వేచ్చ! స్వాతంత్యం! పోరాటం!! ఆత్మార్పణ!!
ఎంతటి మహిమాన్వితమయిన ఆశయాలవి?! ఎంతటి మహనీయమయిన స్వాతంత్య పోరాటాలు అవి??
త్యాగభావంతో పునీతమయిన ఆ బ్రతుకు ఎంత ఆదర్శ ప్రాయమయినదో తలుచుకుంటే జ్యోతి శరీరం పులకితమవుతోంది. అర్పణ తప్ప మరొక అర్దానికై అన్వేషించని ఆ బ్రతుకులలోని జౌన్నత్యం , స్వార్ధం , సంకుచితం నిండిన ఈనాటి బ్రతుకుల్ని వెక్కిరిస్తున్నాయి.
జాతి జనుల శ్రేయ! కామనతో తనది అనుకున్న స్వర్వస్వాన్ని సునాయాసంగా అర్పించివేసిన శ్వేతకి లాంటి నాగ యువతుల్ని చూసి ఈనాటి నిర్వీర్యమవుతున్న యువతరం సిగ్గుపడాలి.
సంప్రదాయికమయిన ఆ ఔన్నత్యాన్ని నిలుపుకోలేక పోతున్నందుకు అవమాన భారంతో తల దించుకోవాలి. బ్రతుకు ప్రయోజనాలను వివరించలేని విద్యాభ్యాసంలో కొన్నాళ్ళు, నిరుద్యోగంలో కొన్నాళ్ళు, మనస్సులు కలియని మనువులతో కొన్నాళ్ళు. ఆత్మ తృప్తి లభించని అనుభవాలతో తుదినాళ్ళు గడుపుతున్న ఈనాటి బ్రతుకులెంత నిస్సారమయినవో అనిపించసాగింది.
ఒక ఆశయానికి అంకితమయినప్పుడే కదా బ్రతుకు అపురూపమయిన ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది - అది శ్వేతకి జీవితాశయం, ఉన్నత హిమగిరి శిఖరం లాంటి ఆమె వ్యక్తిత్వం ఈ యువతరం గుండెల్ని తట్టి పిలవాలి. వారికి ఆశయాల హరతులిచ్చి బ్రతుకు పోరాటంలో యోద్దలుగా తీర్చిదిద్దాలి. ఉత్సాహించిన వీరకోశోరాలుగా వారు బ్రతుకు పయనంలో మునుముందుకు సాగిపోవాలి.
వ్యక్తిగతమయిన లాలసాపూర్ణమైన అత్రుప్త జీవనం కన్నా సమష్టి బ్రతుకులే సమగ్రమయినవి అని వారికి తెలియాలి. అని ఆలోచిస్తూ ముందుకు పోయింది జ్యోతి.
తాను చారిత్రాత్మకమయిన ఒక వినూత్నమైన ప్రదేశంలో పాదం మోపినట్లుగా ఆమెకు అన్పించలేదు. అక్క చెల్లెళ్ళను పలుకరించుకునేందుకు పుట్టింటికి వచ్చిన ఆడపడుచులా చొరవ చేసి ముందుకు వెళ్ళి పోయింది. లోపల ఆరున్నర అడుగుల పొడవయిన సమాధి కన్పించింది.
ఆరడుగుల పొడవూ, రెండ అడుగుల వెడల్పూ కలిగిన దీర్ఘచతురస్రపు సమాధి అది. పైన మరొక పలకతో మూసి ఉండలేదు.
ఒక గోయిలా నాలుగు రాళ్ళను అమర్చి సమాధి ఆకృతి గా తీర్చారు. సమాధి గుడిలోని ప్రధానమైన కేంద్రస్థానమది.
దాన్ని సమీపించింది జ్యోతి.
యుగయుగాల ఆత్మయానంలో చిర విశ్రాంతమయిన శ్వేతకి కంకాళం అమెకు కన్పించింది. రక్త మాంసాలు జీర్ణమయిన మానవ కంకాళమది! అనంత విశ్వంతరాళంలో చెదరని మహాశాంతిలో తల్లీ ను రాలాయి నిద్రిస్తున్న నాగయువతి మృతకంకాళం!
మూడు వేల సంవత్సరాలనాటి ఆమె ఆరాటాలు చావుతో చిర విశ్రాంతమయిపోగా , తుఫాను లెరుగని శాంతి సముద్ర తరంగాలపై శయనించిన ఒక కృష్ణా తీరపు ఆడపడుచు తుది ఛాయలు మిగిలిన పవిత్ర ఆత్మ రూపమది! కనులారాగా చూచుకుని కన్నీరు పెట్టుకుంది జ్యోతి.
మంచి కోసం ఆరాటంలో, జాతి జనుల పోరాటంలో బ్రతుకునే బలి యిచ్చుకున్న ఆ సోదరి ఆత్మ రూపం తరాల అంతరాలను అధిగమించి జ్యోతి ముందు ప్రత్యక్షమయింది.
"ఓనా సోదరీ! ఆధునిక యువతి! బ్రతుకు అర్దాలేమిటని నువ్వు ఎన్నడయినా ఆలోచించినావా? ఆడదాని అంతర్యం అత్రుప్త జీవనం వల్ల అణగి మందు పాతరలా అయింది. ఎందుకో నీవు గ్రహించినావా? కోరి కలను తీర్చుకోవటం వల్ల తృప్తి లభించదని మా తరువాత వైతాళికుడయిన బుద్ధ దేవుడు బోధించలేదా?
ఉన్నతమయిన ఆశయాలను ముందుంచుకుని వాటి సాధనలో 'నా' అనబడే సర్వస్వాన్ని తృణకణంలా పరిత్యజించటంలో నిజమయిన తృప్తి లభిస్తుందని నీ వేరుగవా?
పుచ్చుకోనటం కన్నా ఇచ్చుకోవటంలో అధికమయిన ఆనందాన్ని పొందగలమని నీవు అంగీకరించలేవా?" అని ప్రశ్నిస్తోంది శ్వేతకి. రాకాసి గుహలో పేటికలోపలి పేటికలా ఒదిగి ఉన్న సమాధి లోపలకు దిగిపోయింది జ్యోతి.
I am safe where the storrms come no more and "I sail the wide sea no more" అన్నట్లు ప్రశాంతమయిన మనసుతో తాను చేరవలసిన చోటుకి చేరినట్లుగా సమాధిలో పడుకుందామె. శ్వేతకి తాలూకు మృత కంకాళం శరీరాన్ని తాకుతుంటే ఆమెకు రవంత అయినా భయమనించలేదు.
క్రేనియం తన తలను తాకుతూ వుంటే సోదరి శిరస్సును ముద్దాడుతున్నట్లుగా భావించింది కాని జుగుప్స కలగలేదు.
ఆ సమాధిలో ఆరడుగుల నెలలో సోదరి ప్రక్కన నిశ్చింతగా శయనించిందామే. ఇతరమయిన పిలుపులు, కాని,శబ్దాలు కాని తనను తాకలేని స్థితికి వెళ్ళిపోయింది.
మనసు ఏకాగ్రంగా నిలిచిపోగా సర్వాన్ని మరచిపోయింది.
ముఖాన్ని క్రేనియం వంకకు త్రిప్పి తన సోదరితో వివశంగా ఊసులాడుతున్నట్లు కళ్ళు మూసుకుంది.
"సోదరీ! తుఫాను లెరుగని శాంతి సముద్ర తరంగాలపై పయన మెరుగని చిర విశ్రాంతి లో వున్న నా ఆత్మ రూపాన్ని చేరుకున్నావు. నా ప్రశాంతతకు భంగం కలిగించినావు. అయినా నిన్ను నేను క్షమించాను.
నా ఆత్మకు విముక్తం చేయాలని, నా కధను లోకం ముందు వుంచాలని ప్రొఫెసర్ శ్రద్దాదేవి, నీవు సంకల్పించుకున్నారు.
నా ఆత్మకు విముక్తి ప్రసాదించటం నీకు అసాధ్యమనుకుంటాను. అయినా నీవు యిప్పటికి చేసిందే దుస్సాహసం. నీ తెగింపు నన్ను అలరిస్తోంది. ఈ ప్రేత భూమిలో నీవు పొందాలనుకున్న దేమిటో నాకు చెప్పు" అని అడిగింది తేజోమాయమయిన శ్వేతకి ఆత్మ రూపం.
జ్యోతి ఆ ధవళ కాంతులను మనో నేత్రాలతో తనివి తీరా చూసింది. సోదరీ! అగోచర శాక్తేయుడు నీ ఆత్మకు విముక్తి కలుగ చెయ్యాలని నిర్దేశించినాడంట! ఆ సంగతి అలా వుంచు. కుంభపతి నించి కదలివచ్చిన క్షుద్రకాళింగుని స్త్రీవి అయి వుండి నీవు ఎలా ఎదురించగలిగినావు! ఔత్తరాహులయినా ఆర్య రాజుల స్నేహంలో యుద్ద పక్షపాతి , సామ్రాజ్యవిస్తరణ కాంక్షాపరుడు, యుద్ద విద్యా విశారదుడుగా మారిన క్షుద్రకాళింగుని కబంధ హస్తాల నించి ఈ కృష్ణాతీర నాగభూముల్ని నీవు ఎలా విముక్తం చేయగలిగావు?
