తన పేరు అంత అందంగా కమనీయంగా వుంటుందా అని ఆశ్చర్యం కలిగిందతనికి.
"ఏమిటి?" అడిగాడు.
"నేను నీ స్నేహితురాలినే కాదు. నీ మనిషిని!" అంది.
ఇంకా ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు అతనికి అర్ధం అయింది.
"అనూ!" అని పిలిచాడతను.
ఆమె అతనికేసి చూసి నవ్వుతూ---
"నువ్వింకేమీ చెప్పనవసరం లేదు రామ్. నువ్వలా పిలవడంలోనే నువ్వేం చెప్పాలనుకొంటున్నావో అర్ధం చేసుకొన్నాను."
"ఈ రోజు చాలా గొప్పది అనూ!" ఉద్వేగంతో అన్నాడు పరుశురామ్.
"అంతేనా?" ఆమె గోముగా అంది.
"అంటే?"
"గొప్ప రోజులెన్నో ఉండొచ్చు రామ్, కానీ, ఇది మన తొలి పరిచయంతోనే మన మనసుల్ని ఒకరి నొకరం పంచుకున్నాం! అందుకే ఈ క్షణాలని మనం బతికినన్నాళ్ళూ గుర్తించుకోవాలి!"
"అవును!"
"మళ్ళీ ఎప్పుడు?" అడిగింది అనూష.
"రేపు కాలేజీలో కలుస్తాం కదా!"
"ఛీ! నీకన్నీ చెప్పాలి. కాలేజీలో ఏం చేస్తాం!" సిగ్గుపడుతూ అంది అనూష.
"ఇంకెక్కడన్నా కలిస్తే మాత్రం ఏం చేస్తాం!?" అమాయకంగా అన్నాడు పరుశురాం.
"యూ సిల్లీ బోయ్! ఒకరినొకరం ఎదురెదురుగా కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకర్నొకరం చూసుకొంటూ గంటలు గడిపేయవచ్చు."
"ఉయ్యాల్లో కూర్చోబెట్టి నిన్ను ఊపొచ్చు" నవ్వాడు.
"ఊపడానికి ఉయ్యాలెందుకు?"
ఇద్దరూ లయగా నవ్వుకున్నారు. గుళ్ళోంచి బయటికి వస్తూ అన్నాడు పరుశురాం.
"గంట క్రితం వరకూ నిన్ను గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. కారణం నాకసలు ఆ అవసరమే కలగలేదు అనూ!
కానీ ఇప్పుడు.... ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తాను."
అనూష నవ్వుతూ అడిగింది.
"మరి పేక ముక్కల్ని ఏం చేస్తావ్?"
ఆ ప్రశ్నతో అతని మొహం కందగడ్డలా ఎర్రగా తయారయింది.
"ఈ పేకముక్కల వెనుక వున్న విషాద గాధ గురించి నీకు తెలీదు. దాని గురించి మాత్రం నన్నెప్పుడూ అడగొద్దు" అన్నాడు.
దీపం వెలుగులో అతని కళ్ళలో కనబడుతున్న ఎర్రజీరల్ని చూసి దానికి ఏదో బలమైన కారణం వుంటుందని ఆమె గ్రహించినట్టుగా-
"ఓ.కే. రామ్!" అంది.
జీపు దగ్గరికి నడుస్తుంటే ఆమెని-
"మళ్ళీ ఎప్పుడు దేవేరి దర్శనం?" అడిగాడు. ఆమె ఉప్పొంగిన ఆనందంతో అడిగింది.
"దేవేరి అంటే అర్ధం తెలుసా?"
పరుశురాం క్షణంపాటు నివ్వెరపోయాడు. తను అనాలోచితంగానే అను ఆ....ఆ మాటకి అర్ధం తెలిసి పెదవి కొరుక్కున్నాడు.
"కలిస్తే ఏం చేస్తావ్?" అడిగింది తిరిగి.
"ఐస్ క్రీం తిందాం!" చెప్పాడు.
"ఐస్ క్రీం తింటానికి పెద్ద ప్రోగ్రామ్ ఎందుకు?"
"మరెక్కడ?"
"ఇదే గుళ్ళో రేపు సాయంత్రం మనం కల్సుకుంటాం. కానీ ఐస్ క్రీం దొరకదు. కొబ్బరిచిప్పలు మాత్రం దొరుకుతాయి" అంది చిలిపిగా అనూ,
"నాకు కొబ్బరి చిప్పలంటే చాలా యిష్టం" చెప్పాడు పరుశురాం.
జీప్ లో కూర్చుంది అనూష. జీప్ కదులుతుండగా "నువ్వింకా మారాలి" అంది.
ఆమె ఎందుకలా అందో అతనికి అర్దం కాలేదు.
కానీ యిప్పుడతని మనసులో ఆమెకి చెందిన ఆలోచనలే కమ్మేస్తున్నాయి.
అనూష చేరువకావడం అతనికెంతో గర్వంగా వుంది.
ఇంటికొచ్చేసరికి ఊర్మిళ ఎదురొచ్చింది కొబ్బరి ముక్కను కొరుకుతూ.
"సమయానికొచ్చావు తీసుకో" అంది సగం ముక్కను అందిస్తూ.
"నీ బోడి ఎంగిలి నేనెందుకు తింటాను? నాకేం అవసరం లేదు" అన్నాడు.
వెనకనుంచి అతని భుజాలను నొక్కిపట్టుకుని ఎత్తయిన తన గుండెల్ని అతని వీపుకి వత్తేస్తూ--
"ఈ బోడెంగిలే నీకు శరణ్యం బావా! ఇప్పుడు తినకపోయినా రేపయినా నీకిదే గతి."
"అంటే?"
"రేపు మన పెళ్ళయ్యాక నేను అన్నీ రుచి చూశాకే నీకు పెట్టుకుంటాను!"
"ఊరికే కలలు కనకు, నిన్ను పెళ్ళి చేసుకోవడానికిక్కడ ఎవరూ సిద్ధంగా లేరు"
ఊర్మిళ అతని వీపుపైన పిడికిళ్ళు బిగించి కొట్టింది.
"నువ్వు సిద్ధంగా లేకపోయినా నేను రెడీగా వున్నాను. నీ మెడను వంచి నేనే తాళికట్టేస్తాను."
"నీకేమన్నా పిచ్చిపట్టిందా?" విసుక్కున్నాడు.
ఊర్మిళ తియ్యగా, కవ్వింపుగా నవ్వింది.
"పిచ్చి ఎప్పుడో పట్టేసింది. ఎదురుగా ఆరడుగుల అందగాడుంటే, యోజనాల దూరం పరిగెత్తుతూంటే కన్నెపిల్లకి పిచ్చి పట్టదా మరి!"
