గుండ్రని శిలలు అన్నీ కలిసి ఒక ఒర్తులాన్ని సృష్టిస్తాయన్న మాట. వాటి మధ్య త్రవ్వకం పనిని సాగించాలి. లోపల నాలుగు రాతిపలకలుంటాయి .అవి ౧ ఆకారంలో పేర్చి ఉంటాయి. మూడు ప్రక్కల పది పన్నెండు అడుగులు పొడవు వెడల్పూ ఉండే రాతి పలకలు అమర్చుతారు. నాలుగవ దిక్కున దారి విడిచి వుంటుంది. ఆ పైని మరొక రాతి పలక మూసి వుంటుంది.
సమాధి గుహలో ప్రవేశించాలంటే మూతగా ఉపయోగించిన రాతి పలకను పగులకోట్టాలి. అలా పోవాలంటే పగిలిన రాతి పలక మీది నించి పది పన్నెండు అడుగులు జంప్ చేయాలి. దిగేందుకు మెట్లుండవు కాబట్టి!
సమాధి గుహలోకి ప్రవేశించేందుకు మరొక పద్దతి కూడా వుంది. మృత శరీరాన్ని ,అది బ్రతికి ఉండగా ఉపయోగించిన వస్తువులనూ లోపలకు చేర్చేందుకు వదలిన దారి ఎదురుగా నేలను త్రవ్వి , త్రవ్వకం లోనే మెట్లు అమర్చుకుని లోపలకు సులభతరంగా దిగిపోవచ్చు.
ఈ పద్దతిన లోపలకు ప్రవేశించుట సులభమే, కాని నేలమాళిగలో ఒదిగి వున్న సమాధి గుహకు దారి ఏ ప్రక్కన వున్నదో, ఏ మూడు ప్రక్కల మూసి వున్నదో ముందుగా తెలియదు.
అందునించి వర్తులం మధ్య ముందు త్రవ్వించాడు. సమాధి గుడిపై ని మూటగా వుంచిన పలక బయటపడగానే దానికి నాలుగు ప్రక్కలా త్రవ్వకం పనిచేయించాడు జయకృష్ణ.
అర అడుగు త్రవ్వగానే మూడు ప్రక్కల రాళ్ళు బయటపడ్డాయి అవి
U
ఆకారంలో వుండే రాతి పలకలు.
మరొక వంక రాయి లేదు. దారి దొరికిందన్నమాట! ఉత్సాహంతో ఆవంక త్రవ్వకం సాగించాడు జయకృష్ణ. నేలకు త్రవ్వుతూ పైనించి అగాధంలోకి మెట్లు అమర్చుకుంటూ పోతున్నారు అదిమజనులు.
అధికమైన శారీరకశ్రమ లేని ఈ విచిత్రమయిన త్రవ్వకం పనివారికి ఆసక్తిదాయకంగానే ఉంది. జయకృష్ణ యిస్తున్న సూచనలను తుచ తప్పకుండా అనుసరించి పని సాగించారు.
రాతి పలక బయట పడింది. లగాయితు పది అడుగులు లోనికి త్రవ్వారు. ఆ మధ్యలో దిగేందుకు పది పన్నెండు మెట్లు అమర్చారు. అప్పటికి Uఆకారంలో ఉన్న సమాధి గుహ ముఖ ద్వారం పూర్తిగా బయటపడి పోయింది.
గుహ లోపల చీకటి గుయ్యారంగా వుంది. అడిమజనులు ఎవరికీ లోపల కాలు పెట్టేందుకు ధైర్యం చాలలేదు.
అప్పటివరకూ ఒంటరిగా చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న జ్యోతి ఎవరో అదలించినట్లు అయి ఉలికిపడి లేచింది. ఆమె గుండెల్ని తట్టి పులుస్తున్నారెవరో! ఎవరో వీపు మీద కొరడాలతో చురకలు తగిలిస్తున్నారు. మనసు కల్లోల సాగరం అయిపొయింది. అంతర్యం బడబాగ్నితో నిండిన జలరాశి అయింది. ఆ కల్లోలానికి చెలరేగిన ఆలోచనా తరంగాలు అంతెత్తున లేచి అంతర్యపు అంచుల్ని డీ కొంటున్నాయి.
కూర్చున్న చోట మంటలు పెట్టినట్లు అయి లేచింది జ్యోతి. నిలిచినా తరువాత కాళ్ళ క్రింద ముళ్ళు పరుస్తున్నట్లు అయి అక్కడ నిలువలేక పరుగు పరుగున త్రవ్వకం పని సాగుతున్న చోటుకి వచ్చింది.
జయకృష్ణ చీకటి గుయ్యారంగా వున్న గుహలోకి వెళ్ళేందుకు సంశయిస్తున్నాడు. అంతకు పూర్వం ఆ గుహలోంచి అసంఖ్యాకమయిన సర్పాలు వచ్చినాయి. మరికొన్ని వచ్చేదారిలేక లోపల మిగిలిపోయి వుంటే లోపల కాలు పెట్టటం చాలా ప్రమాదం.
త్రవ్వకం పనిలో ఎదురయిన ఈ సమస్యతో అర్కేలాజికల్ బుర్రతో అదికమించాలని యోచిస్తున్నాడు జయకృష్ణ. పైకి వెళ్ళి బ్యాటరీ లైటు తీసుకు రావటం తక్షణ కర్తవ్యమని అతడికి అనిపించింది.
అతడా ప్రయత్నం చేసేదానికి ముందుగానే సుడిగాలిలా రివ్వున వచ్చింది జ్యోతి.
ఆదిమజనులు పెడుతున్న అభ్యంతరాలను లెక్క పెట్టకుండా జయకృష్ణ అంటున్న దేమిటో రవంత అయినా చెవి దూరనీయకుండా వచ్చినంత వేగంగానే గుహలోకి ఆ చీకటి గుయ్యారంలోకి నేరుగా వెళ్ళిపోయింది.
బహుకాలం తరువాత పుట్టినింటికి తిరిగి వచ్చిన ఆడపడుచు అమ్మ కోసం వంట గదిలోకి దూరిపోయినట్లుగా నిర్భయంగా సమాధి గుహలోకి వెళ్ళిపోయిందామే. జయకృష్ణ యిరుకున పడిపోయినాడు.
అర్కెలాజికల్ బుర్రతో ఆలోచిస్తే ఆమెను బయటకు రప్పించాలే కాని లోపల ఏమున్నదో తెలియని స్థితిలో మరొకరు లోపలకు పోవటం కూడని పని. కాని అతను ఆ విధంగా ఆలోచించలేదు.
జీవన్మరణ సమస్య అయిన ఈ స్థితిలో జ్యోతిని కాపాడటం తన కర్తవ్యంగా, ఆమె వెంట వుండటం తన భాద్యతగా భావించాడు. తాను కూడా అర్ధం తెలియని ఆ అంధకారంలో కాలు పెట్టి "జ్యోతీ" అన్నాడు ఆర్తి నిండిన స్వరంతో.
మరింత ముందుకు పోతూ అదిమజనుల్ని ఉద్దేశించి "నా కిట్టు ' తీసుకురండి అని కూడా కేక పెట్టాడు. లచ్చిమి పైకి పరుగు తీసింది. కిట్టు తీసుకుని క్షణంలో మెట్లు దిగి వచ్చింది.
సుడిగాలిలా లోపల నించి వచ్చాడు జయకృష్ణ. అతని శరీరం ఆ కాస్సేపటికే చెమటతో తడిసి ముద్ద అయిపొయింది. ముఖం భయ విహ్వలంగా మారిపోయింది. జుట్టు చెరిగి నుదురు మీదికి వచ్చి పడింది.
ఊర్పులు దీర్ఘాతరా లవుతున్నాయి.
సరిగా పరిస్థితిని అంచనా వేయలేక పోయినారు అదిమజనం. వారికీ పరిస్థితి భయంగానే వుంది. బాధగానే వుంది. కాని తాము ఈ విషయంలో ఎటువంటి సహాయం అందించాలో మాత్రం అర్ధం కాలేదు.
తమ నిస్సహాయ స్థితికి తామే బాధ పడుతూ కళ్ళు అప్పగించి చూడటం ప్రారంభించినారు. జయకృష్ణ అమిత వేగంతో కిట్టు తెరచి బ్యాటరీ లైటు అందుకున్నాడు.
అది తీసుకుని లోపలకు వెళ్ళి స్వేచ్ అన్ చేశాడు. కాని అది వెలగకపోవడంతో నిరశోపహతుడై పోయి "జ్యోతీ" అని ఎలుగెత్తి పిలిచాడు. దిక్కులు పిక్కటిల్లెలా , గుండెలు అవిసిపోయేలా ! ఆర్తి నిండిన ఆ పొలికేకకు ఎటువంటి బడులూ రాలేదు. సమదిలోని రాళ్ళని తాకి ప్రతిధ్వనించిన అతని వ్యధాపూర్ణమయిన పిలుపు వృధాగా తిరిగి వచ్చి అతని చెవుల్ని గింగురుమనిపించింది.
స్వర పేటిక చిరిగిపోయెలా మళ్ళీ పిలిచాడు!
జ్యోతీ! జ్యోతీ!!
ఎంత అరచినా ఆ పిలుపుకి బదులే రాలేదు !
* * *
సమయం మూడు గంటలు అయింది.
యూనివర్శిటిలో జ్యోతి గురించి ఏదో చెప్తోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఎంతో శ్రద్దాశక్తులతో ఉపాధ్యాయుని మాటల్ని వింటున్నారు విద్యార్ధినులు.
'ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉదాత్తమయిన ఆశయాల కోసం, అన్వేషణ కోసం సాహసమే ఊపిరిగా జీవిచగలిగిన యువతులు తయారుకావాలి. ఈ ప్రకృతిలో , ప్రపంచంలో ఉన్న ఎన్నో అగాధమయిన రహస్యాలను పరిశోధించటంలో వారు ముందుకు పోవాలి.
పి.హెచ్. డి కోసం ప్రయత్నిస్తున్న మీరు డిగ్రీలు పొందవచ్చు కాని అది నిజమైన అన్వేషణ కాదు. చదువుని, కృషిని డిగ్రీలతో కొలవాలని ప్రయత్నించటం వృధా! డిగ్రీలతో కొలవలేని చదువులు కూడా వున్నాయి. ఈ డిగ్రీలతో పాటు ఆ వ్యక్తిత్వాన్ని కూడ మీరు సంపాదించుకున్ననాడు నా వంటి ఉపాధ్యాయినులకు నిజమయిన తృప్తి దొరుకుతుంది.
