Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 28

    "మిగతా స్త్రీల సంగతేమిటి?
    రామకృష్ణ రెండు క్షణాలు మౌనంగా ఉంది చెప్పాడు సమాధానం.
    "నేను చెప్పింది స్త్రీలలో కొంతమంది గురించి మాత్రమే కాదు. మొత్తం స్త్రీ జాతి గురించి చెప్పాను. ప్రతి స్త్రీ కూతురుగా తల్లిదండ్రుల జీవితాలలో వెలుగులు నింపుతుంది. చెల్లిగా, అక్కగా తోడ బుట్టిన వాళ్ళకి అనురాగం పంచుతుంది. భార్యగా మగవాని జీవితంలో కీలకమైన దశ ప్రారంభము కావడానికి కారణమవుతుంది. పిల్లలకి జన్మనిచ్చి వంశాభివృద్ది చేస్తుంది. తల్లిగా పిల్లలకు విలువకట్టలేని సేవలు చేస్తుంది. అత్తగా పిల్లల సంసారాలు తీర్చిదిద్డుతుంది. మామ్మగా పరిపూర్ణమైన జీవితానికి గుర్తుగా మిగులుతుంది. అటువంటి స్త్రీని గౌరవించాలి, అంతేకాదు పూజించాలి కూడా!"
    "ఓ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి పెళ్ళి చేసుకుంటానంటే ఏం చేస్తారు?" అడిగింది.
    "నాకిష్టం లేదని చెబుతాను."
    "ఆమె అందగత్తె అనుకోండి...."
    "అయినా చేసుకోను...."
    "రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి...."
    "అప్పుడు కూడా చేసుకోను....."
    ఆమె నవ్వి అంది.
    "ఇంతకు ముందే స్త్రీ జాతి మీద మీ అభిప్రాయం చెప్పరు. ఓ అమమయిని చేసుకోమంటే చేసుకోనంటున్నారు......"
    తల అడ్డంగా ఊపి చెప్పాడు.
    "రెండింటికీ సంబంధం లేదు. స్త్రీల మీద గౌరవం చూపించాలని, అడిగిన అమ్మాయి నల్లా చేసుకోవటం సాధ్యం కాదు కదా! పెళ్ళి అనేది నూరేళ్ళ జీవితానికి చెందిన వ్యవహారం. ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి తన నిర్ణయం చెబితే అది ఏక పక్షం. డబ్బు, అందం వైవాహిక జీవితంలో అదనపు ఆకర్షణలే తప్ప సుఖ సంతోషాలకు అవి మూలం కాదు."
    "బ్రహ్మచారికి ఇన్ని విషయాలు ఎలా తెలిశాయి?"
    "మనచుట్టూ ఎంతోమంది జీవిస్తున్నారు. వాళ్ళని గమనించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పెద్దల మధ్య బెరుగ్గా కూర్చున్న అమ్మాయితో రెండు నిముషాలు కూడా మాట్లాడకుండా కేవలం బాహ్య రూపాన్ని చూసి పెళ్ళి చేసుకునే యువకుల్ని చూసి కొంత తెలుసుకోవచ్చు. తెలుసుస్కోవాలనే ఆసక్తి ఉంటె నేను చెప్పినా విషయాలు తెలుసుకోవటం కష్టంకాదు."
    "మిమ్మల్ని ఇష్టపడి వివాహం చేసుకోవడానికి సిద్దపడిన అమ్మాయికి మీరిచ్చే సలహా ఏమిటి?" అడిగి పెదాలు బిగపట్టి నవ్వుదాచుకుంది.
    "ఎవరినైనా ఇష్టపడొచ్చు. దానికి ఆంక్షలేం లేవు. అయితే ఇష్టపడటం అనేది వివాహం ఫలప్రదం కావడానికి కారనమవుతుందా అని ఆలోచించాలి. నిన్ను అర్ధం చేసుకుని, ఇష్టపడిన వాడిని నువ్వు ఇష్టపడితే మంచిది."
    "ఇది నాకు సంబంధించిన ప్రశ్న కాదు" చెప్పింది.
    "ఆ ప్రశ్న నీధయితే మరో సమాధానం చెప్పేవాడిని....."
    రామకృష్ణ కళ్ళల్లోకి చూసి అడిగింది.
    "ఏమిటో ఆ సమాధానం?"
    "ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే ఇక సలహా ఎందుకు?" అని నవ్వాడు.
    ఆమె సిగ్గుపడింది. దానితోపాటు చీకటి పడింది.
    "వచ్చేవారం ఇక్కడే కలుద్దాం...." చెప్పింది భాగ్యలక్ష్మి.
                                   *    *    *
    బూత్ కి తాళంపెట్టి ఎదురుగా ఉన్న టీ షాపుకి వెళ్ళాడు శివరావు. కొన్ని రోజుల నుండి అతని మనసు అశాంతిగా ఉంది.  మనిషి తను చేసిన పనులకు అనుకూలంగా ఒక వాదాన్ని తయారు చేసుకుంటాడు. దానిలో లోపాలు ఉన్నట్లు తెలిసినప్పుడు అశాంతికి గురవుతాడు.  జీవితం మనిషి అనుకున్నంత తేలిగ్గా ఉండదు. ప్రస్తుతం అటువంటి స్థితిలోనే ఉన్నాడు శివరావు.
    టీ త్రాగుతూ ఆలోచనల్లో మునిగిపోయాడు. ఎదురుగా టేబుల్ పై నున్న న్యూస్ పేపరు అతని దృష్టిని ఆకర్షించలేదు. అంతేకాదు చుట్టూ ఏం జరుగుతున్నదో కూడా అతను గమనించడం లేదు. మనసులో పేరుకున్న దిగులు, మెదడ్ని తినేస్తున్న ఆలోచనలు దానికి కారణం.  
    వారం రోజుల క్రితం అర్చన ఓ శుభవార్త చెప్పింది. శివరావుకి అది గొప్ప వార్త. అది విన్న మరుక్షణం అర్చనని గాలిలోకి లేపాడు. తన సంతోషాన్ని ఆ విధంగా ప్రకటించాడతను. తండ్రి కాబోతున్నాననే వార్త ప్రతి మనిషికి సంతోషాన్ని కలిగిస్తుంది. అర్చనకి కృతజ్ఞత చెప్పి అప్పటికప్పుడు బయటకు వెళ్ళి స్వీట్స్ తెచ్చాడు.
    ఆ వార్త చెప్పడానికి ముందు సంశయించింది అర్చన. అప్పటికే అతనికి ముగ్గురు పిల్లలు వున్నారనే విషయం ఆమెకు గుర్తుంది. విషయం తెలిసిన తరువాత అతను ఎలా స్పందిస్తాడో అంచనా వెయ్యలేకపోయింది జంకుతూనే చెప్పింది అతనికి. జీవితంలో మొదటిసారి తండ్రి కాబోతున్నవాడిలా తన సంతోషాన్ని ప్రకటించడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రాత్రంతా శివరావు నిద్రపోలేదు. నాలుగు నెలలపాటు తనకి తెలియనివ్వని అర్చనకి శిక్షగా నిద్రపోనివ్వలేదు.
    ఒకరోజు ఆఫీసు నుండి బయటకొచ్చిన శివరావు చప్పున ఆగిపోయాడు. రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్న ముష్టివాడి మీద అతని దృష్టి పడింది. ఆ ముష్టివాడి వెనుక కూర్చుంది అతని భార్య. ఆమె వడిలో సంవత్సరం లోపు వయసు గల బిడ్డ ఉన్నాడు. నల్లగా మేరవాల్సిన జుట్టు దుమ్ము పేరుకుని ఎర్రగా కనిపిస్తోంది. పాలు కారాల్సిన పసిబుగ్గలు ఎండకు ఎండి మసిబారాయి. చేతులు సన్నగా తోటకూర కాడల్లా ఉన్నాయి. చురుగ్గా ఉండాల్సిన కళ్ళల్లో దైన్యం కనిపిస్తోంది.
    ఆ దృశ్యం చూసిన మరుక్షణం అతనిలో వివేకం మేలుకుంది.
    ఆరు నెలల్లో బిడ్డని ఎత్తుకుంటాననే ఆనందంలో పడి బాధ్యతలు గురించి మర్చిపోయాడు. బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డను సక్రమంగా పెంచాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లీ బిడ్డలకు ఎప్పుడు ఎటువంటి రోగం వస్తుందో తెలియదు. తరుచుగా బిడ్డని డాక్టర్ కి చూపించాలి. దానికి ఎంతో ఖర్చవుతుంది. ప్రస్తుతం తను రామకృష్ణపైన ఆధారపడ్డాడు. ఇప్పటికే అతను నలుగుర్ని పోషిస్తున్నాడు.
    తన హృదయాన్ని పంచుకుని అర్చన గర్భంలో తన రక్తం పంచుకున్న ప్రాణి పెరుగుతుంది. ఆ ప్రాణి కోసం తనేం చెయ్యలేదా? శారీరక అవసరాలు తీర్చుకోవడం ఒక్కటే మగవాడి జీవితం కాదు. పుట్టిన బిడ్డల్ని పోషించాలి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించాలి. ఇవన్నీ చెయ్యాలంటే డబ్బు కావాలి.
    తన దగ్గర అదే లేదు.
    పుట్టబోయే బిడ్డకు ఆర్ధిక భద్రత కల్పించడం కోసం డబ్బు సంపాదించాలనే తాపత్రయం మొదలయింది. డబ్బు సంపాదించడం తేలిక అయితే ప్రతి మనిషీ సంపాదిస్తాడు. ఆ క్షణం నుంచి అతనిలో అశాంతి మొదలయింది. ఆలోచించే కొద్దీ దిగులు పెరుగుతోంది.
    "మీరు టీ త్రాగలేదు." చెప్పాడు సర్వర్.
    శివరావు ఆలోచనల నుండి తేరుకున్నాడు. తన చేతిలో మంచి నీళ్ళ గ్లాసు ఉంది. టీ కప్పు టేబుల్ పైన ఉంది. అప్పటికే టీ చల్లారిపోయింది. నవ్వి కప్పు అందుకుని టీ త్రాగాడు. లేవబోతూ ఆ రోజు దిన పత్రికని గమనించి చేతిలోకి తీసుకున్నాడు.
    ఉదయం నుండి ఎంతో మంది చదవడం వల్ల  బాగా నలిగి పోయింది అది. చదవాలనే ఆసక్తి లేకపోయినా వ్యాన్ రాకపోవటంతో యాంత్రికంగా పేజీలు తిప్పాడు. ఒక ప్రకటన చూసి మేటర్ చదివాడు. అతని నొసలు ముడివడింది. ప్రకటన మొత్తం చదివేసరికి మొహం నిండా చమట పట్టింది. జేబులోంచి కాగితం తీసి ప్రకటనలోని వివరాలు రాసుకున్నాడు.
    వెళ్ళిపోతున్న సివరావుతో అన్నాడు టీ కొట్టు యజమాని,
    "సార్! డబ్బులివ్వలేదు..."
    వెనక్కి వచ్చి డబ్బులు చెల్లించాడు శివరావు. అక్కడా నుంచి బూత్ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. అతని మనసులో ఆలోచనలు సాగుతున్నాయి. కొద్దిగా అదృష్టం కలిసివస్తే రెండు జేబుల్లో నోట్ల కట్టలు కూరుకుని ఇంటికి వెళతాడు.
    ఆ కట్టలన్నీ కలిపి జాగ్రత్తగా లెక్కపెడితే ఖచ్చితంగా లక్షరూపాయలు ఉంటాయి.
    అవును.
    అవి లక్షరూపాయలే!
                                                                  *    *    *    *  
    శివరావు భార్య ఇంటి పనులు పూర్తి చేసి తీరిగ్గా కూర్చుంది.
    ఆమెకు భర్త మాటలు గుర్తొచ్చాయి. అతను తన గురించి తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. తన పనులు గురించి తెలియని అమాయకురాలేం కాదు చంద్రమతి. భర్తతో పరుషంగా మాట్లాడటానికి, అతన్ని దూరంగా ఉంచడానికి ఓ కారణం ఉంది.
    అది తనకు తప్ప మరొకరికి తెలియదని ఇంతవరకూ నమ్మింది. కాని భర్త మాటలు ఆమె నమ్మకాన్ని సడలించాయి.
    పెళ్ళికి ముందు ఆడపిల్ల మనసు ఎన్నో రకాల ఊహలు చేస్తుంది. చంద్రమతి కూడా అన్ని రకాలుగా జీవితాన్ని ఊహించుకుంది. శోభనం రోజు ఆమె ఊహలు మొత్తం పటాపంచలయ్యాయి. శివరావు ఆమెను ఆక్రమించుకున్నప్పుడు ఆ బాధ భరించలేక గట్టిగా అరిచింది. శరీరం లోకి కత్తిని దింపి కెలుకుతున్నట్టు బాధ. మొదటిసారి అలాగే ఉంటుందని శివరావు చెప్పాడు. కాని రెండోసారి కూడా అలాంటి బాధే కలిగింది. మరోసారి అటువంటి బాధ భరించకూడదనుకుంది. కాని మూడు రాత్రులు ఆమె వద్దంటున్నా వినిపించుకోలేదు శివరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS