భర్తతో కాపురానికి వెళ్ళకుండా పుట్టింటిలో ఉండిపోయింది చంద్రమతి. ఆమెను కాపురానికి పంపేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కూతుర్ని బుజ్జగించి విషయం తెలుసుకుంది తల్లి.
ఒక లేడీ డాక్టర్ దగ్గరకు చంద్రమతిని తీసుకెళ్ళింది ఆమె. డాక్టర్ రకరకాల పరీక్షలు చేసి ఆమె శరీరంలో బార్దోలిక్ గ్లాండ్స్ దెబ్బతిన్నాయని కనుక్కుంది. అంగప్రవేశానికి ముందు ఈ గ్రంథులు యోని మార్గంలో చిక్కటి ద్రవాన్ని విడుదల చేస్తాయి. అప్పుడు రతికార్యం సాఫీగా జరుగుతుంది. ఈ గ్రంథులు పని చెయ్యడం మానేస్తే రతికార్యం బాధాకరంగా ఉంటుంది. ఫిమేల్ గ్లాండ్స్ డెవలప్ కావడానికి డాక్టర్ మందులు రాసిచ్చింది. మందులు వాడిన తరువాత డాక్టర్ టెస్ట్ చేసి బార్దోలిక్ గ్లాండ్స్ డెవలప్ అయ్యాయని నిర్ధారణ చేసింది.
రెండు నెలల తరువాత చంద్రమతి కాపురానికి వెళ్ళింది. ఎటువంటి ఇబ్బందీ ఉండదని డాక్టర్ నమ్మకంగా చెప్పబట్టి భర్తతో కలిసి పడుకుంది. శోభనం గదిలో కలిగిన బాధలాంటిదే మళ్ళీ కలిగింది.
మరునాడు శివరావుతో దెబ్బలాడి పుట్టింటికి తిరిగొచ్చింది. మరోసారి డాక్టర్ ని కలిసి తన బాధ చెప్పుకుంది. డాక్టర్ ఆశ్చర్యపడి చంద్రమతిని పరీక్షించింది. ఆమె శరీరంలో ఎటువంటి లోపము లేదు. చంద్రమతిని పంపేసి మరునాడు ఆమె తల్లిని రమ్మని చెప్పింది డాక్టర్.
చంద్రమతి మూడవ తరగతి చదువుతున్నప్పుడు స్కూలు నుంచి వస్తున్న చంద్రమతిని ఓ యువకుడు మాటల్లోపెట్టి పాడుపడిన భవనంలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. రక్తస్రావంతో ఆ పిల్ల స్పృహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. నెల రోజుల్లో చంద్రమతి శారీరకంగా కోలుకుంది. అయితే ప్రతిదానికి భయపడుతూ ఇల్లు వదిలి ఎక్కడకూ వెళ్ళేది కాదు.
డాక్టర్ సలహా ప్రకారం చంద్రమతి తండ్రి అక్కడా నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. చంద్రమతిని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూశారు. వాళ్ళ కృషి ఫలించి చంద్రమతి వాళ్ళతో కలిసిపోయింది. చంద్రమతి బాల్యంలో జరిగిన ఆ సంఘటన గురించి లేడీ డాక్టర్ కు ఆమె తల్లి చెప్పింది.
చంద్రమతికి రాతికార్యం బాధాకరంగా ఉండటానికి బార్దోలిక్ గ్లాండ్స్ ఒకటే కారణం కాదని డాక్టర్ గ్రహించింది. చిన్నతనంలో జరిగిన అత్యాచారం పరిసరాల మార్పుతో మర్చిపోయింది చంద్రమతి. ఇక్కడే సమస్య జటిలమైంది. ఆ సంఘటన తాలూకు జ్ఞాపకం చంద్రమతికి సబ్ కాన్షస్ లో సజీవంగా ఉంది. ఆమెకు దాని గురించి ఏమాత్రం తెలియదు. శోభనం గదిలో భార్య సిగ్గుపడుతున్నదని భావించిన శివరావు కాస్త మొరటుగా ఆమెను వశపర్చుకున్నాడు. ఎప్పుడయితే అతను అలా ప్రవర్తించాడో చంద్రమతి సబ్ కాన్షస్ లోకి వచ్చింది.
చంద్రమతి జబ్బు మందులవల్ల నయం కాదని డాక్టర్ అర్ధం చేసుకుంది. ఆ విషయం చెప్పి పేషంట్ ని వదులుకోవడం ఇష్టంలేక మందులు రాసిచ్చింది. మందులు వాడుతున్నప్పుడు భర్తతో కలవకూడదని డాక్టర్ చెప్పిందనే వంకతో కొంతకాలం సివరావుని దూరంగా ఉంచింది. ఒకరోజు శివరావు వత్తిడికి లొంగిపోయి మందులు తన ఆరోగ్యాన్ని తగ్గించలేదని తెలుసుకుంది.
చంద్రమతి ఎంతో దిగులుపడింది. తనకు పిల్లలు కావాలి. పిల్లలు కావాలంటే భర్తతో సెక్స్ కి అంగీకరించాలి. సెక్స్ లో కలుగుతున్న బాధ భరించలేదు.
ఎలా?
సరిగ్గా ఆ సమయంలోనే ప్రక్కింటిలోకి ఓ పిన్నిగారు అద్దెకొచ్చింది. ఆమెకు యాభై దాటుతుంది వయసు. డెని గురించైనా అనర్ఘళంగా మాట్లాడగలదు. ఆమెకు తెలియని విషయమంటూ ఏమీలేదు. రాత్రి భర్తతో గడిపిన విషయం కూడా సిగ్గుపడకుండా చెబుతుంది. ఆమెతో చనువు ఏర్పడిన తరువాత తన సమస్య గురించి చెప్పింది చంద్రమతి.
పిన్నిగారు రెండు రోజులు సమయం తీసుకుని ఒక సలహా చెప్పింది.
పిల్లలుపుట్టడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి పురుష సంపర్కమువల్ల, రెండవది కృత్రిమ గర్భాధారణవల్ల పుడతారు. కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అందుచేత స్త్రీ గర్భకోశంలో అండం విడుదలయ్యే సమయం గుర్తించి భర్తతో కలిస్తే పిల్లలు పుడతారు. ఇది చాలా తేలికయిన పద్ధతి.
ఆమె సూచన ప్రకారం మెన్షస్ అయినా పదోరోజునుంచి పదిహేను రోజులపాటు భర్తతో సెక్స్ కి అంగీకరించింది. పిన్నిగారి సలహా ఉపయోగపడి ఆమె నెల తప్పింది.
చంద్రమతికి మగబిడ్డ కలిగాడు. శివరావు పిల్లవాడి మీద ఎంతో ప్రేమ చూపించేవాడు. ఆరునెలలు సాఫీగా గడిచాయి. ఒకరోజు శివరావు ఆమెను బెడ్ పైకి రమ్మని పిలిచాడు. ఆమె తిరస్కరించింది. ఆ రోజు ఇద్దరికి గొడవ జరిగింది. పిల్లవాడితో చనువుగా ఉండనివ్వడం వల్లనే తనపట్ల కూడా చనువు చూపిస్తున్నాడని భావించింది చంద్రమతి. అందుకే పిల్లవాడ్ని శివరావు దగ్గరకు వెళ్ళకుండా కట్టడిచేసింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. పిల్లల సంరక్షణలో మునిగిపోయినా శివరావు పట్ల కఠినంగా ఉండేది.
శివరావు ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి రెండు రోజులు ఉంచాడని చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పినా ఆమె కంగారు పడలేదు. ఆ విషయం గురించి శివరావుని అడగలేదు. ఆమెకు శారీరకంగా శివరావుతో అవసరం లేదు. తను కోరుకున్నట్టుగానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇక అతను ఎంత మందితో తిరిగినా తనకు అనవసరం. అయితే ఆడవాళ్ళ పిచ్చిలో పడి జీతం ఖర్చు పెట్టేస్తాడేమోననే అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని పటాపంచలు చేశాడు శివరావు.
అతను సాత్వికుడని చంద్రమతికి తెలుసు.
* * * *
ముళ్ళమీదకూర్చున్నట్టు బెంచీపైన కూర్చున్నాడు శివరావు. లాబ్ టెక్నీషియన్ టైప్ రైటర్ మీద ఏదో టైప్ చేస్తున్నాడు. టైప్ మిషన్ చప్పుడు అతని గుండెలను తాకుతోంది. తనలోని టెన్షన్ కనిపించకుండా ఉండటానికి పదేపదే సర్దుకుని కూర్చుంటున్నాడు.
పావుగంట తరువాత టెక్నీషియన్ టైప్ చెయ్యడం ముగించాడు. తను టైప్ చేసిన కాగితాన్ని ఓ సారి పరిశీలించి సంతకం చేశాడు. ఆ కాగితాన్ని కవరులో పెట్టి పేరు రాసి శివరావుని పిలిచి ఇచ్చాడు. శివరావు అతనికి డబ్బు చెల్లించి కవరుతో బయటకొచ్చాడు. రోడ్డు ప్రక్కన నిలబడి కవరు నుండి కాగితం బయటకు తీసి చూశాడు. అతని గుండె ఓ క్షణంపాటు ఆగి తిరిగి కొట్టుకుంది. అంతవరకూ మనసుని కల్లోల పరచిన ఆందోళన చేత్తో తీసేసినట్టు మాయమయింది. రిపోర్టుని కవరులో ఉంచి జేబులో పెట్టుకున్నాడు.
తను వెంటనే చెయ్యాల్సిన పని గుర్తొచ్చింది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సిటీ బస్ ఎక్కాడు. పూర్ణామార్కెట్ దగ్గర దిగి జనరల్ పోస్టాఫీసు వైపు నడిచాడు, లోపలకు ప్రవేశించి పరీక్షగా చూశాడు. అక్కడా మనుష్యులు తమ పనుల్లో నిమగ్నమై కనిపించారు.
యస్.టి.డి. కౌంటర్ దగ్గరకు నడిచి క్యూలో నిలుచున్నాడు. జేబులోంచి ఒక చీటీ తీసి చూశాడు. అందులో ఏడు అంకెలు వరుసగా రాసున్నాయి. కౌంటర్ లో కూర్చున్న ఉద్యోగి నెంబరు తిప్పి రిసీవర్ కష్టమర్ కి అందిస్తున్నాడు. క్యూ నెమ్మదిగా కదులుతోంది. అరగంట తరువాత కౌంటర్ లోని వ్యక్తికి చీటీ, యాభై రూపాయల నోటు అందించాడు. అతను చీటీ చూసి నెంబరు డయల్ చేశాడు. రెండోసారి ప్రయత్నించి రిసీవర్ ఇస్తూ చెప్పాడు,
"మాట్లాడండి...."
"బూత్ లోకి కనెక్షన్ ఇవ్వండి." చెప్పి బూత్ లోకి వెళ్ళాడు శివరావు.
బూత్ తలుపు మూసుకుంది. అతను మాట్లాడటం అద్దంలోంచి బయటకు కనిపిస్తోంది. ఓ నిముషం మాట్లాడి అతను బయట కొచ్చాడు. ఆ కాస్త సమయంలో అతని దుస్తులు చమటతో తడిచాయి. కౌంటర్ దగ్గరకు వచ్చి రసీదు, చిల్లర తీసుకున్నాడు.
బయటకి రాబోతూ హాలులో తిరుగుతున్న ఫ్యాన్ ని చూసి దాని క్రింద నిలబడ్డాడు. శరీరానికి గాలి తగిలి ప్రాణం హాయిగా ఉంది. ఆ హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాడు. మూసినా అతని కనురెప్పల వెనుక ఓ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
నాలుగు గంటల్లో మద్రాసు సెంట్రల్ స్టేషన్ నుండి హౌరా మెయిల్ బయలుదేరుతుంది. అది రేపు మధ్యాహ్నం విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి వస్తుంది. అందులోంచి నల్ల సూట్ వ్యక్తి ఒకతను దిగుతాడు.
అతన్ని కలవడంతో శివరావు తలపెట్టిన పని దాదాపు పూర్తవుతుంది.
కొన్ని క్షణాల తరువాత శివరావు కళ్ళు తెరిచాడు. అతని మనసు సంతోషంగా ఉండటం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. పబ్లిక్ టెలిఫోన్ దగ్గర నిలబడి ఏదో నెంబరు తిప్పుతున్న వ్యక్తి మీద శివరావు దృష్టి పడింది. ముప్పై ఇదు సంవత్సరాల వయసు ఉందే ఆ వ్యక్తిని యధాలాపంగా చూశాడతను.
ఆ వ్యక్తి తను డయల్ చేసిన నెంబరు దొరక్కపోవడం వల్ల రిసీవర్ క్రెడిల్ చేశాడు. కళ్ళజోడు తీసి అద్దాలు షర్టుతో తుడిచాడు. కళ్ళజోడు లేకపోతే ఏదో తక్కువైనట్టు మొహం బోసిగా కనిపిస్తోంది. అవేమీ శివరావు దృష్టిని ఆకర్షించలేదు.
