ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు
విజ్ఞానవేత్తలు నాగరికత పై తోలు వొలుస్తున్నారు
మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు
సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు
స్వార్ధజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయటం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
అతృప్త అశాంత ప్రజా పారావారతరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు
ఇంక రాజ్యాలు పాలించ నక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్-మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటేమార్గం
వెతికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరు దారిలేదు కదలండి కదలండి జై అని.
అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరీమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజా హితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి
* * *
---1950
