Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 26

    తాత్కాలిక పరాజయాలు  ఎన్ని తటస్థించినా  అంతిమ విజయం  నేనవలంబించిన  మార్గానికే సరోజా! ఒక్కసారి  పర్యావలోకవం  చేస్తే  మన కళ్ళ ఎదుట  కనబడుతున్న  సత్యమే ఇది.

    ఇవన్నీ నీకు చెప్తున్నాను. అర్ధమైనా  కాకున్నా వింటూ వుండు, మధ్యలో 'ఊఁ' కొడితే ఇంకా సంతోషం.

    ఈనాడు  పరిస్థితులు  తారుమారు అవుతున్నాయి. నేను కనే కలలు  అట్టే దూరంలో లేవని నా నమ్మకం. ఎందుకంటే...నేను ఆశావాదిని. నా చూపు ఎప్పుడూ  ముందుకే వుంటుంది. వెనక్కి  చూసే అలవాటే లేదు నాకు. భవిష్యత్తు మీదే నా నిఘా  ఎప్పుడూ ఉంటుంది.

    భవిష్యత్తు మీద  ఆశలు పెంచుకొని, తమ జీవితాశయాలను  భూతల స్వర్గంగా  భావించేవాళ్ళ సంఖ్య  ఈనాడు  పెరుగుతూ వస్తోంది. అభివృద్ధి నిరోధకులు  ఓడితుపోన్నారు. పరిష్కార మార్గాలు వెతుక్కోవాల్సిన  సవాలక్ష సమస్యలున్నాయి.

    మానవులంతా  సమానులే. జీవించే హక్కు  ప్రతీవాడికి వుంది. కానీ ఈనాడు మనుషుల్లో ఎన్నో హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. మనకి కావలసింది  ఇరవై ఒకటో  శతాబ్దపు మానవుడు. అయితే అది కేవలం నేను ఊహిస్తున్న  చిత్రమే  కానీ సాధించే ఆశయం కాదేమో?" అంటూ ఊరుకున్నారు.

    నేను మీ మాట్లాడలేదు. అయిదు నిముషాల తర్వాత "సరోజా" అని పిలిచి, "ఆకలి మంటలు పిక్చర్ గురించి  నీ అభిప్రాయం  చెప్పావు కావు. తీద్దామా వద్దా?" అని అడిగారు.

    "అదేమిటండీ? పిక్చరయితే  తియ్యమంటాను. కానీ ఎలా? డబ్బేది? ఇప్పటికే  చాలా నష్టపోయాం. గట్టిగా  మీ మాటని  కాదనలేకపోయిన పాపానికి రెండు లక్షలపైగా  క్షవరం అయ్యింది." అన్నాను.

    "ఫిల్ము తియ్యడానికి డబ్బు ప్రధానం  కాదు_అనే దృఢ నిశ్చయానికి  వచ్చాను సరోజా! ఒక ప్రొడక్షన్  మేనేజరే  చేతిలో చిల్లిగవ్వయినా  లేకుండా  ప్రారంభించి  ప్రొడ్యూసర్  అవుతున్నాడు. అలాగయ్యేవాళ్ళని  ఎందర్నో  చూశాను కూడా. కొందరు రచయితలు  తమ కలం బలంతో  ప్రోద్యూసర్లూ డైరెక్టర్లూ  మాత్రమే  కాక స్టూడియో అధిపతులు కూడా అయ్యారు.

    కానీ నా ధ్యేయం  వేరు. నేను నా కలం  బలంతో  నా ప్రజలలోకి వెళ్ళాలి. వాళ్ళకోసమే  నేను పిక్చర్ తీయదలచుకున్నాను. నేనే డైరెక్టు చేస్తాను.

    నేను తీయబోయే  చిత్రంలో  వీరోచితమైన  సాహసం  వుంటుంది. భీభత్సం, హాస్యం వుంటుంది. అన్నిటికన్నా  కష్టకాలంలో  మనిషిని మనిషి ఎలా ఆదుకోవాలో  చూపించే మానవత్వం ఉంటుంది." అన్నారు.


                                         శ్రీశ్రీ గారి నమ్మకం


    శ్రీశ్రీ గారి మాటలు  భావావేశంతో  సాగిపోతున్నాయి.

    "ఈనాటి  తెలుగు జీవితాన్ని, ఎటువంటి  పుక్కిటి పురాణాలూ  అభూత కల్పనలూ  జోడించకుండా  ప్రతిబింబించగల  ఫిల్మ్ తియ్యగలగడంకానీ, తీయించగలగడంకానీ  చెయ్యగలనని  నాకు గట్టి నమ్మకం వుంది.

    మన తెలుగువాళ్ళు  తెలుగు జీవితం  జోలికి  పోరు. లాభసాటి  దృష్టితో చూసే పెట్టుబడిదారీ  మనస్తత్వమే  దీనికి కారణం. ఈ లెక్కలో  మనకన్నా  బెంగాలీ, మలయాళీ, తమిళం  వాళ్ళు ఎంతో మెరుగు!

    దేనికైనా  మనల్ని  ఎదుర్కొనేది  డబ్బు సమస్య. నేనెలాగైనా  అవస్థపడి  'ఉషశ్రీ పిక్చర్స్' పేరిట  'ఆకలి మంటలు' తీస్తాను. దానికి నువ్వేసంగీత దర్శకత్వం చేద్దువుగాని" అన్నారు.

    "ఉషశ్రీ  పిక్చర్స్ పేరిటే కదండీ, ఇంతకు ముందు మనం రెండు పిక్చర్లు తీశాం" అన్నాను.

    "అవునులే! పెద్ద నటీనటులు  నా చిత్రానికి  అవసరంలేదు. కొత్తవాళ్ళకి అవకాశాలు కల్పిస్తాను. కొత్త తరహా  పద్ధతిలో  తీస్తాను. నేననుకున్న  విధంగా, నేను  చెప్పదలచుకున్నది సూటిగా  డొంకతిరుగుళ్ళు లేకుండా, ప్రజల హృదయాల్లో  హత్తుకుపోయేటట్టు  చెప్తాను. ఏమంటావు?" అన్నారు.

    "అలాగే! తప్పకుండా  మీ ఇష్టప్రకారం చెయ్యండి. కానీ మీకు  రాజా అన్నామలైపురంలో  ఓ ఇల్లు, మందపల్లిలో ఓ ఇల్లు వున్నాయన్నమాట  మరచిపోయి  ఏదైనా  చెయ్యండి. నాకు అభ్యంతరంలేదు. మీతో పాటు నేనూ కష్టపడతాను" అన్నాను.

    "కొంచెం కాఫీ ఇస్తావూ?" అని అడిగారు. ఇచ్చాను.

    "కిందకి పోదాం రండి" అన్నాను.

    "లేదు సరోజా! ఇక్కడే కొంతసేపు  వుందాం" అన్నారాయన.

    "ఏవండీ! ఇంతసేపూ  ప్రవాహంలా  చెప్పుకుపోయారు. నా సందేహం ఒకటి తీరుస్తారా?" అన్నాను.

    "అడుగు" అన్నారు.

    "మతం గురించి మీ అభిప్రాయం  ఏమిటండీ" అని అడిగాను.

    "సూర్యుడులాంటి  సత్యానికి  మబ్బులాంటిది  ఈ మతం. అనాది నుండీ  ఈ మతాలు  మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు  నిర్మించాయే తప్ప మనుషులందర్నీ  ఏ మతమూ  ఒక్కటిగా  చేయలేకపోయింది. అలా చేసే శక్తి  ఏ మతానికీ లేదు. పైగా  మనిషిమీద మనిషికి  వుండవలసిన  విశ్వాసాన్ని  లేకుండా చేస్తుందీ మతం. దేవుడనే  హేతువాద  దూరమైన భావాన్ని ఆరాధిస్తూ పోటీగా మూఢవిశ్వాసాలను  నిలబెడుతుంది. నన్నడిగితే  మనం ఈ మూఢవిశ్వాసాలతోనే  మొట్ట మొదట  పోరాడాలి.

    ఢంకాని  జోకొట్టాలని, అలల్ని  అరికట్టాలని, గాలిని ఉరితియ్యాలని కాదు మన ప్రయత్నం. ప్రయత్నించినా  అలా జరగడం  అసంభవమని  నేను  వేరే చెప్పక్కర్లేదు. ఎవ్వరైనా  గతాన్ని  గురించి ఆలోచించకపోయినా నష్టం లేదంటాను. రేపటి గురించి  ఈరోజే  ఆలోచించడం  మంచిదంటాను. మానవుడు  సమసమాజమనే  గమ్యం చేరడానికింకా  గాలకాల  పట్టవచ్చు. అందుకనే మనం  చేసే  ప్రయత్నంలో  లోటు  వుండకూడదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS