Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 25

 

వరద బాధితులకు చేయూత

    
    గతవారం, నెల్లూరు, చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో అకాలంగా భారీ వర్షాలు కురిసి, పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు విపరీత నష్టం సంభవించిన సంగతి గౌరవనీయులైన సభవారికి తెలుసు. జరిగిన నష్టాన్ని గురించి, తీసుకొంటున్న చర్యలగురించి, యితర వివరాలను గురించి ఎప్పటికప్పుడు గౌరవనీయులైన సభ్యులకు తెలియజేయడమౌతున్నది. ఆకాలంలో భారీ వర్షాలు కురిసాయి. సాధారణంగా ఫిబ్రవరిలో వర్షపాతం 10 మిల్లీ మీటర్లు మాత్రమే వుండగా మొన్న 300 నుంచి 400 మిల్లీ మీటర్ల వరకు కురిసింది. ప్రత్యక్షంగా చూసి అంచనా వేయడానికై వీలయిన సహాయం అందించడానికై, బాగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో నిన్న నేను పర్యటించాను. దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించడానికి గత గురువారమే వెళ్ళిరావాలనుకున్నాను కాని యిక్కడ శాసనసభ సమావేశాలకు సంబంధించి పనుల వొత్తిడివల్ల అప్పుడు వెళ్ళలేకపోయాను. దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళిన కారణంగా నిన్నటి రోజున శాసనసభకు హాజరుకాలేకపోయినందుకు విచారిస్తున్నాను.
    నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరు పేట తాలూకాలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి జిల్లాలను నేను సందర్శించాను. ఈ భారీ వర్షాలవల్ల వరదలవల్ల, యిళ్ళు అంతగా దెబ్బతినకపోయినా పంటలకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది. కోతకు సిద్దంగా వున్న ధాన్యమూ, అంతకు ముందే కోసి యింకా పంట కళ్లాలలోనే వుంచిన ధాన్యమూ, అంతకు ముందే కోసి యింకా పంట కళ్లాలలోనే వుంచిన ధాన్యమూ, బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ, మిర్చి, పొగాకు వంటి వాణిజ్య పంటలు నీటి ముంపుకు గురయ్యాయి. ఇంచుమించు పంటంతా నాశనమైంది. జొన్న పంట కూడా ఎక్కువగానే దెబ్బతిన్నది. చాలా సేద్యపు నీటి చెరువులకు గండ్లు పడ్డాయి. చెరువులు బాగా దెబ్బతిన్నాయి. అసాధారణమైన నీటి ప్రవాహంవల్ల వరద కట్టలు, పంట కాలువలకు అనేక చోట్ల గండ్లు పడ్డాయి. రోడ్లకు కూడా బాగా నష్టం వాటిల్లింది. పంటలకు,ప్రభుత్వ ఆస్తులకు, ప్రయివేటు ఆస్తులకు జరిగిన నష్టం సుమారు 50 - 60 కోట్ల రూపాయల మేరకు వుంటుందని అంచనా.
    ఈ ప్రాంతాలలోని ప్రజలకు సహాయపడడానికై ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలగురించి నిన్నటి రోజున నా మంత్రివర్గ సహచరులైన రెవిన్యూమంత్రి గారు గౌరవనీయులైన సభవారికి తెలియచేశారు. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వరిపంట బాగా దెబ్బతిన్నది. ఈ ధాన్యాన్ని రైతులుఅమ్ముకోడానికి వీలుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది.
    నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రైతు సోదరులు ఎదుర్కొన్న యీ విపత్తునుంచి వారిని ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటున్నది.
    అవేమిటంటే-
    నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని రైతులు దెబ్బతిన్న తమ ధాన్యాన్ని రాష్ట్రం వెలుపల అమ్ముకోడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. ఈ వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న ధాన్యాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిన ధరలకు తక్కువ కాకుండా చెల్లించి కొనుగోలు చేసి రాష్ట్రం వెలుపలకు తరలించే ఏర్పాట్లు చేయాల్సిందిగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల సహకార మార్కెటింగ్ సంఘాలను, యితర స్థానిక సహకార సంఘాలకు ఆదేశించడం జరిగింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ధరకు తక్కువ కాకుండా యీ దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, దీనిని ఉప్పుడు బియ్యంగా మార్చి భారత ఆహారసంస్థ ప్రమాణాలతోనూ, లెవితోనూ నిమిత్తం లేకుండా రాష్ట్రం వెలుపల మార్కెట్లలో అమ్మకం జరపవలసిందిగా తగినంతగా ఉప్పుడు బియ్యం ఆడే సౌకర్యాలు వున్న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మిల్లర్లకూ ఆదేశాలివ్వడం జరిగింది.
    వరి పంటా, ధాన్యం దెబ్బతిన్న యీ రెండు జిల్లాలలోనూ రైతులకు, ప్రభుత్వం తీసుకున్న యీ మూడు సహాయక చర్యలవల్లా గిట్టుబాటు ధర లభించగలదు. నెల్లూరు జిల్లాలో బహిరంగ మార్కెటులో బియ్యం ధర ఎక్కువగా వున్నట్టు కనిపించింది. ఇటీవల కురిసిన యీ భారీ వర్షాలవల్ల నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మార్కెట్లలోకి బియ్యం రావడం ఆలస్యం అయి యీ ధరలు మరీ ఎక్కువ అయ్యే ప్రమాదముంది.
    అందువల్ల బియ్యం ధరలు పెరిగిపోకుండా నిరోధించే వుద్దేశంతో నెల్లూరు జిల్లాలోని సూపర్ బజార్లు, సహకార స్టోర్సువంటి వాటి ద్వారా సరసమైన ధరలకు బియ్యం అమ్మడానికి వీలుగా 2,000 టన్నుల బియ్యాన్ని విడుదల చేయవలసిందిగా నేను ఆదేశాలు జారీచేశాను. నెల్లూరు జిల్లాలో పౌర పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో 2 రూపాయలకు అమ్మడానికి నెలవారీ పంపిణీకి ఉద్దేశించిన 5,250 టన్నుల బియ్యం కాక యీ మొత్తం అదనం. ఈ 2,000 టన్నుల బియ్యం నిల్వలను చుట్టుపట్ల జిల్లాలనుంచి నెల్లూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వెనువెంటనే తరలిస్తున్నది.
    అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని బహిరంగ మార్కెటులో బియ్యం ధరలను పెరగకుండా నిరోధించే ఉద్దేశంతో పౌర సరఫరాల సంస్థ చిత్తూరు జిల్లాకు 1,000 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నది.
    మామూలుగా యీ జిల్లాలో కిలో 2 రూపాయలకు పంపిణీ చేసేందుకు ప్రతి నెల ఉద్దేశించిన 7,500 టన్నుల బియ్యం కాక యీ వెయ్యిటన్నులు అదనం.
    ఈ భారీ వర్షాలవల్లా, వరదలవల్లా చనిపోయినవ్యక్తిదగ్గరి బంధువులకు 2,000 రూపాయలు, కొద్దిగా దెబ్బతిన్న యిళ్ళకు 75 రూపాయలు, పూర్తిగా దెబ్బతిన్న యిళ్ళకు 250 రూపాయల చొప్పున యివ్వడానికి, ఇళ్ళు మునిగి దెబ్బతిన్న కుటుంబాలకు 75 రూపాయల మేరకు విలువ గల వస్త్రాలు యివ్వడానికి ఉత్తరువులు జారీ చేశాం. పల్లపు ప్రాంతాల్లో వున్న కాలనీవాసులకు మెరక ప్రాంతాలకు తరలించి, వారికీ పక్కా యిళ్ళ నిర్మాణం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం యివ్వడం జరుగుతుంది. వర్షాలకు, వరదలకు గురైన ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం అందజేయడం జరుగుతున్నది. దెబ్బతిన్న ప్రాంతాల్లో పశుగ్రాసం పెంపకానికి రైతులకు మినీకిట్లు అందజేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీటి తీరువాను ప్రస్తుతం రద్దు చేయడానికి, రుణాలు తదితర బకాయీల వసూళ్ళను వాయిదా వేయడానికి వీలుగా దెబ్బతిన్న గ్రామాలను ప్రకటించవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండో పంటకు నీటిని సరఫరా చేయడానికి వీలుగా సేద్యపు నీటి వనరులకు అవసరమైన మరమ్మత్తులను చేపట్టేందుకు 13 లక్షల రూపాయలు విడుదల చేయడానికి ఉత్తర్వులు చేయడమైంది. రెండో పంట వరి వేయదలచిన రైతులకు సరఫరా చేసేందుకై తక్కువ కాలంలో పంటకొచ్చేవరి వంగడాలను రాష్ట్రంనుంచి, యితర రాష్ట్రాలనుంచి సేకరించడం జరుగుతున్నది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రైతులకు పంట రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దెబ్బతిన్న ప్రాంతాలకు రూ.80 లక్షల మేరకు ఐ.ఎమ్.ఎఫ్. రుణాలను విడుదల చేయడానికి ఉత్తరువులు జారీ అయ్యాయి. పంట రుణాలతో అనుబంధిస్తూ విత్తనాలు, ఎరువుల విషయంలో సన్నకారు రైతులకు, మార్జినల్ రైతులకు వరుసగా 25 శాతం, 331/2 శాతం సబ్సిడీ యివ్వడం జరుగుతుంది.
    జరిగిన నష్టం అపారంగా వున్న దృష్ట్యా సహాయం చేయవలసిందిగానూ, నష్టాన్ని అంచనా వేయడానికి ఒక పరిశీలక బృందాన్ని పంపించవలసిందిగానూ భారత ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. వెంటనే సహాయ కార్యక్రమాలకు, నీటివనరులు తదితర ప్రభుత్వ ఆస్తులు మరమ్మత్తు పనులు చేపట్టడానికి వీలుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
    
          నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వరద ప్రాంతాలలో పర్యటనపై రాష్ట్ర విధాన మండలిలో 1984 ఫిబ్రవరి 24 న

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS