Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 20


    ఈ సంగతులన్నీ విని నేను నాలిక కొరుక్కొన్నాను. మా ఆవిడ ముక్కుమీద వేలేసుకొంది. ఆవిడా కాసేపు ఊరుకొని ఏదో జ్ఞాపకం వచ్చినట్లు తెప్పరిల్లి అన్నది. అయితే, ఇంకోటి నాయనా? ఇల్లాగ పిచ్చిగా నానామాటలూ అంటున్నా, రోజల్లా ఇల్లాగ మాట్లాడరు. మధ్య-మధ్య బాగానే ఉంటారు గుబులుకింద వస్తుందో ఏమో, రోజుకు నాలుగైదుసార్లు ఇల్లా అంటూ ఉంటారు. ఈ తిక్క లేనపుడు మళ్ళీ బాగానే ఉంటారు.

    ఆ ముసలమ్మగారు ఇల్లాగ విచారపడి ఆఖరుకు కాంతం చెవిలో అన్నది. "ముసలిదాన్ని పట్టుకొని, పైగా, ముద్దు-ముద్దు అంటారమ్మా, ఎక్కడ చచ్చేదీ!"

    ఈ మాటలన్నీ విని నేనేమీ అనలేక పోయినాను. కాంతంమటుకు నవ్వు ఆపుకోలేక పోతున్నది, "నేనేమీ ఎరగనండీ పిన్నిగారూ" అన్నాను నేను చివరకు, నువ్వేమీ ఎరగక పోవటం ఏమిటి? నువ్వే చేశావు ఇదంతానూ!!
విరుగుడు మంత్రం ఏదైనా ఉచ్ఛాటన చెయ్యి బాబూ. మా తండ్రిని గదూ" అంటూ, నా గడ్డాన్ని మునివ్రేళ్ళతో తాకి బ్రతిమిలాడటం మొదలు పెట్టింది.

    ఆమె దుఃఖం కాస్త తగ్గటం చూచి కాంతం అన్నది. "పిన్నిగారండీ, అవ్వగారూ, మీ ముసలాయనకు పిచ్చిగాదది! మీయందు  ప్రేమ కనుపరుస్తున్నా."

    "పోనీ, నీమాటే నిజమనుకో. అల్లా అయితే మటుకు ముప్పై ఏళ్ళనుంచీ లేనిదీ...ఇప్పుడు ఇలాగ వికారం కలగటం మంచే అంటావా? అయినా, పిచ్చికాక పోవటం ఏమిటి?" అంటూ ఆవిడ మళ్ళీ విచారపడ్డది నేనూ, మా ఆవిడా ఒక్కసారి నవ్వుకొన్నాము.

    మీరు ఇల్లాగ నవ్వితే నా బ్రతుకు ఏం కావాలె చెప్పు తండ్రీ! పోనీ, ఏ భూతవైద్యుడి దగ్గరకైనా పోయి యింత విభూతి పట్టుకొద్దామా అంటే, నీవు చెప్పిన ఇంగ్లీషు మంత్రానికి అది పని చేస్తుందో చేయదో!! నా బాబుకదూ ఎట్లాగయినా నువ్వే దీనికి మళ్ళీ ఇంగ్లీషులోనే ఉచ్ఛాటన చేసినన్ను బైట పడెయ్యాలె" అంటూ ఆవిడ మళ్ళీ బ్రతిమిలాడింది.

    ఆవిడను తృప్తి పరచటానికి ఒకటే మార్గం ఉందని తోచింది, అదేమిటి సరే ననటం, అందుకని నేనన్నాను "పిన్నిగారూ, పొరపాటే జరిగింది. నేను మళ్ళీ ఇంగ్లీషులో ఉచ్ఛాటన చేసి ఇదంతా పోగొడతాను మీరేమీ భయపడకండి" అని.

    ఆమెగారు ఈ మాటలు విని అమితంగా సంతోషించింది. "మా నాయనే, నీకు ఆడపిల్ల పుడుతుంది నాయనా, తప్పకుండా చెయ్యి" అని నన్నూ, మా ఆవిడనూ దీవించి వెళ్ళిపోయింది,

    ఆవిడ వెళ్ళిపోయిన తరువాత కాంతం నవ్వు ఆపుకొని నాతో అన్నది_"మీరు పొరపాటు చేశారు ఈమె గారికి కూడా ఉపదేశం చెయ్యాలిసింది" అని.

    "ఏమని" అని అడిగాను నేను.

    "ఏమనా? ఆయనకు చెప్పినట్లుగానే, మొగుడి గుణసంపదనూ, సౌందర్యాన్ని మెచ్చుకోమని,"

    నేను మాట్లాడలేదు.

    ఆవిడ మళ్ళీ ఎత్తుకొని ఇల్లాగ అన్నది. "మొగుడితో ఆవిడ ఇల్లాగ అనాలె_"ఓ ప్రాణనాధా, ఓ నవమన్మధా, మీ మోహనమూర్తి సందర్శనమే నాకు తన్మయత్వం కలిగిస్తుంది. మీ ముఖ చంద్రబింబ సందర్శనమే నా హృదయ గంభీరసాగరాన్ని పొంగు లెత్తిస్తుంది. మీ మధురమయిన పలుకులే..."

    "చాలించు" అన్నాను విసుగ్గా,

    "ఏం?" అన్నది నవ్వుతూ.

    "వెక్కిరిస్తే సహించే స్థితిలో లేను నేను, ఇప్పటికే చాలా విచారపడుతున్నాను. అసలు ఇల్లాగ అవుతుందని అనుకోలేదు" అంటూ నేను మేడ పైకి గబ_గబా వెళ్ళిపోయాను.

                                   * * *    
                           
మా ఆవిడ భక్తి
           
    ఈ మధ్య భజనల హడావుడి ఎక్కువైంది. ఇంటింటా భజనలు బయలుదేరినవి. మా ప్రాంతాల రామభజనలు ఆగిపోయి పాండురంగ భజనలు విరివిగా కొన్నాళ్ళు సాగి, ఇప్పుడు అవికూడా అంతరించినవి. ఈ భజనల విషయం కూడా అదో గాలిపాటా, స్థానిక ప్రభుత్వాధికారులవలె, ఈ దేవుళ్ళూ భజనలు పొందే అధికారం కొంతకాలానికి పోగొట్టుకొంటారు.

    పాండురంగ విఠల్ భజనలు వెనుకబడే సమయానికి కాకినాడ నుంచి ఒక్క కుటుంబం వచ్చింది. ఒక సామాన్యవాక్యంలాగా ఒక చిన్న సామాన్య కుటుంబం అదీనూ ఇద్దరితో మాత్రం కూడుకున్నది కర్త, క్రియ మాత్రమే కర్మ లేదు.

    వాళ్ళు వచ్చి హరనాధ్బాబా భజనలు ప్రారంభించారు. ఈ భజనలు చూడడానికి జనం విరగబడ్డారు. కాకినాడ నుంచి వచ్చిన ఆ కుటుంబంలో ఆ ముసలి ఆవిడే భక్తురాలు. దబ్బపండులాంటి ముత్తయిదువ. ఆమె పరమ భక్తురాలులాగ కనపడుతుంది, భజనలు జరిపేది ఆమెగారే! ఆమె భర్త చద్ది అన్నం తిని ఎంచక్కా వీధి అరుగుపైన కూర్చుని చుట్ట కాలుస్తూ ఉంటాడు. జహంగీరు చక్రవర్తి రాజ్యకార్య నిర్వహణ భారమంతా నూర్జహాన్ కు వదలివేసి "నాకు ఓ మాంసం ముక్కా, ఓ డొక్కు సారాయి యిస్తే చాలు" నన్నాడట! ఈ పెద్దమనిషి అదే వరస.

    ఆ భక్తురాలు మట్టుకు తన్మయత్వం పొంది అద్వితీయమైన భక్తిలో మునిగిపోతుంది. భక్తరాండ్రు కూడా ఆ కాస్సేపూ, ఆనందంలో చిందులాడుతారు.

    భజన ప్రారంభంలోనే, ఆవిడ, హరనాథ బాబా పటం అక్కడ పెట్టేసి, దానిముందు వెన్న_పాలూ_అరటి పండ్లూ_అప్పాలూ మొదలైనవి ఆరగింపుకై ఉంచుతుంది. అక్కడ నుంచి అఖండమైన భజనానంతరం ఆ వస్తువులలో ఏదో ఒకటి ఆయన ఆరగించిపోవటం, ఇది జరుగుతున్న పని.

    బాబా ఆరగించి పోవటం అంటే, ఏదో ఇక వస్తువు అక్కడ నుంచి మాయమయిపోవటమే. భగవంతుడా బాబా అవతారంలో, ఇల్లాగ పదిమందిలోకీ వచ్చి ప్రత్యక్షంగా భక్తులుంచిన ప్రసాదాన్ని ఆరగించి పోవటం బహుచిత్రం అవటం మూలాన జనం విరగబడటం సాగించారు, ఆమె మరీ ఉత్సాహంతో భజనలు సాగించింది.

    కొందరు ఆమెను అనుమానించారు. ఏమన్నా మాయజేస్తున్నదేమోనని. ఆమె కొందరు స్త్రీలను ఒక ప్రత్యేకమయిన గదిలోకి పిలిచి, వివస్త్రయై ఎక్కడా యేమీ దాచిపెట్టలేదని రుజువు యిచ్చింది. అపళంగా, అందరికీ నమ్మకం కలిగింది నిజంగానే హరనాథబాబే, ఈ వస్తువులు ఎత్తుకొనిపోయి భుజిస్తున్నాడని ,

    ఆమె...అక్కడ ఆ వస్తువులు పెడుతుందీ...దూరంగా కూర్చుని భజన చేస్తుంది, నీ కళ్ళు ఆ వస్తువుల మీదనే ఉంచు-నీకు నమ్మకం లేకపోతే, భజన పూర్తి అయ్యేటప్పటికి చూడూ_ఏదో ఒకటి ఆయన ఎత్తుకొనిపోయి వుంటాడు ఇదేమిటి గారడీ కాదు. మాయ కాదు. మంత్రం గాదు, తంత్రం గాదు నిజంగా జరుగుతూ వున్న విషయం.        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS