అమలాపురం నించి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలు ఆయె సమయానికి శ్రీకాకుళం చేరుకున్నాను. సాంప్రదాయకమయిన కుటుంబంలో పుట్టాను మా నాన్నగారు ఎర్రమట్టితో అలికి తెల్లసున్నంతో ముగ్గులు దిద్దిన అరుగు మీద కూర్చుని శిష్యులకు వేదపనసులు చెప్పటం యింకా చెవుల్లో మారుమౌగుతోంది.
మారిపోతున్న కాలగతిని మంచి మనసుతో అర్ధం చేసుకుని నేను కోరిన చదువు చెప్పించిన నాన్నగారి పాదపద్మాలను గుండెల్లో పెట్టుకుని పూజించాలనిపిస్తుంది.
వారు జ్ఞాపకం రాగానే మనసు కృతజ్ఞతా భావంతో నిండుతుంది. ఆలోచనల మధ్య వుండి ప్రయాణం చేయవలసిన దారి ఎంత ప్రమాదకరమయినదో నేను ఆలోచించలేదు.
శ్రీకాకుళం నుంచి కళింగపట్నం పోవాలి. తరువాత వంశధారను దాటివీరన్న పేట , కోటబొమ్మాలి, నౌపాడా, నావల్ రేవులమీదుగా పలాసను చేరుకోవాలి. అంతా అడవి దారులు. సరి అయిన ప్రయాణ సౌకర్యాలు లేవు.
అయినా నేను శ్రీకాకుళం లో మకాం చేయకుండా బయలుదేరాను. వంశధారను చీకటి పడుతూ వుండగా పడవ మీద దాటి అవతల గట్టుకు చేరాను. నరసన్న పేట వరకూ సుఖంగానే పోయాను.
కోటబొమ్మాలి మీదుగా నౌపాడాకు చేరుకుంటే అక్కడ నించి ప్రయాణం చాల తేలిక. నౌపాడా నించి నావల్ రేవు మీదుగా పలాసకు మోటారు సౌకర్యం వుంది.
కోటబొమ్మాలి నించి నౌపాడాకు బండి మీద బయలుదేరాను. అప్పటికి సమయం ఎనిమిది గంటలు దాటింది. బండి తోలే యువకుడు ఒక సవర జాతీయుడు. అతడికి అడవి దారులు బాగా తెలుసు. ఆటవిక జీవితాన్ని విడిచి పెట్టి బండితోలుకుని జీవనం సాగిస్తున్నాడు.
నాగరికమయిన జీవితానికి రవంత అలవాటు పడ్డాడు. సవరలలో వుండే ఉత్తమ లక్షణం -- వారికి దొంగతనం తెలియదు. రూపాయల కట్టల్ని రాశిపోసి వాటికి వారిని కాపు పెట్టి వెళ్ళినా భయం వుండదు. మనం తిరిగి వచ్చాక యిచ్చే పావలా, అర్ధా తీసుకుని అతడు తృప్తి పడగలడు. బండి తోలే యుకుడు అలాంటి సవర జాతీయుడు. అతడు పేరు గోమంగో! ఎంతో వినయంగా మాట్లాడాడు.
అర్ధరాత్రి అయినా, అడవి దారి అయినా అతని మాటలు వింటున్నప్పుడు నాకు రవంత అయినా భయమనిపించలేదు. కాని కోట బొమ్మాలి దాటాక రెండు క్రోసుల దూరం అడవి దారుల వెంట ప్రయాణం పూర్తి అయాక ప్రపంచం మునిగిపోతున్నంతగా మబ్బులు కమ్మినాయి.
తూర్పు సముద్రం ఆ ప్రాంతాలకు సమీపంలోనే వుంది. సముద్రం మీది నించి లేచివచ్చిన కాటుక కొండల్లాంటి రాకాసి మబ్బులు వర్ధించటం ప్రారంభించినాయి. గోమంగో రవంత కంగారుపడిపోయినాడు.
మరి కొంతదూరం పోయాక బురదలో చక్రాలు కూరుకుపోతున్నాయి అని గమనించాను. ఎద్దులు అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసంతో వగర్చుతున్నాయి.
మెరుపులు మెరుస్తున్నాయి కన్నులు చెదిరిపోయేలాగ! వురుములు వురుముతున్నాయి గుండెలు చెదిరిపోయేలాగ !!
మెరుపుల వెలుగులో వాటి అవస్థ గమనించక ఇంక ప్రయాణం నిలుపు చేయటమే మంచిపని నాకనిపించింది.
"సవరదొరా! వర్షం తగ్గేవరకూ బండి నిలుపుచేస్తే మంచిదేమో!" అన్నాను. అందుకు అతడు రవంత చలించినట్లు కన్పించాడు.
'అమ్మాయిగారూ! ఇది చాల ప్రమాదకరమయిన చోటు. మీరు ఒక్కరూ వచ్చి వుండవలసింది కాదు. నేనున్నా చేయగలిగింది లేదు. ఈ రాత్రికి ఎక్కడయినా తలదాచుకుంటే మంచిదేమో !" అన్నాడు.
"ఇక్కడ ఊరులాంటిదేమీ లేదు కదా!" అన్నాను.
"దగ్గరలోనే మా సవరలు వుండే గూడెం ఒకటి నాకు తెలుసు. అక్కడ తల దాచుకుంటే ప్రొద్దుటే వెళ్ళిపోవచ్చు." అన్నాడు.
అతడు ఇందాకటినించీ చెప్పిన మాటలు అసత్యాలయి వుండవచ్చు. అతడి సత్ప్రవర్తన అంతా నటన కూడా అయి వుండవచ్చు. గోమంగో మోసకారి అయినా అయి వుండవచ్చు.
కాని నాకు మాత్రం అతని ప్రతిపాదన కాదనాలని అనిపించలేదు "సరే" అన్నాను.
గోమంగో బండిని ఒక పలాస చెట్టు క్రింద నిలిపి ఎడ్లను విప్పేశాడు . అవి గుండెల నిండా దుమ్ము తీసుకున్నాయి.
అతడు దగ్గరలోనే అన్న మాటకు అర్ధం సరిగా గంటసేపు నడవాల్సి వచ్చింది. చిన్న చిన్న అడుగులు వేస్త్గూ నాకు దారి చూపాడు. మెరుపు మెరిసినప్పుడు కొద్దిమేర దారిని గుర్తించటం, చీకటితో అందాకా నడవటం -- తిరిగి మెరుపు కోసం ఆశగా ఎదురు చూడటం ! అలా సాగింది మా ప్రయాణం. ఎలాగైతేనేం సవర గూడెం ఒక మెరుపు వెలుగులో నా కంట పడింది. మద్ది పలాస, చిట్రేగి, చూత వృక్షాల మధ్య ఒదిగిపోయి బిక్కుబిక్కుమంటూ కన్పించింది గూడెం.
వలయాకారంగా ఉన్న రెల్లు పాకలు పదిపన్నెండుదాకా వున్నాయి. వాటి ,మధ్యలో వెలుగుతున్న నెగడు వర్షానికి తడిసి చప్పగా చల్లారిపోయి చింతమొద్దులు సగం కాలిన శవాల్లా కన్పించాయి. సవరలు మా అలికిడి విని తలుపులు తెరచి చూడసాగారు. తలుపులంటే అవి వెదురు చీలికలతో అల్లిన అభ్యంతరాలు మాత్రమే. గోమంగో వారిలో కొందరిని పలకరించి తన కంఠం వినిపించాడు. వారు అతని కంఠస్వరాన్ని గుర్తించి మళ్ళీ వెదురు చీలికల అభ్యంతరాలను మూసి లోపల సర్దుకున్నారు.
గోమంగో సరాసరి ఆ సవర గూడెం పెద్ద అయిన దోశబెహార పాక దగ్గరకు నన్ను తీసుకుపోయినాడు. అది కొంచెం పెద్దపాక, గోమంగో అతని కంఠస్వరం విని అభ్యంతరాన్ని తెరిచాడు.
చికిరిబాకిరిగా పెరిగిపోయిన గడ్డమూ, పొడవయిన పడగమీసాలూ అనాచ్చాదితమయి రోమాలతో నిండి కన్పించే వక్షస్సూ చాలా మొరటయిన కడియాలూ, దండ చేతులకు రాగి వలయాలూ చాలా భయంకరంగా కన్పించాడతను.
కాని స్వభావరీత్యా అతను సౌజన్యమూర్తి.
నన్ను ఎంతో గౌరవించాడు. వెదురు బియ్యపు పిండితో చేసి నిప్పుల మీద కాల్చిన రొట్టెలు, తేనే యిచ్చాడు. రొట్టెలలో తినేందుకు ఉప్పు కారం లేని బొద్దాకు కూర పెట్టాడు.
వెదురు గొట్టంలోంచి కొయ్య లోటాలోని కమ్మని మంచినీరు ఒంపి యిచ్చాడు. నా గురించి జాగ్రత్తలు చెప్పి గోమంగో వెళ్ళిపోయినాడు. వారి మర్యాదలు నా మనసుని అలరించినాయి.
"దొరకూనా! నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత. సపరలబండిలో రాత్రి ప్రయాణం చేయాలని నీవు బయలుదేరినావు అంటే మా సవరం మంచితనం మీద నీకు నమ్మిక ఉన్నదనే కదా అర్ధం. నీ నమ్మికను నిలబెట్టుకోవటం మా పని; నీవు తిరిగి బయట ప్రపంచంలోకి పోయాక మా గురించి మంచిగా చెప్పాలి కదా! ఆ విధంగానూ సపరల పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకు అవసరమయితే మా ప్రాణాలు అయినా ఇచ్చే స్తాము. నిన్ను నౌపాడా చేర్చే బాధ్యత మాది.
"నీవు నిశ్చింతగా ఉండు తల్లీ! నేను నిన్ను కన్న తండ్రినే అనుకో! బిడ్డ బాగోగులు తండ్రివి కావా!" అన్నాడతడు. సౌజన్య సంపూర్ణమయిన ఆ అటవీకుని హృదయ స్పందనలు తెలిశాక " నా కనులు చెమరించినాయి. నా తండ్రి వేద వేదాంగవేత్త.
మట్టి అరుగులపై కూర్చుని అతడు వల్లించిన వేద నాదాలు కోనసీమ అంతటా ప్రతిధ్వనించినాయి. అతడెంతో విద్యాధికుడు అయినా సౌజన్యమూర్తి. కాని విద్యాగంధం ఇసుమంతయినా ఎదుగని ఈ దొర బెహరా మంచితనంలో నా తండ్రికి సాటివాడే అనిపించాడు.
ఆటవికుడనీ, గిరిజనుడనీ అతని ఔన్నత్యాన్ని గుర్తించలేని నాగారిక సమాజం అతని పాదాల చెంత సాగిలి మ్రొక్కాలని అనిపించింది నాకొక పులితోలు యిచ్చాడు.
దాన్ని నేలమీద పరుచుకుని పడుకున్నాను. ఇలా పడుకుని అటు చూచేసరికి అతడు నిద్రపోయినాడు. ఎంత నిర్మలయిన మనసు అయితే అలా వెంటనే నిద్ర పట్టిందో మరి? ఎందరు నాగరికులు అటువంటి ప్రత్యెక పరిస్థితిలలో రెప్పవేయగానే నిద్రపట్టించుకోగలరు అనిపించింది.
