Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 20

    చిత్తూరుదగ్గర నారగుంటపాళెం వాస్తవ్యులు ఇంజేటి తిమ్మయార్యుడు కూడ నందవరీక శాఖకు చెందినవాడే. కాశీనుండి వలస వచ్చిన పదమూడు గోత్రాలకి చెందిన ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలు ఈ శాఖకు చెందినవి. నందుడనే పాండవ వంశరాజు సతీసమేతుడై కాశీకి వెళ్ళాడట. ఆ తీర్థయాత్ర సమయంలో రాజుగారి భార్య బయట చేరింది. తన యాత్ర నిష్ఫలం అవుతుందని బాధపడిన రాజు అక్కడున్న బ్రాహ్మణులను దానికి పరిష్కారం చూపమని ప్రార్థించాడు. తమకి నందరాజు రాజ్యంలో నివాసానికి వీలుకల్పిస్తే ఆ అవాంతరం నుండి తప్పిస్తామని కొంతమంది బ్రాహ్మణులు ముందుకు వచ్చారు. రాజు తమ కోరిక తీరుస్తామనటంతో వారు రాజపత్నిని తమ మంత్రిశక్తితో పునీతనుచేసి, కాశీయాత్రను ఫలవంతం చేశారు. ఆ రాజు వెంటనే తన నగరానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత కరువు కారణంగా ఆ బ్రాహ్మణులు కాశీని వదలిపెట్టి నందరాజు వద్దకు వచ్చి తమకిచ్చిన మాటను గుర్తుచేశారు. రాజు తానిచ్చిన మాటను మరవలేదు. వారు తమకు చేసిన మహోపకారాన్నీ మరవలేదు. అందుకనే తన నివాసస్థానమైన "నందవర" మనే అగ్రహారాన్ని వారికి ఇచ్చాడు. ఈ నందవరం బనగానపల్లి సమీపంలో ఉంది. వీరు ఋగ్వేదులు, అశ్వలాయనసూత్రులు, శాక్తేయులు. తమ కులదైవం అయిన (చౌడేశ్వరీ, చాముండేశ్వరి) శ్రీ చౌడమాంబాదేవి ఆలయాన్ని నందవరంలో నిర్మించుకుని స్థిరపడ్డారు. కాని కాలక్రమేణ వారి సంతతి చుట్టుపక్కల గ్రామాలకి విస్తరించింది. ఎక్కడికి వెళ్ళినా నందవరం నుండే వెళ్ళారు కనక వీరందరికీ 'నందవరీకులు' అనే పేరు స్థిరపడింది. వారు స్థిరపడిన గ్రామనామాలే వారి ఇంటిపెరులుగా అయినాయి - అటువంటి వాటిలో కానాల, ఇంజేడు, తాళ్ళపాక, రేవణూరు మొదలైనవి కొన్ని.
    నందవరీక శాఖకు చెందిన కానాల కృష్ణయార్యుని కుమార్తె వెంకమాంబ వివాహం నందవరీక శాఖకు చెందిన శ్రీవత్స గోత్రుడు ఇంజేటి తిమ్మయార్యుని కుమారుడు వేంకటాచలపతితో అంగరంగ వైభవంగా అయిదురోజులపాటు జరిగింది. గ్రామంలోనూ చుట్టుప్రక్కలా ఎవ్వరూ ఇంట్లో పొయ్యి రాజెయ్యలేదు. కొంతకాలంపాటు నలుగురు కలిస్తే మాట్లాడుకున్న అంశం ఈ పెళ్ళే. పెళ్ళికూతురు అందం, పెళ్ళికొడుకు అందం, ఇద్దరి ముచ్చటైన జంట, భోజనాలు, మర్యాదలు, అలంకారాలు ఒకటేమిటి అన్నింటి గురించీ కథలు కథలుగా చెప్పుకున్నారు.  
    వెంకమాంబ అత్తమామలు మురిసిపోయారు కోడలి అందం, బుద్ధి, పాట, పనిపాటలు, భక్తిశ్రద్ధలు చూసి. అమ్మలక్కలు అన్న మాటలు అసూయతో అన్నవి అని కొట్టిపారేసింది అత్తగారు. అంతా తన మిత్రుడి ఇష్టం కనక తనకేం పట్టనట్టు ఉండిపోయింది వెంకమాంబ. తన సఖుడిని చూసి చిరునవ్వు నవ్వుతుంటే, అతడు చెప్పే మాటలకి ఆనందపడుతుంటే, అందరూ వెంకమాంబకీ పెళ్ళి ఇష్టమే ననుకున్నారు. "అమ్మయ్య! వెంకమ్మ కూడా మనలాంటిదే ముందు సిగ్గుతో పెళ్ళి వద్దన్నా హాయిగా ఆనందంగా చేసుకుంది" అని ఒక రకమైన సంతోషం పొందారు ఊళ్ళోవాళ్ళు. అంతటి మంచి అత్తగారు దొరికిందని కొందరు, అందగాడైన భర్త దొరికాడని కొందరు, మంచి సంప్రదాయకుటుంబం అని కొందరు లోపల అసూయపడుతున్నా పైకి మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. సోమయాజి అనుయాయులు మాత్రం కృష్ణయార్యుడు తగిన సంబంధం తేలేకపోయాడు, ఊరూ పేరూ లేని వాడికిచ్చి కట్టబెట్టి చేతులు దులుపుకున్నాడు, తగిన శాస్తి అయింది అని సంబర పడ్డారు.
    కాపురానికి పంపే సమయానికి తమ కోడలిని సంసార జీవితానికి సంసిద్ధం చేయమని చెప్పి అత్తగారు నారగుంట పాళెం వెళ్ళిపోయారు. వేంకటాచలపతి వెంకమాంబ అందాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు. ఆమెతో మాట్లాడాలని, ఆ కాంతులీనే ముఖాన్ని చూస్తూ ఉండిపోవాలని, ఎంతో ముచ్చట పడ్డాడు. ఇంటికి వెళ్ళాక కూడా అదే ముఖం తనని వెంటాడుతూ ఉండిపోయింది. సంధ్యావందనం చేయాలని కూర్చుని గాయత్రిని ధ్యానించటానికి కళ్ళుమూసుకుంటే చిరునవ్వుతో వెంకమాంబ ముఖం. అది ధ్యానానికి జపానికి విఘ్నం కావటం లేదు. పైగా గాయత్రీ జపంలో ఇంతకు ముందుకన్నా ఎక్కువ ఆనందం కలుగుతోంది. పూజా సమయంలో చౌడేశ్వరీదేవి ముఖం వెంకమాంబ ముఖంలా కనిపించి, పూజ మరికాసేపు మరిన్ని స్తోత్రాలతో చేయాలనిపిస్తోంది. ముఖంలో కాంతి పెరుగుతోంది. పెళ్ళయ్యాక ముఖంలో కళ పెరిగిందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నమాట.
    మొదట్లో వెంకమాంబని చూడాలని తరచూ అనిపించేది వేంకటాచలపతికి, "అంతకు ముందు దాకా ముక్కుమొహం తెలియని మనిషిమీద ఇంత ఇష్టం ఎలా కలిగింది? ఇదంతా పెళ్ళిమంత్రాల ప్రభావం కాబోలు" అనుకున్నాడు. పైకి చెపితే అందరూ నవ్వుతారని చూడాలనే కోరికని ఎవరికీ తెలియనివ్వలేదు. ధ్యానంలో కనపడి ఆనందదాయకమౌతున్న వెంకమాంబ రానురానూ తనతోనే ఉంటున్నట్టు, తనలోనే భాగమైనట్టు అనిపించసాగింది. ఆపైన చూడాలనే కోరిక లేదు. నిరంతరం వెంకమాంబతో కలిసి ఉంటున్నట్టు ఆనందమే.
                                                            * * *
    "అమ్మా! బంగారు తల్లీ! ఎక్కడికి?"
    "గుడికి తాతగారూ!"
    "నీకు పెళ్ళయింది కదా! అలా రోజూ వీధులవెంట తిరగకూడదు"
    "నేను గుడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను."
    "గుడికయినా అన్నిసార్లు వెళ్ళటం ఎందుకు? ఇంటిపట్టున ఉండడం నేర్చుకో!"
    "ఏది నాయిల్లు?"
    "ఇప్పుడిది. రేపు అత్తగారిల్లే నీ ఇల్లు."
    "చూశారా! నా ఇల్లు ఎలా మారిపోయిందో! అన్నీ అంతే మారిపోతాయి. మారనిది దేవుడొక్కడే. అందుకే ఆయన నొక్కడినే మనం వదలకుండా ఉండాలి."
    "ఇది వితండవాదం. మోకాలికి బట్టతలకి ముడిపెట్టినట్టు. పెద్దవాడిని చెపుతున్నాను. విను."
    "సరే! బయలుదేరానుగా! ఈ పూటకి ఒక్కసారి వెళ్ళివస్తా! అంతే!"
    "రేపట్నించి గడపదాటవుగా!"
    "ప్రయత్నం చేస్తాను." అంటూ ముందుకి అడుగేసింది వెంకమాంబ.
    'తాను చేస్తున్నది సరైనదా? కాదా?' నిట్టూర్చారు పెద్దాయన.
                                   * * *
    "అమ్మా!
    "అత్తయ్య మడిలో ఉన్నారు. ఏం కావాలి?" మంగమాంబ పలికింది కృష్ణయార్యుని కేకకి.
    "వెంకు ఏది?"
    "పెరట్లో పూలు కోస్తోంది"
    "ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళుండి పిల్ల ఎక్కడుందో చూడలేరూ?"
    "... ... ..."
    "గుడిలో కుప్పిగంతు లేస్తోందిట."
    "... ... ..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS