"ఈ ట్రిక్కులూ, ఈ జిత్తులూ మాకు తెలీవు. అసలు మీసంబంధం మా కిష్టం లేదు. మీ చెల్లెలు చెడిపోక పోవొచ్చు. మీరందరూ చాలా పెద్దమనుషులే కావొచ్చు. కానీ నేను మావాడి కసలు పెళ్లే చెయ్యదల్చుకోలేదు. అది నా ఇష్టం. ఇంక మీరు వెళ్ళొచ్చు! క్షణం ఆలస్యం చేస్తే, పోలీసులని పిలవ్వలసొస్తుంది." అన్నారు సుబ్బారావుగారు.
"బాబూ! పెళ్ళనేది బెదిరింపులతో జరుగుతుందా? పద పోదాం! ఇదీ ఒకందుకు మంచిదే అయింది. తీరా పెళ్ళయ్యాక ఈ గొడవలొస్తే విడాకుల పర్వం ప్రారంభమయ్యేది. అంతకంటే ఇదేనయం. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. మన బాధ మనం పడతాం! పద!" చెయ్యిపట్టి బయటికి లాగారు విశ్వనాథంగారు.
"ఛీ! ఛీ! మీరు మనుషులు కారు పశువులు ? మీలో దయాదాక్షిణ్యాలూ, మానవత్వం, జాలి, ఏకోశానా లేవు. థూ! థూ!" అంటూ విశ్వనాథంగారి వెనకాలే, బయటికి నడిచాడు క్రాంతి.
ప్రపంచం అంతా చీకటిగా కనిపించింది !
బ్రతుకంతా శూన్యంలా అనిపించింది !
దుఃఖం ముంచుకొస్తూ వుంటే, విశ్వనాథంగారు పిలిచిన ఆటోలో ఎక్కి కూర్చుని పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు క్రాంతి. అతనిని ఓదార్చడం విశ్వనాథంగారికి చాతకాలేదు!
ఇంటిముందాగిన ఆటోని చూసి, పరుగెత్తు కొచ్చింది సీతాదేవి. క్రాంతి మొహం చూసి, నిశ్చేష్టురాలై నిలుచుండి పోయింది. ఆటోవాడి డబ్బిచ్చేసి లోపలికొస్తున్న విశ్వనాథంగారిని చూసి, "ఏమయిందండీ? క్రాంతి ఎందుకలా వున్నాడూ?" అని అడిగింది కంగారుగా. లోపలి నుంచి కావ్య పరుగెత్తుకొచ్చి, క్రాంతిని చూసి అక్కడే స్థాణువులా నిలుచుండి పోయింది.
జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పారు విశ్వనాథంగారు. సీతాదేవికి గుండె ఆగిపోయినట్టనిపించింది. వొళ్ళు చెమటలు పట్టింది. కళ్ళు గిర్రున తిరిగాయి! చీకట్లు తెరలు తెరలుగా కమ్మి ఏమీ కనిపించకుండా అయి "కావ్యా!" అంటూ పడిపోయింది! విశ్వనాథంగారు ఆమె మొహాన నీళ్ళు జల్లారు. లాభం లేకపోయింది. గుడ్లు తేలేస్తూన్న ఆమెని చూస్తే భయమేసింది విశ్వనాథంగారికి. వెంటనే ఆటోని పిలిచి, తనకి తెలిసిన డాక్టర్ మధుకర్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళారు. డాక్టర్ ఆమెని పరీక్షించి, ఆక్సిజన్ పెట్టాడు. ఎమర్జెన్సీ కేర్ లో వుంచాడు. సివియర్ అటాక్ వచ్చిందనీ, టైముకి తీసుకురావడంవల్ల నయమైందనీ, అయినా నలభై ఎనిమిది గంటలు దాటేవరకు ఏమీ చెప్పలేననీ అన్నాడు.
కావ్యకి పిచ్చెక్కినట్టయింది. 'ఇదంతా తనమూలానే జరిగిందన్న బాధ ఆమెని నలిపేస్తోంది. తను బ్రతికుంటే వీళ్ళందరికీ ఈ పాట్లు తప్పవని అనుకుంది. తను చనిపోవాలి! కొన్నాళ్ళు అమ్మా అన్నయ్యా బాధపడ్డా క్రమేణా మర్చిపోతారు. అన్నయ్య జీవితం బాగుండాలంటే, అమ్మ సుఖపడాలంటే, తను చచ్చిపోవాలి!" అనుకుంటూ లోపలికెళ్ళి అలమారలో ఎలుకల కోసం తెప్పించి పెట్టిన మందుని నీళ్ళలో కలిపి తాగేసింది. అది చూసిన పనిమనిషి గబగబా ఆటో తెచ్చి, సీతాదేవి వున్న నర్సింగ్ హోంకే తీసికెళ్ళింది కావ్యని ! అక్కడున్న క్రాంతి, కావ్యని చూసి కంగారుపడిపోయి, డాక్టరుకి చూపించాడు. "ఎందుకమ్మా నన్నిలా చిత్రవధ చేస్తున్నావ్?" ఎంతపని చేశావ్ ?" అంటూ తల బాదుకున్నాడు.
"నన్ను చావనివ్వండి డాక్టర్ ! నన్ను బతికించొద్దు" అంటూనే స్పృహ కోల్పోతున్న కావ్యకి స్టమక్ వాష్ చేసి, వార్డులో పడుకోనెట్టాడు డాక్టర్ !
తల్లీ, చెల్లీ ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు!
తను బ్రతుకుతో కుస్తీపడుతున్నాడు.
కళ్యాణి ఘడియలు ఒస్తాయనుకున్న ఆ ఇంట్లో మృత్యు ఘడియలు ముద్ర వేస్తున్నాయి. శోకం ఇల్లంతా నిండుకుంది. విలయతాండవం చేస్తోంది. క్రాంతి నర్సింగ్ హోంలో కూర్చునున్నాడు, కటిక చీకట్లోకి కూరుకుపోతూ!
విశ్వనాథంగారు ఈ క్రూర విధికి బలై పోతూన్న ఈ కుటుంబాన్ని చూస్తూ నిస్సహాయంగా నుంచున్నాడు!
క్షణంలో కాలం తాచుపాములా కాటేసింది ఆ కుటుంబాన్ని. చూస్తూ నిట్టూర్చడం తప్ప ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? మృత్యువుతో ముద్దం చేస్తూన్న ఆ తల్లీ బిడ్డలకేసి చూస్తుండిపోయారు విశ్వనాథంగారు.
11
విశ్వనాథంగారు నాలుగు రోజులు ఆఫీసుకి సెలవు పెట్టి విజయవాడలోనే వుండిపోయారు క్రాంతికి తోడుగా. "మామయ్యలని రమ్మని టెలిగ్రాం కొట్టు. వాళ్ళందరిదీ రక్త సంబంధం. నీకైనా తల్లి తరవాత మేన మామన్నారు. వీలయితే మీ అత్తయ్యలూ ఒస్తే బాగుంటుంది. ఆమెకి ఓదార్పుగానూ వుంటుంది, నీకు కాస్త సహాయంగానూ వుంటుంది" అన్నారు.
టెలిగ్రాము లిచ్చొచ్చాడు క్రాంతి !
పెద్ద మామయ్యా, రెండో మామయ్యా, పెద్దత్తయ్యా వొచ్చారు మిగిలినవాళ్ళకి వీలుపడలేదని.
కేవలం రెండు మూడు రోజులుండి పరామర్శించి వెళ్ళిపోవడానికే వొచ్చారు కానీ, ప్రేమతో వీరికేదైనా సహాయం చేద్దామని రాలేదని అర్ధమయి పోయింది క్రాంతికి, వాళ్ళ మాటల్లో.
"రానివాళ్ళెలాగూ రాలేదు, వొచ్చినవాళ్ళు ఏదో బాగుండదని చూసి పోవడానికొచ్చారు! ఈ మమతలూ, బంధుత్వం అంతా ఎలా హరించుకుపోయిందో? చిన్నప్పుడు నలుగురన్నదమ్ముల మధ్యన గారాల ఆడబిడ్డగానే పెరిగింది తనుకూడా! కాల్లో ముల్లు గుచ్చుకుంటే తనకి, వాళ్ళకి గుచ్చుకున్నంతగానే బాధపడేవారు. వారికేమైనా అయితే తనూ అలాగే బాధ పడేది. పెరుగుతూన్న కొద్దీ ఎవరి సంసారాలు వాళ్ళ కేర్పడి, మమతానురాగాలు కొంచెం సన్నగిల్లవచ్చు. ఎవరి బాధ్యతలలో వారు తలమునకలై వుండవచ్చు. కానీ, పూర్తిగా అభిమానాలూ, ఆప్యాయతలు రూపుమాసిపోవుగా!
మమతలు పంచుకోలేని, మనుషులు కలవని బాంధవ్యం ఎందుకు? ఎవరికి వారు గిరిగీసుకు కూర్చుంటే మనుగడకి అర్ధమేమిటి? అసలు మనుగడ ఎలా సాధ్యం?" ఒద్దన్నా వినకుండా ఆయాసపడుతూ మాట్లాడుతోంది సీతాదేవి!
"అమ్మా! డాక్టరు నిన్ను మాట్లాడొద్దన్నాడు. ఎందుకమ్మా ఆవేశపడతావ్? ఒచ్చిన వాళ్ళొస్తారు! రాని వాళ్ళు రారు! ఒచ్చి మాత్రం ఎవరైనా చేసేదేముంది? మన బాధ మనం పడవలసిందే కదా! అయినా అభిమానంతో పలకరించి వెళ్లే వాళ్ళు అయిదు నిమిషాల కోసం ఒచ్చి వెళ్ళినా చాలు. అభిమానం ఆప్యాయతా లేనిదీ, చుట్టం చూపుగా వొచ్చి వెళ్లేవాళ్ళు ఒస్తేయేం ? రాకపోతేయేం ? మనసులోకి ఏ ఆలోచనలూ రాకుండా, రెస్టుతీసుకో", అంటూ తండ్రి బిడ్డని ఓదారుస్తూన్నట్టు ఓదారుస్తున్న క్రాంతిని చూసి, కళ్ళు తుడుచుకుంటూ "నీ ముందు నేనే పసిబిడ్డలా అయిపోయాను బాబూ" అంది క్రాంతిని నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ.
"పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ వుంటే, తల్లితండ్రులు చెయ్యిపట్టుకుని నడక నేర్పిస్తారు, పడకుండా చూస్తారు. వయసొచ్చి పెద్దవాళ్ళు నడవలేనప్పుడు పిల్లల ఆసరా కోరుతారు. పిల్లల చెయ్యిపట్టుకుని నడవడంలోనే తృప్తి ననుభవిస్తారు. ఇది సృష్టి తీరమ్మా."
"ఎంతలో ఎంతవాడయి పోయాడు. మొన్నటి దాకా ఇంకా ముద్దలు కలిపి, ఇద్దరు పిల్లలకీ నోట్లో పెడుతూన్నట్టే వుంది. అప్పుడే ఇంతగా ఎదిగిపోయి తనకే పాఠాలు చెబుతున్నారు పిల్లలు." అనుకుని నవ్వుకుంది.
అంతలోనే కడుపులోంచి దేవినట్టయింది. ఇంత మంచి మనసున్న నా బిడ్డలకి దేముడెందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు ? ధర్మరాజు లాంటి తండ్రి కడుపున పుట్టి, ఏ ముద్దూ ముచ్చటా అనుభవించకుండానే, తండ్రిలేని వారయ్యారు. కష్టపడి చదువుకుంటూ తెలివి తేటలతో పైకొస్తూ వున్న సమయంలో, లేనిపోని గొడవల్లో చిక్కుకుని, వయసుకి మించిన బాధ్యతలతో, అంతకు మించిన బాధలతో కుళ్ళు సమాజపు క్రూర సంకెళ్ళలో నుంచి బయటపడలేక నలిగిపోతున్నారు. సతమతమైపోతున్నారు. అనుకునేసరికి గుండె కరిగి, అగ్నిపర్వతం బద్దలై లావా బయటికొచ్చినట్టు, దుఃఖం ముంచుకొచ్చింది. అంతలోనే టిఫిన్ కారియర్ పట్టుకుని కావ్య వొచ్చింది.
"నవ నవలాడుతూ ఆనందంగా తిరగవలసిన ఈ సమయంలో నవ్వుతూ, తుళ్ళుతూ హాయిగా రోజులు గడపవలసిన" ఈ వయస్సులో, మోయలేని నిందలు మోస్తూ, చెయ్యని తప్పుకి శిక్ష ననుభవిస్తూ ఎన్నో బాధలు పడుతూ, ఎంతో మనస్తాపాన్నను భవిస్తూన్న, ఆ పిల్లని చూడగానే, పసిపిల్లలా ఏడ్చేసింది సీతాదేవి.
"అమ్మా! ఏడవకమ్మా! నువ్వింకా కోలుకోలేదు. డాక్టరు నీకు రెస్టు కావాలని చెప్పాడు. మనసుని ప్రశాంతంగా వుంచుకునేలా చూడమన్నాడు. అమ్మా! నువ్వు మాతో సహకరించకపోతే, నీ ఆరోగ్యం బాగవకపోతే, మాకెవరున్నారు. చెప్పు" తల్లి చేతుల్లో మొహం పెట్టుకుని ఏడ్చింది కావ్య.
"కావ్యా! అమ్మని ఏడవొద్దని చెబుతూ ఆమె ఎదురుగుండానే నువ్వు ఏడుస్తూ వుంటే, ఆమె ఊరుకోకలదా ? లే! యూ స్టాప్....క్రయ్యింగ్!" అంటూ కావ్యని భుజాలు పట్టుకుని లేవనెత్తి కూర్చోబెట్టాడు క్రాంతి.
