అలసిన శరీరాలు వేరు పడ్డాయి.
"సునీల్..... మగాడివంటే నువ్వే..... యూ ఆర్ గ్రేట్ ప్లే బోయ్ . అందుకే నీతో అనుభవం అంటే, నాకు పిచ్చి మైకం కమ్ముకు వస్తుంది..... ఆరాధనగా అన్నదామె.
"థాంక్స్ యువర్ కాంప్లిమెంట్.... డబ్బు కోసమే అయినా అసంతృప్తితో డబ్బు విరజిమ్మే ఆడవాళ్ళ దగ్గరకు నేను వెళ్ళను . ఆ విషయం నీకు తెలిసిందేగా ....అన్నాడు సునీల్.
వకుళ మౌనంగా పర్సు తీసింది....
ఆమె ఇచ్చిన నోట్ల కట్టను లెక్క చూసుకోకుండానే సునీల్ జేబులో పెట్టుకుని బట్టలు వేసుకోసాగాడు. కండలు తిరిగిన అతని నిండు విగ్రహాన్ని తన్మయత్వంతో చూస్తూ వుండిపోయిందామే.
"సీయూ డార్లింగ్...."
"మళ్ళీ ఎప్పుడు తమ దర్శనం"
"ఏమిటి కొత్తగా అడుగుతున్నావు....నీకు తెలుసుగా.....నా ఫోన్ వుందిగా....నీకు ఎప్పుడు కావలసిన రింగ్ చేయి.... మరు నిమిషంలో నువ్వు రమ్మన్న చోటుకు వస్తాను" అంటూ వెళ్ళి పోయాడతను.
కనుమరుగు అవుతున్న సునీల్ వేపు ఆరాధన పూర్వకంగా చూసింది వకుళ.
వెరీ నైస్ గై .....శృంగారంలో దిట్ట..... అందంలో సమ్మోహనాకారుడు మాటల చాకచాక్యంలో బహు నేర్పరి.....ఇలాంటి వాడికి కాబోయే ఇల్లాలు ఎవరో కానీ అదృష్టవంతురాలు....
ఆ అదృష్టం తనకు దక్కక పోయింది కదా అనే నిరాశకు లోనయింది. వకుళ అంతరంగం.....చాలాసేపు అతని ఆలోచనలో వున్దిపోయిందామె...
* * *
విజయవాడ రైల్వే స్టేషన్లో...
ఇన్ స్పెక్టర్ ధీరజ ఆ కేసు పైలును మరొకసారి శ్రద్ధగా పరిశీలించింది.
తనకు అవసరం అయినా పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నది...
శవం ఉన్న గోతాన్ని ఇరవై అడుగుల ఎనిమిది అంగుళాల తాడుతో చుట్టి బంధించాడు. నలబై ఒక్క అంగుళాల పొడవు, ఇరవై ఆరు అంగుళాల వెడల్పు గల గొనె సంచి అది.
దాని మీద ఎఫ్. ఐ. సి. అని వ్రాసి దానికి సున్నా చుట్టబడి వున్నది.
అంటే, ఈ సంచి వాళ్ళ గోడౌన్ నుంచి తీసుకురావడం కానీ లేకపోతే వాళ్ళు గోనే సంచులను అమ్మిన షాపులో నుంచి కొనుక్కురావడం కానీ హంతకుడు చేసి వుండాలి.
ఇంకొక వేపు ఎస్. వి. బి. ఆర్ మిల్ దాని కిందుగా కే.సి. ఓ.ఆర్ .ఏమ్ . అనే అక్షరాలు దాని కింద ఎస్.కే. ఎల్ అనే అక్షరాలూ 95 కె.జి. దాని ప్రక్కనే 1993 -94 అని కూడా వున్నది.
గొనె సంచికు రెండవ వేపు ఇ.సి.ఆర్ - 111 అని యెర్ర ఇంకుతో దానికి కుదివేపున 100 అని ఆకుపచ్చ రంగుతో 2464 అని వైలెట్ ఇంకుతో మార్క్ వేయబడి వున్నాయి.
ఆ గొనె సంచెను ఎక్కడ నుంచి సంపాదించింది ముందు తెలుసుకుంటే లీడింగ్ పాయింట్స్ ఏమయినా దొరకవచ్చు.
అలానే 426 పాసింజర్ వైజాగ్ నుండి బయలుదేరినప్పటికీ హతుడు ఉండేది వైజాగ్ లోనే అయినా, అతని శవం అక్కడ రైలు ఎక్కించే అవకాశం వుండదు. నిరంతరమూ బిజీగా వుండే స్టేషన్ లో అంత పెద్ద డ్రమ్ ను ఎక్కించటం అసాధ్యం కాబట్టి ....వైజాగ్ తరువాత స్టేషను లోనే ఎక్కడో ఒకచోట పాసింజర్ లోకి చేర్చి వుండాలి.
అది ఎక్కడ జరిగిందో తెలుసుకోగలిగితే దర్యాప్తు సులభం అవుతుంది.
ధీరజ ఆలోచనలు ఉన్నట్టుంది రాజమండ్రిలో వుంటున్న రాధాదేవి వైపు మరలాయి.
పాసింజరు రైలు రాజమండ్రి మీదుగానే వస్తుంది కాబట్టి , ఒకవేళ రాజమండ్రిలో ఆ పీపా రైలు ఎక్కించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అది తెలియాలంటే ముందు రాధాదేవిని కలవాలి.
ఆమె ఏం చెబుతున్నదో వినిన తరువాతనే తను ఒక నిర్ణయానికి రావడం మంచిది అనుకున్నది ఇన్ స్పెక్టర్ ధీరజ.
సీతాపతి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అతని భార్య లలితను అనుమానించాలి. లలిత మాటలను బట్టి చూస్తే రాధాదేవిని అనుమానించాలి.
కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
కానిస్టేబుల్స్ కు ఈ కేసుని అప్పగించే కన్నా తనే స్వయంగా రంగంలోకి దిగి హంతకుని ఆచూకి తీయాలనే పట్టుదలతో వున్నది ధీరజ.
అందుకే రాజమండ్రి వెళ్ళే ట్రయిన్ ఎప్పుడు వున్నదో అడగడానికి ఫోన్ రిసీవర్ తీయబోయింది.
అంతలోనే ఫోన్ మోగింది.
"హలో ఇన్ స్పెక్టర్ మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది?"
"ఎవరు నువ్వు?
"చెప్పానుగా ఒక సాధారణ పౌరుణ్ణి"
'అయితే మాత్రం ఆ కేసులో నీకు ఎందుకు అంత ఇంటరెస్ట్?"
"జస్ట్ ....క్యూరియాసిటీ ....తెలుసుకోవాలన్న ఆత్రుత."
"మిస్టర్ ! అదే నేనూ అడుగుతున్నాను. నాతొ దాగుడు మూతలు ఆడి నా విలువయిన సమయాన్ని వెస్ట్ చేయకు. అదిసరే నువ్వేనా సీతాపతిని చంపిన హంతకుడివి?"
"భలేవారిలా ఉన్నారే మీరు. హంతకుడు ఎప్పుడు అయినా ఇలా ఫోన్ చేసి తన జుట్టు తనే పోలీసులకు అందిస్తాడంటారా? ఇంతకూ రాజమండ్రి ఎప్పుడు బయలుదేరుతున్నారు.... బైదిబై ఇంకొక అరగంటలో ఎక్స్ ప్రెస్ వుంది. ఎనీహౌ ....విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్" అని ఫోన్ పెట్టేశాడు అతను.
ధీరజ మనస్సు నిండా సందేహాలే?
ఫోన్ చేసిన ఆ అపరిచిత వ్యక్తీ ఎవరు?
హంతకుడు అయి వుండడానికి వీలులేదు....హంతకుడని పట్టుకోవాలని అభిలాషించే శ్రేయోభిలాషి అయి వుంటాడనుకున్నా ఆ విషయం ఏదో సూటిగా చెప్పవచ్చు గదా.....ఇలా ఫోనుల ద్వారా చిటికీ మాటికీ వూరు పేరూ చెప్పకుండా ఈ ఎంక్వయిరీలు ఎందుకు?
అంటే చనిపోయిన సీతాపతి వెనుక పెద్ద మిస్టరీ ఏదో వుంది....
వైజాగ్ లో మిస్ అయిన అదే వయస్సు కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేకపోవడం వలన ఆ డేడ్ బాడీ తప్పనిసరిగా సీతాపతిదే అయి వుంటుందని తేలిపోయింది.
అసలు తన భర్త ఏమయ్యాడో తెలియదు. అని కంగారు పడుతున్న లలితకు భర్త చనిపోయాడు అని చెబితే ఎలా షాక్ తింటుందో అందుకే ఆ విషయం కొంతకాలం పాటు ఆమెకు చెప్పకుండానే వుండడం మంచిది అనుకున్నది ధీరజ.
తను రాజమండ్రి వెళ్ళబోయే విషయం కూడా తెలుసుకుని ఫోన్ చేశాడూ అంటే సీతాపతి హత్య కేసుకూ, అతనికీ తప్పనిసరిగా ఏదో సంబంధం వుండితీరాలి.
అదీ కాక తన ప్రతి కదలికనూ అతను గమనిస్తున్నాడు అనేది కూడా తెలుస్తుంది....
అది ఎలా సంభవం?
ఇక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ లో కూర్చుని తను తీసుకుంటున్న స్టెప్ అతను స్వయంగా కంటితో చూస్తున్నట్టే ఎలా చెప్పగలుగుతున్నాడు?
ఆలోచనలను కట్టిపెడుతూ కేసు ఫైలు ను తీసుకుని రాజమండ్రి బయలుదేరింది.
ఇంకొక అరగంట తరువాత ఇన్ స్పెక్టర్ ధీరజ రాజమండ్రి వెళ్ళిందీ లేనిదీ అతను పోను చేసి కనుకున్నాడన్న విషయం ధీరజకు తెలిసే అవకాశం లేకపోయింది.
* * *
సింహాచలం పళ్ళు పటపటలాడించారు.....
అతను బార్ కు వచ్చి అరగంట పైనే అయింది.
ఎప్పుడూ తాగని విధంగా ఆరోజు తాగుతున్నాడు. తాగిన మత్తులో తను ఇంటికి చేరుకోవడం కష్టమేమో అని తెలిసి కూడా తాగకుండా ఉండలేకపోతున్నాడతను.
"నయవంచకి.....ఎంత కపట నాటకం ఆడుతున్నది" తనలో తనే గొణుక్కున్నడతను.
ఆ మాటలు ఎవరినో వుద్దేశించి అన్నవి కావు.
సాక్షాత్తు తన భార్య స్వప్నను అంతమాటలు అంటున్నాడు.
ఒకప్పుడు ఎంతో పవిత్రంగా కీర్తించిన నోటితోనే ఈరోజు తూలనాడుతున్నాడు....
దానికి కారణం....
మామగారింటికీ భార్య సమేతంగా వైజాగ్ వచ్చి రెండు రోజులు అయింది. ఇంటిలో వుండేది వయసు పైబడిన అత్తగారు మామగారు మాత్రమే.
నగరంలో జరుగుతున్నా భగవతోపన్యాసాలు వినడానికి ఆ దంపతులు ఇద్దరూ వెళ్ళడం మన పుట్టింటిలో స్వప్న ఒక్కతే ఒంటరిగా వున్నది.
కొద్ది రోజుల క్రితం వరకూ సింహాచలం వైజాగ్ లోనే డ్యూటీ చేసేవాడు. అతనికి ప్రస్తుతం విజయవాడ ట్రాన్స్ ఫర్ కావడం వలన కొద్దిరోజులుగా వైజాగ్ లో లేకపోవడం వలన పాత మిత్రులను పలకరించడానికి సిటీలోకి వెళ్ళాడు అతను.
