" నువ్వెలాంటి దానివోనని వాకబు చేయిస్తున్నారమ్మా!"
"ముసలితనంలో పెళ్ళి చేసుకొంటే నిన్ను అన్యాయం చేశాడనుకొన్నాను. కానీ ఇంత నీచంగా నీ గురించి నలుగుర్ని అడిగి తెలుసుకోవాలనుకొడం దారుణం కదమ్మా!
జి.కె. గారి మనస్థత్వం నాకు నచ్చలేదమ్మా! అఖరికి నోరులేని జంతువు టైగర్ని ఎలా కొట్టాడో చూశావు కదమ్మా! అలాగే నీ బతుకుతో దుర్మార్గగా అడుకోకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాను తల్లీ!" అన్నాడు బొంగురు గొంతుతో.
యజమానిపట్ల ఎంత విశ్వాసంవున్నా, అతని ప్రవర్తన సరిగా లేనప్పుడు మనసులోనైనా ఏవగించుకొంటారు పవివాళ్ళు.
కళ్ళముందు నల్లని సిల్క్ తెరలు పరుచుకొంటున్నాయి.
మల్లన్న చెప్పిన ప్రతిమాటలో అతని నిజాయితీ కనిపిస్తోంది.
మల్లన్నకేసి నిశితంగా చూసింది నాగమణి.
"ఎవరితో చెప్తుంటే విన్నావు మల్లన్నా?"
నరేంద్ర బాబుతో!"
"న...రే.....ం....ద్ర"
అవును... అతని చూపులో ఏదో ఒంకర భావం కనిపించింది. తను గమనించింది. తనంతగా పట్టించుకోలేదు.
తన వివరాలు సేకరించడానికి సిద్దమయ్యాడన్నాట! ముల్లుతో గుచ్చునట్లనిపించింది.
అమెకి చిరాకు కలిగింది.
తన వెనుక ఏదన్నా గతంవున్నా లేకపోయినా కూడా ఎవరైనా తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది.
అప్పటివరకు జి.కె. కి సెక్రటరీగా తెలివిగా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడనుకొంది.
కాని ఇలాంటి నీచమైన పనులుకూడా చేస్తాడని తెలిసెసరికి కోపంతో అమె ముక్కుపుటాలు ఎగిరిపడినయ్.
నరేంద్ర గురించి తెలుసుకోవాలి.
"నరేంద్ర గురించి నీకు తెలుసా?" అడిగింది.
"అవడానికి మంచివాడేనమ్మా! ముప్పై ఏళ్ళుంటాయి. పెళ్ళి కాలేదు. అయ్యగారే అతన్ని పెళ్ళి చేసుకోవద్దన్నారు. అందుకని ఆగిపోయాడు!"
"ఆదేం?"
"అయ్యగారి మాటకాదని పెళ్ళిచేసుకుంటే ఉద్యోగం పోతుందని భయం తల్లీ!"
" జీతం ఎంత?"
" అయిదు వేలుంటుంది..... స్కూటర్ కూడా ఇచ్చారమ్మా!" చెప్పాడు మల్లన్న.
"ఎక్కడుంటాడు?"
" సోమాజిగూడాలో"
అ మె తల పంకించింది. అమె పెదవులపైన చిన్న నవ్వు కదిలింది.
అతన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడం చాలా సులువని అర్థం అయిపోయింది.
అతన్ని ఎలా దారిలో పెట్టాలో నిర్ణయించుకొంది.
"నా గురించి ఏమన్నా తెలుసుకొన్నాడంటావా మల్లన్నా!
"తెలీదమ్మా!"
అమె తల పంకించింది. తను భయపడవలసినంత భయంకరగతం ఏదీ లేదు.
ఒక్క కిరణ్ కథ... ఓ మచ్చగా , గాయంగా, మిగిలింది. నరేంద్ర తన గురించి వివరాలు ఎన్ని సేకరించినా తెలుసుకోవాలంటే ఒక్క కిరణ్ గురించి మాత్రమే తెలుసుకోగలడు. ఏది ఏమైనా మల్లన్న ద్వారా చాలా విషయాలు తెలుసుకొంది. తన జాగ్రత్తలో తనుండాలి
జి.,కె. పైన జుగుప్స ఓ కొండలా పెరిగి పోయింది.
వీలునామా రాశాడా? రాయమన్నాడా?
వీలునామా రాయకుండా అకస్మాత్తుగా జి.కె. మరణిస్తే మొత్తం ఆస్తికి తనే హక్కుదారిణి అవుతుంది.
కానీ అయన వీలునామా రాస్తేనే చిక్కు.
