సంప్రదాయలతో కూడిన బీచ్ పార్టీ.. నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు
Publish Date:Nov 9, 2019
Advertisement
విశాఖపట్టణం అంటే అందరికీ తెలిసిందే. మరి భీమునిపట్టణం అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అదే ఇప్పుడు భీమిలిగా పిలవబడే అప్పటి భీమునిపట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతాల్లో భీమిలి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖకు పేరు ప్రఖ్యాతలు రాక ముందే ఓ పెద్ద పట్టణంగా చారిత్రక ప్రాంతంగా విలసిల్లింది భీమిలి. ఈ పట్టణం రానురాను కాస్త మరుగున పడింది కానీ ఇప్పటికీ అక్కడ చూడతగ్గ.. ఆస్వాదించదగ్గ.. విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించేలా ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు జరగనున్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మునిసిపాలిటీ భీమిలి.. అది ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. పావురాళ్ళకొండ, ప్రఖ్యాత గాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16-18 శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారత దేశానికి వర్తకం చేసుకోటానికి వచ్చినప్పుడు భీమిలిలోనే డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణల్లో 101 మంది సైనికులు 200 మంది స్థానికులు మరణించారని చెప్తుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ వారివి సమాధులు ఉండటంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు. భీమిలి బీచ్ పెద్దగా లోతూ ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య 8 లైట్ హౌస్లు నిర్మించారు.వాటిలో ఉన్న ఒక దీప స్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్నీ తెలియచేస్తోంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారత దేశంలోని పెద్ద బీచ్ రోడ్డు లో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ్ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి ఉత్సవ్ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు, ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు..పులివేషాల జోరు.. సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆద్యంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు విచ్చేయనున్నట్లు తెలిపారు.
http://www.teluguone.com/news/content/bheemili-utsavalu-starts-from-10th-nov-in-visakhapatnam-25-91030.html