Pranayamam Sarvaroganivarini

ప్రాణాయామం సర్వరోగనివారిణి

యోగా ఈనాటిది కాదు. అతి ప్రాచీనకాలంలో మహర్షులు ఆచరించి అద్భుతాలు

సాధించారు. అయితే యోగసాధన మరుగున పడిపోయింది. దీనికి రావలసినంత ఖ్యాతి

రాలేదు. అందుబాటులో ఉన్న అమూల్యమైన ధనాన్ని వెచ్చించడం చేతగాక పక్కన

పడేశాం. కొంత ఆశాజనకమైన మార్పు ఏమిటంటే కొన్నేళ్లుగా యోగా గొప్పతనం

కొందరికైనా తెలిసివచ్చింది. యోగా మహత్తు తెలిసిన కొందరు యోగాసనాలు ప్రాక్టీసు

చేస్తున్నారు.

 

యోగా భంగిమలు, ఆసనాలు చేసే మేలు గ్రహించి తమకు అనుకూలమైన ఆసనాలను

ఎంచుకుని సాధన చేస్తున్నారు. సత్ఫలితాలను పొందుతున్నారు. కాళ్ళు, చేతులు,

నడుము, వెన్నెముక, భుజాలు, పాదాలు - ఇలా మన శరీరంలో ప్రతి భాగాన్నీ బలంగా,

దృఢంగా, ఆరోగ్యంగా రూపొందించుకుంటున్నారు.

 

వివిధ ఆసనాల సంగతి అలా ఉంచితే శ్వాస (బ్రీతింగ్ టెక్నిక్) చాలా ముఖ్యమైంది. ఇది

ఒకరకంగా ధ్యానం. శ్వాసకోశాల నిండా ఊపిరి తీసుకుని, పూర్తిగా విడిస్తే చాలు దివ్య

ఔషధంలా పనిచేస్తుంది. ఇది సర్వరోగనివారిణి అంటే అతిశయోక్తి కాదు. రోజూ

ప్రాణాయామం చేసేవారికి అసలు జబ్బులనేవి దరిదాపులకు రావని ఎందరో యోగా

సాధకులు స్వానుభవంతో చెప్తున్నారు. యోగా ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాదు,

ఆనందాన్నీ ఇస్తుంది. ధ్యానంతో మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. అలసట, శ్రమ,

ఒత్తిడి తెలీవు. ప్రశాంతత సొంతమౌతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ

నియంత్రణలో ఉంటుంది.