ఈ అమృత ముద్ర నిజంగానే అమృతమంత శక్తిని ఇస్తుంది!

మానవ శరీరంలో మూడులక్షలా యాభైవేల నాడులు ఉంటాయి. ఈ నాడులలోకి డెబ్బైరెండువేల నాడులు చాలా ప్రధానమైనవి. ఈ డెబ్బైరెండువేల నాడులలో ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి ఎంతో ముఖ్యమైనవి. ఈ నాడులలో ఎప్పుడూ రక్తం, ఆక్సిజన్ ప్రవహిస్తూ శరీరాన్ని అభివృద్దికి సహకరిస్తూ ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం, నీరు, ద్రవపదార్థాలు మొదలయిన వాటిలో ఉండే చెడు పదార్థాలు రక్తంలోకి చేరి అవి క్రమంగా గుండెపోటు, పక్షవాతం, మూర్చ మొదలయిన వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వల్ల కలిగే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడటం, ఎందరో వైద్యులను సంప్రదించడం జరుగుతుంది. అయితే ఎన్ని మందులు వాడినా కలగని ప్రయోజనాలు ఒకే ఒక ముద్ర వేయడం వల్ల పరిష్కారమవుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ప్రధానమైన ఆ మూడు నాడులను మొదట శుద్ది చేసుకోవాలి. 

మూడు నాడులను శుద్ధి చేసుకోవాలి అంటే దానికి అత్యుత్తమ మార్గం అమృత ముద్ర. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే కొన్ని రకాల సమస్యలకు ఇది మంచి పరిష్కారమవుతుంది. 

అమృత ముద్ర ఎలా వేయాలి??

అతిగా కష్టపడవలసిన అవసరం ఏమి లేదు దీనికి. కింద చెప్పే సూచనలు పాటిస్తూ అమృత ముద్ర వేయచ్చు.

సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. సుఖాసనం, పద్మాసనం ఇలా ఎలాగైనా కూర్చోవచ్చు. అలా కూర్చోలేని వాళ్ళు కుర్చీలు, మంచాల మీద అయినా కూర్చోవచ్చు ఎలాంటి సమస్యా లేదు. 

సౌకర్యవంతమైన అసనంలో కూర్చున్న తరువాత మొదట ఎడమచేతి వేళ్లలో మధ్యవేలును మడిచిపెట్టాలి, ఆ తరువాత బొటనవేలును వంచి  మధ్యవేలు చివరి భాగంతో కలిపి ఉంచాలి. కుడిచేతి వేళ్ళలో ఉంగరం వేలును మడిచిపెట్టాలి. కుడి చేతి బొటన వేలును వంచి ఎడమచేతి ఉంగరపు వేలు కొనతో బొటనవేలు కొనను కలిపి ఉంచాలి. 

రెండు చేతులతో ఇలా చేసాక ఆ వేళ్ళను కలిపి ఉంచిన చోట జాగ్రత్తగా గమనిస్తే వేళ్ల మధ్య ఏదో శక్తి ప్రసరణ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని అలాగే అనుభూతి చెందుతూ శరీరంలో ఉన్న నాడులు శుద్ధి అవుతున్నట్టు భావిస్తూ శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా తగ్గిపోతుందని అనుకోవాలి. ఇలా చేస్తున్నంత సేపు ఏకాగ్రత శరీరంలో అవయవాల మీద ఉండాలి. అవి ఇలా శుద్ధి అవుతున్నాయని అనుకోవాలి. ఇలా అమృత ముద్రను వేయాలి.

ఎంతసేపు వేయాలి??

అమృత ముద్రను ప్రతి రోజూ మూడు పూటలా వేయవచ్చు. దీన్ని ఆహారం తీసుకోవడానికి ముందు వేయడం వల్ల మంచి ఫలితం పొందొచ్చు. లేకుంటే భోజనం లేదా ఆహారం తిన్న తరువాత గంటసేపటికి ఈ ముద్రను వేయవచ్చు. పది నిమిషాలు ఈ ముద్రను వేయడం వల్ల ఆశించిన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది.

ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నిజంగానే ఈ అమృత ముద్ర ఫలితాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఈ ముద్ర వేయడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనత, అలసట తగ్గిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మందబుద్ది ఉన్నవాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం ముద్ర వేస్తే రోజంతా చలాకీగా చురుగ్గా ఉండగలుగుతారు. శరీరంలోకి నూతన శక్తిని తీసుకువస్తుంది. అదే సాయంత్రం సమయంలో ఈ ముద్ర వేస్తే నుద్రలేమి అనే సమస్య తొలగిపోయి సుఖవంతమైన నిద్ర సొంతమవుతుంది. మానసిక సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి, మేథాశక్తి పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ముద్రను మహిళలు తప్పకుండా ఆచరించాలి.

                                 ◆నిశ్శబ్ద.