అలవాటైన రూటులో నారా రోహిత్
on May 5, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయడం నారా రోహిత్కి అలవాటే. 'బాణం'తో చైతన్య దంతులూరి, 'రౌడీ ఫెలో'తో కృష్ణచైతన్య, 'ప్రతినిధి'తో ప్రశాంత్ మండవ... చెబుతూ వెళితే నారా రోహిత్ పరిచయం చేసిన దర్శకులు ఇంకొందరు ఉంటారు. 'వీరభోగ వసంతరాయులు' విడుదల తర్వాత కొంత విరామం తీసుకున్న అతడు, మరోసారి అలవాటైన రూటులో వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
సతీష్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నారా రోహిత్ ఫాంటసీ థ్రిల్లర్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సొంత ప్రొడక్షన్ హౌస్ ఆరాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆయనే ఈ సినిమాను నిర్మించనున్నారు. లాక్ డౌన్ రావడంతో ఈ సినిమా ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను భారీగా చేయబోతున్నారట. ఆల్రెడీ ఈ సినిమా కోసం నారా రోహిత్ చాలావరకూ బరువు తగ్గారని తెలుస్తోంది. ఇంకొంత బరువు తగ్గుతారట. ఆల్రెడీ నారా రోహిత్ చేతిలో 'పండగలా వచ్చాడు' సహా మరో రెండు సినిమాలు ఉన్నాయి.