ENGLISH | TELUGU  

టైగర్ కా హుకుం.. ఈసారి మోత మోగిపోద్ది..!

on Jan 22, 2024

గతేడాది 'జైలర్'(Jailer) సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2023, ఆగస్టు 10న విడుదలై రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 'టైగర్ కా హుకుం' అంటూ సూపర్ స్టార్ చూపించిన మాస్ కి అందరూ ఫిదా అయ్యారు. అయితే త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

'జైలర్' తర్వాత రజినీకాంత్ సినిమాల స్పీడ్ పెంచారు. 'లాల్ సలామ్'లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.. జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వెట్టైయన్‌' అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తన 171వ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయనున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ 172వ సినిమాగా 'జైలర్-2'(Jailer 2) రానుందని సమాచారం.

'జైలర్' తర్వాత నెల్సన్ దర్శకత్వంలో రానున్న సినిమా 'జైలర్-2'నే అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. రెండో భాగం మొదటి భాగాన్ని మించి ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు నెల్సన్ మొదటి సినిమా 'కొలమావు కోకిల'తో 'జైలర్-2' కథకి లింక్ ఉంటుందట. నయనతారతో పాటు ఆ చిత్రంలోని పలు కీలక పాత్రలు జైలర్ సీక్వెల్ లో కనిపించనున్నట్లు వినికిడి.

'జైలర్'లో రజినీకాంత్ తో పాటు శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్ పోషించిన అతిథి పాత్రలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు సీక్వెల్ లో కూడా వారి పాత్రలు కొనసాగే అవకాశముంది. అసలే సీక్వెల్, దానికి తోడు నెల్సన్ యూనివర్స్ అంటున్నారు. అవుట్ పుట్ 'జైలర్'ని మించి ఉంటే మాత్రం.. ఈ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.