నాపై తప్పుడు ప్రచారం చేయడంతో నిద్రలేని రాత్రులు గడిపాను!
on May 2, 2021
రెబల్స్టార్ కృష్ణంరాజు తన కెరీర్లో ఎన్నో గొప్ప పాత్రలు, గొప్ప సినిమాలు చేసి నటునిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అమితంగా సంపాదించుకున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి లెజెండ్స్ తర్వాత ముగ్గురు హీరోలు స్టార్లుగా వెలిగారు. వారు.. కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు. గంభీరమైన రూపం, పదునైన కంఠం కలిగిన కృష్ణంరాజు రౌద్రరస పోషణలోనే కాదు, కరుణరస పోషణలోనూ గొప్ప నటుడనిపించుకున్నారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు. ఆ బ్యానర్ వ్యవహారాలన్నీ ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు (ప్రభాస్ తండ్రి) చూసుకునేవారు. ఆ ఇద్దరికీ రామలక్ష్మణుల లాంటివారని ఇండస్ట్రీలో పేరు ఉంది. అన్నయ్య మీద ఈగవాలినా సహించని మనస్తత్వం సూర్యానారాయణరాజుది.
తన కెరీర్ మొత్తం మీద ఒక ఘటన తనను చాలా బాధించిందని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఒక నిర్మాత తనను హీరోగా బుక్ చేసుకొని, కొంత అడ్వాన్స్ ఇచ్చి, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా మరో హీరోను తీసుకున్నారనీ, దాని కోసం తనపై అనవసరంగా ఇండస్ట్రీలో చెడు ప్రచారం చేశారనీ, అది తనను చాలా బాధించిందనీ ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు తన తమ్ముడు వాళ్లను చంపేస్తానని కూర్చున్నాడని కూడా ఆయన వెల్లడించారు.
"ఒక సినిమాలో ప్రొడ్యూసర్ నన్ను బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో, ఏమిటో ఆ క్యారెక్టర్ వేరు హీరోకు వెళ్లింది. ఆ ప్రొడ్యూసర్ అప్పటికే అడ్వాన్స్గా నాకు కొంత డబ్బిచ్చాడు. వేరే హీరోను పెట్టుకున్నందుకు నేనేమీ ఫీలవలేదు. ఈ వ్యవహారం పెద్దమనిషి కింద డీవీఎస్ రాజు దగ్గరకు వెళ్లింది. ఆయన నాకు ఫోన్ చేసి, ఖాళీగా ఉన్నారా? మీ దగ్గరకు వస్తాను అన్నారు. వద్దండీ నేనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పి, రెడీ అయ్యాను. అరగంట తర్వాత వెళ్లాను." అని ఆయన చెప్పారు. డీవీఎస్ రాజుగారి దగ్గరకు తను వెళ్తాన్నానని చెప్పడంతో ఆయన తమ్ముడు వెళ్లొద్దని చెప్పారు.
"మా అన్నయ్యని వాళ్లు ఇరిటేట్ చేశారు. మా అన్నయ్యను ఇరిటేట్ చేసినవాడెవడూ బాగుపడడు అని మావాడు కూర్చున్నాడు. ఆ డైరెక్టర్కైనా బుద్ధుండాలి, ఆ ప్రొడ్యూసర్కైనా బుద్ధుండాలి అని చాలా ఆవేశపడ్డాడు. వాళ్లను చంపేస్తానని కూర్చున్నాడు. మావాడికి సర్దిచెప్పి రాజుగారి దగ్గరకు వెళ్లాను. 'ఆ ప్రొడ్యూసర్ మీకు అడ్వాన్స్ ఇచ్చారట కదా' అని రాజుగారు అడిగారు. 'వద్దండీ.. మీరు ఏం చెప్పదలచుకున్నారో నాకు తెలుసు' అని రెండు ప్యాంటు జేబుల్లోంచి రెండు నోట్ల కట్టలు.. ఒక్కోటి పదివేలు.. తీసి టేబుల్ మీద పెట్టాను. 'ఇదే అయ్యింటుంది మీరు చెప్పదలచుకున్నది. నన్ను తీసి వేరే అతన్ని ఎందుకు పెట్టుకున్నారని నేనేమీ అడగటం లేదు. నాకు వచ్చిన సినిమా పోయిందని బాధలేదు. మిగతా విషయాలేవీ వద్దు.. ఇక్కడ్నుంచి నా గురించి చెడు ప్రచారం ఆపుతారా.. ఆపెయ్యమనండి. కానీ ఈ అడ్వాన్స్ డబ్బుల కోసం వాళ్లు చేసిన తప్పుడు ప్రచారాలకు వాళ్లకు శిక్ష వెయ్యాలని, వాళ్లను చంపెయ్యాలని మావాడు రెడీగా ఉన్నాడు. వాడిని సముదాయించడానికి నాకు టైమ్ పడుతుంది. ఒకవేళ నా చేతుల్లో లేకపోతే మీరే అక్కడ కాంప్రమైజ్ చేయడానికి రావాలి.' అని చెప్పి వచ్చేశాను." అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
ఆ సందర్భంలో తన తమ్ముడిని సముదాయించాలా, ఇండస్ట్రీలో తన గురించి అనుకుంటున్నదానికి ఇదవ్వాలా అని చాలా స్ట్రగుల్ అయ్యానని ఆయన అన్నారు. "జీవితంలో నేనెప్పుడూ అంతలా అప్సెట్ అవలేదు. రెండు మూడు రోజులు నిద్రలేకుండా గడిపాను. నన్ను అన్పాపులర్ చేస్తున్నారని నేను నిజంగా బాధపడ్డాను. నన్ను అడిగితే ఆ డబ్బు ఇచ్చేసేవాడ్నే." అని గుర్తుచేసుకున్నారు కృష్ణంరాజు.
ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్తో కలిసి తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై ఆ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read