అప్పుడు `సూర్యవంశం`.. ఇప్పుడు `ఎఫ్ 3`..!
on Oct 25, 2021
విక్టరీ వెంకటేశ్ నటించిన మల్టిస్టారర్స్ లో `ఎఫ్ 2` ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ సందడి చేసిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. 2019 సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. `ఎఫ్ 2`ని తెరకెక్కించిన అనిల్ రావిపూడినే.. `ఎఫ్ 3`ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాజాగా రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేశారు. 2022 ఫిబ్రవరి 25న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సరిగ్గా 24 ఏళ్ళ క్రితం అంటే 1998లో ఇదే ఫిబ్రవరి 25వ తేదిన వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది. ఆ చిత్రమే.. `సూర్యవంశం`. వెంకీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. మరి.. మళ్ళీ 24 ఏళ్ళ తరువాత అదే తేదికి రాబోతున్న `ఎఫ్ 3` కూడా ఆ ఫీట్ ని రిపీట్ చేసి వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ని చేరుస్తుందేమో చూడాలి.
కాగా, `ఎఫ్ 3`లో వెంకీ జంటగా తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ దర్శనమివ్వనుండగా.. `లెజెండ్` బ్యూటీ సోనాల్ చౌహాన్ ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేయబోతోంది. అలాగే సునీల్ ఓ ముఖ్య పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు.