సీనియర్ నటుడు రాజబాబు ఇకలేరు!
on Oct 25, 2021
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినిమా, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు(64) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు వున్నారు.
రాజబాబు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో జూన్ 13, 1957లో జన్మించారు. ఆయన తండ్రి రామతారకం చిత్ర నిర్మాత. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 'స్వర్గం -నరకం', 'రాధమ్మ పెళ్లి' సినిమాలను నిర్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్న రాజబాబు నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు 1995లో 'ఊరికి మొనగాడు' సినిమాలో రాజబాబుకు అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. 'సిందూరం' సినిమా తరువాత అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో.. కాకినాడలో స్థిరపడిన రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి సినిమా రంగంపై దృష్టి పెట్టారు. సముద్రం, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన 60 కి పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
టీవీ రంగంలోనూ రాజబాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వసంత కోకిల, అమ్మ, అభిషేకం, రాధా మధు, మనసు మమత, చిలసౌ స్రవంతి వంటి సీరియల్స్ లో పోషించిన పాత్రలు రాజబాబుకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు 50 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి రాజబాబు అందరికీ ఆత్మీయుడయ్యారు. 2005వ సంవత్సరంలో 'అమ్మ' సీరియల్ లోని పాత్రకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.
రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది.
Also Read