మరణానంతరమైనా దాసరికి పద్మ పురస్కారం దక్కాలి!
on May 4, 2021
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు లభించకపోవడం తీరని లోటనీ, మరణానంతరమైనా ఆయనకు పద్మ పురస్కారం లభిస్తే అది తెలుగు చిత్రసీమకు దక్కే గౌరవం అవుతుందనీ మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. నేడు దాసరి 74వ జయంతి. ఈ సందర్భంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు చిరంజీవి.
"దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావుగారి జన్మదిన సందర్భంగా ఆయనకు నాకు స్మృత్యంజలి. విజయాలలో ఒక దానికి మించిన మరో చిత్రాలని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతం చిత్రపరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే! శ్రీ దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకు పోస్త్యుమస్గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్రపరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది." అని ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాల దర్శకుడిగా రికార్డు సృష్టించిన దాసరికి, లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు పొందిన ఆయనకు, గురువుగా టాలీవుడ్ అంతా గౌరవించిన ఆ దిగ్దర్శకుడికి, నటుడికి తన జీవిత కాలంలో పద్మ పురస్కారం లభించకపోవడం శోచనీయం. మరణానంతరమైనా ఆయనకు ఆ పురస్కారం దక్కాలని చిరంజీవే, కాదు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభిలషిస్తోంది.