"ఒక పదవి కోసం అంత లోకువ కావాలా?" అన్న చిరంజీవి.. కౌంటర్ ఇచ్చిన మోహన్బాబు!
on Oct 12, 2021
పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ జరగనంత వాడిగా, వేడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2021 ఎన్నికలు జరిగాయి. పోలింగ్ డేట్ అయిన అక్టోబర్ 10కి ఒక రోజు ముందు దాకా ప్రకాశ్రాజ్ ప్యానల్ మెంబర్స్, మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. ఇండస్ట్రీకి పెద్దదిక్కు అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ గొడవనంతా మౌనంగా తిలకిస్తూ వచ్చారు. ప్రకాశ్రాజ్పై విష్ణు సపోర్టర్ నరేశ్ తీవ్రస్థాయిలో మాటల దాడి చేసినప్పుడు ఆయన నోరు మెదపలేదు. తన పెద్దతమ్ముడు నాగబాబు ప్రకాశ్రాజ్ను కీర్తిస్తూ, విష్ణునే కాకుండా తెలుగు నటులందర్నీ చులకన చేసి మాట్లాడినప్పుడు, పెద్దవారైన కోట శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడూ మౌనం వహించారు. ఆయన మౌనం చూసి, చాలామంది అసంతృప్తికి గురయ్యారు. ఇండస్ట్రీ పెద్దగా బాధ్యత తీసుకొని, ఎవరూ ఇతరులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దనీ, 'మా' పరువు బజారుకు ఈడ్చవద్దనీ గట్టిగా చెప్పినట్లయితే.. నరేశ్ కానీ, నాగబాబు కానీ ఈ రేంజ్లో దూషణలకు పాల్పడేవారు కాదు. కానీ చిరంజీవి ఆ పని చేయలేదు.
తీరా ఎన్నికలు అయ్యాక.. మంచు విష్ణు ప్యానల్ విజయం సాధిస్తోందనే వార్తలు వచ్చాక, అదే రోజు రాత్రి జరిగిన 'పెళ్లి సందడి' ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన 'మా' ఎన్నికలను నేరుగా ప్రస్తావించకుండా, ఇన్డైరెక్టుగా ఆ గొడవలను ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగానే గొడవలంటే చిరంజీవికి గిట్టవు. వాటికి ఆయన దూరంగా ఉంటారు. అందరితోనూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం ఇండస్ట్రీలోని వారందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీలోని గొడవల గురించి ఆయన ప్రస్తావించిన వేదిక, సందర్భంపై చాలామంది సంతోషంగా లేరు.
"అందరు హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే, పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలనడం, మాటలు అనిపించుకోవడం.. ఉండదు కదా! ఏదైనా తాత్కాలికం. అది రెండేళ్లుంటాయా, మూడేళ్లుంటాయా, నాలుగేళ్లుంటాయా.. ముఖ్యంగా పదవుల్లాంటివి, చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. వాటి కోసంగా మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే.. బయటివాళ్లకు ఎంత లోకువైపోతాం, అంత లోకువ కావాలా ఒక పదవి కోసం?! నాకు అది బాధనిపిస్తుంది. ఎవరైనా కానీ.. ఏ ఒక్కర్నీ నేను వేలుపెట్టి చూపించడం లేదు. విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీ తోటి ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప, మన ఆధిపత్యం చూపించుకోడానికి, మన ప్రభావం చూపించుకోడానికి అవతలి వాళ్లను కించపర్చాల్సిన అవసరం లేదు. వారు మమ్మల్ని అన్నారు కదా అంటే, మీరు మమ్మల్ని అన్నారు కదా అని. ఎక్కడ స్టార్టయ్యిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ చేసిన మనిషెవరు? ఎవరి మూలంగా ఈ వివాదాలు స్టార్టయినాయో అక్కడ హోమియోపతి వైద్యం లాగా మూలాల్లోకి వెళ్లి, అలాంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచితే కనుక, మనది వసుధైక కుటుంబంలా ఉంటుంది. అందరూ ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప.. చిన్న చిన్న గొడవలతో అవతలి వాళ్లకు లోకువైపోయి.. ముఖ్యంగా మీడియావాళ్లకి మనం ఆహారమైపోకూడదు." అంటూ మాట్లాడారు చిరంజీవి.
ఇది ఆయన ఎవర్ని ఉద్దేశించి మాట్లాడారో అందరికీ అర్థమైంది. ఆ మరుసటిరోజు మీడియా ముందుకు వచ్చిన మోహన్బాబు, తనదైన శైలిలో చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. మామూలుగా అయితే ఆవేశభరితంగా మాట్లాడే ఆయన ఈసారి ప్రశాంతంగానే తను చెప్పాలనుకున్నది చెప్పారు.
"సింహం నాలుగడుగులు వెనక్కి వేస్తుంది.. తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం వెనక్కి వెళ్లింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్లు ఒక ఉధృతతో వస్తుంది. పొట్టేలు నాలుగడుగులు వెనక్కి వేసింది కదా.. మనం తిరుగుదాం అనుకొనే లోపల, నడుంను కొడుతుంది. నడుం ఓ పక్కన, ఇంకో పార్టు ఇంకో పక్కన విరిగిపోతుంది." అన్నారు.
ఆ తర్వాత, "నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడ్ని కాను, మౌనంగా ఉన్నాను. మన గురించి ప్రతి మందీ ఏదేదో మాట్లాడుతుంటే.. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. దీని గురించే మాట్లాడాలి. మాట్లాడ్డానికి ఎక్కడా అవకాశం లేక, ఎక్కడో ఓ వేదిక దొరికితే, ఆ వేదికపై ఇష్టమొచ్చినట్లు నోరు జారడం.. మనిషిని దీనస్థితికి దిగజారుస్తుంది. మనిషి రోజురోజుకూ వయసొచ్చేకొద్దీ ఆలోచనాపరుడై, యంగ్ వయసులో మనమేం చేశాం, ఇప్పుడెలా మాట్లాడాలనే ఆలోచనా విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. మాట్లాడనియ్. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏం జరుగుతోందనేది ప్రపంచమంతా చూసింది. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి." అని చెప్పుకొచ్చారు మోహన్బాబు.
Also Read