మా అమ్మను కించపరిచేలా మోహన్బాబుగారు బూతులు తిట్టారు.. అమ్మే నా సర్వస్వం!!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత పరిణామాలు మరో రకంగా టర్న్ తీసుకుంటున్నాయి. విష్ణు సజావుగా తన బాధ్యతల్ని నిర్వర్తించడానికి వీలుగా ఎన్నికల్లో గెలిచిన తమ సినిమా బిడ్డలం ప్యానల్ మెంబర్స్ 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్రాజ్ ప్రకటించారు. ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల రోజు మోహన్బాబు తనను బూతులు తిట్టారనీ, వాటిలో తమ అమ్మను కించపరిచే బూతులు వచ్చాయనీ, అమ్మే సర్వస్వమైన తను ఏడుపు ఆపుకోలేకపోయాయనీ యంగ్ యాక్టర్ తనీశ్ చెప్పాడు.
"మోహన్బాబుగారు, విష్ణన్న, మనోజ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ప్రకాశ్రాజ్ ఐడియాలజీకి ఆకర్షితుడినై ఆయన ప్యానల్ తరపున నిలబడ్డాను. మొన్న ఎలక్షన్స్ రోజున మోహన్బాబు గారికి ఎందుకు కోపమొచ్చిందో.. బూతులు తిడుతూ నా మీదకొచ్చారు. అప్పుడు బెనర్జీగారు నన్ను కాపాడ్డానికి ముందుకొచ్చారు. దాంతో ఆయన్ను కూడా మాటలన్నారు. బెనర్జీ గారికి సారీ చెప్తున్నా. చెప్పాలంటే నా వల్లే ఆయనకు అవమానం జరిగింది." అని అతను తెలిపాడు.
మోహన్బాబు బూతులు తిట్టాక ఏడుపొచ్చి ఏడ్చేశానని చెప్పాడు తనీశ్. "విష్ణన్న, మనోజ్ అన్న నన్ను దగ్గరకు తీసుకొని, 'ఏడవకురా' అని సముదాయించారు. 'నువ్వు కూడా ఏంట్రా.. నాన్న గురించి నీకు తెలుసు కదా.. ఆయనకు నీమీద ప్రేమ ఉంటుంది' అన్నారు. నేను ఒప్పుకుంటాను. ఆ ఇద్దరూ నన్ను తమ్ముడిలా చూసుకుంటారని నాకు తెలుసు.. నన్ను వాళ్లింట్లోని ఓ పిల్లాడిలా అనుకుంటారు. కానీ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మను కించపరిచే బూతులు వచ్చేసరికి.. అమ్మే నాకు సర్వస్వం.. అమ్మనంటే తీసుకోలేం కదా.. ఒక మచ్చలా అదుండిపోయింది." అని అతను బాధపడ్డాడు.
"రేపు ఈసీ మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. వాటిలో మా అభిప్రాయాలు మేం చెప్పుకోలేకపోవచ్చేమో, ఈ భయానికి! ఎందుకు ఇలా భయపడ్డం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక మాట తప్పనిపిస్తే మనం అడిగేలా ఉండాలి కానీ, ఏదైనా అంటారేమోననే భయంతో ఉండటం కరెక్ట్ కాదనిపించింది. అంతేకానీ.. విష్ణన్నను, మనోజ్ అన్నను హర్ట్ చెయ్యాలని కాదు.. దీన్ని నేను హ్యాండిల్ చెయ్యలేననే ఉద్దేశంతోనే రిజైన్ చేస్తున్నాను. విష్ణన్న గ్రేట్ లీడర్ అవుతాడనే నమ్మకం నాకుంది. మాను బాగా హ్యాండిల్ చెయ్యగలడనే నమ్మకం నాలో ఉంది. అది జరుగుతుందని ఆశిస్తున్నాను." అని చెప్పాడు తనీశ్.
Also Read