హిట్లు లేని ఇద్దరికీ ఇది పెద్ద టాస్కే!
on Sep 9, 2023
ఈమధ్యకాలంలో హిట్లు లేని హీరో, దర్శకుడు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఆ సినిమాపై ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది. పదేళ్ళుగా సరైన హిట్లు లేని గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా ప్రారంభమైంది. చిత్రాలయం స్టూడియోస్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించిన వేణు దోనేపూడి మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. గోపీచంద్పై తీసిన మొదటి షాట్కు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని కెమెరా స్విచాన్ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ నిచ్చారు. ఇది గోపీచంద్కి 32వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ, గోపీమోహన్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా గోపీచంద్కి, శ్రీను వైట్లకి ఇద్దరికీ కీలకమనే చెప్పాలి. లౌక్యం తర్వాత అరడజనుకుపైగా సినిమాలు చేసిన గోపీచంద్కి ఒక మంచి సూపర్హిట్ చాలా అవసరం. అలాగే దూకుడు, బాద్షా వంటి సూపర్హిట్ సినిమాల తర్వాత శ్రీను వైట్ల చేసిన బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు పరాజయం పాలవడంతో డైరెక్టర్గా వెనుకబడి పోయాడు. ఇప్పుడు తప్పనిసరిగా హిట్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు శ్రీను వైట్ల. తను రెగ్యులర్గా యాక్షన్ ప్లస్ కామెడీ వున్న కథాంశాలనే ఎంచుకుంటాడు. ఈసారీ అదే ఫార్ములాతో వెళుతున్న గోపీచంద్ని కొత్త ప్రజెంట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతకుముందు గోపీచంద్ చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తయారు చేసిన ఈ కథతో తప్పకుండా ఇద్దరికీ సూపర్హిట్ వస్తుందని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ ‘భీమా’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
