వరుణ్ తేజ్, సాయిపల్లవి మళ్లీ 'ఫిదా' చేస్తారా!!
on May 17, 2021
వరుణ్ తేజ్-సాయిపల్లవి జంట ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. ఫిదా సినిమా వచ్చి నాలుగేళ్లు దాటినా వెండితెర మీద వరుణ్-సాయిపల్లవిల జోడీ చేసిన సందడిని ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఈ కలయికలో మరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎందరో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల వీరి కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.
ఛలో, భీష్మ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న వెంకీ కుడుముల.. ఇంతవరకు తన మూడో సినిమాను ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు వరుణ్ హీరోగా సినిమా చేయడానికి వెంకీ సిద్ధమవుతున్నాడని కొద్దిరోజులుగా న్యూస్ చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వెంకీ ఒక కథను వరుణ్ కి చెప్పగా.. వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో వరుణ్ సరసన సాయి పల్లవి నటించనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ ‘గని’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
Also Read