రూ.100 కోట్లతో పాన్ ఇండియా మూవీగా 'రాక్షసుడు 2'
on Aug 2, 2021
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రాక్షసుడు' 2019 ఆగష్టు 2న విడుదలై విజయం సాధించింది. తమిళ్ సూపర్ మూవీ 'రాక్షసన్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఇటీవలే ఆయన రమేష్ వర్మ దర్శకుడిగా 'రాక్షసుడు 2' సినిమాని ప్రకటించారు. ఇందులో ఒక స్టార్ హీరో నటించనున్నాడని ప్రకటించిన మేకర్స్.. ఆ హీరో ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నేటితో 'రాక్షసుడు' సినిమా విడుదలై రెండేళ్లవుతున్న సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ 'రాక్షసుడు 2' గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.
'రాక్షసుడు' కంటే 'రాక్షసుడు 2' మరింత థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్గా ఉంటుందని కోనేరు సత్యనారాయణ అన్నారు. 'రాక్షసుడు 2'ని హాలీవుడ్ చిత్రాల రేంజ్లో చేయాలనుకుంటున్నామని, దీని కోసం 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని తెలిపారు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో లీడ్ రోల్ చేయబోతున్నారని, అదెరవనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని అన్నారు. అలాగే ఈ సినిమా పూర్తిగా లండన్ లో చిత్రీకరించబడుతుందని పేర్కొన్నారు.
ఇక రవితేజ- రమేష్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీ గురించి చెబుతూ.. మా బ్యానర్ లో మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమన్నారు. బాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు ఈ సినిమా రైట్స్ కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారని.. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.