మళ్ళీ తెరపైకి నటి ప్రత్యూష మృతి కేసు..!
on Nov 20, 2025

రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. (Actress Prathyusha)
ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి రాగా.. సిద్ధార్థ ఇంజినీరింగ్ లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం వీరిద్దరూ విషం తాగి ఆసుపత్రి పాలయ్యారు. ప్రత్యూష 24న చనిపోగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు.
ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడు సిద్ధార్థపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పుపై సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా.. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ.. 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థ, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో.. ఆ తీర్పు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



