'దూకుడు' జంటను మళ్లీ కలపనున్న రాజమౌళి?
on Nov 13, 2021
నాగచైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తిచెప్పి వార్తల్లో నిలిచింది సమంత. ఆ తర్వాత అధికారికంగా ఆమె రెండు సినిమాలు ప్రకటించింది. ఆ రెండూ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్సే. ఇప్పుడు టాలీవుడ్లో నలుగుతున్న ప్రచారం ప్రకారం ఆమెను తన నెక్ట్స్ సినిమాలోకి యస్.యస్. రాజమౌళి తీసుకోబోతున్నాడంట. రాజమౌళి నెక్ట్స్ మూవీ మహేశ్బాబుతో అనే విషయం తెలిసిందే. దీన్ని బట్టి మహేశ్, సమంత జంటగా మరోసారి నటించనున్నారా?.. అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికే 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి బ్లాక్బస్టర్ మూవీస్తో హిట్ పెయిర్గా మహేశ్, సమంత ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్ను మెస్మరైజ్ చేసింది. అందుకే మరోసారి ఆ జంటను కలపాలని రాజమౌళి భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్లో నటించినప్పట్నుంచీ సమంత నేషనల్ సెలబ్రిటీగా మారింది. ఇప్పటికే ఆమె రాజమౌళితో 'ఈగ' సినిమాకు వర్క్ చేసింది. అయితే రాజమౌళి నెక్ట్స్ మూవీలో సమంత నటిస్తోందా, లేదా అనే విషయం అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
మరోవైపు రాజమౌళి తన ప్రస్తుత చిత్రం 'ఆర్ఆర్ఆర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడు. జనవరి 7న ఆ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నందున ఈలోపు తాననుకున్న విధంగా ఫైనల్ ప్రొడక్ట్ తెచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. మహేశ్ 'సర్కారువారి పాట' షూటింగ్లో ఉండగా, సమంత తమిళ మూవీ 'కాదు వాకుల రెండు కాదల్' షూటింగ్లో ఉంది.