'భీమ్లా నాయక్' పోస్ట్పోన్ తప్పదు.. ఎందుకంటే?
on Nov 13, 2021
పవర్స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ వచ్చే సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా 2022 సమ్మర్కు విడుదల కానున్నదని తెలుస్తోంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్'తో పోటీని నివారించడానికే 'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడుతోందని అందరూ అనుకుంటున్నారు. అయితే దానితో పాటు మరో కారణం కూడా ఆ సినిమా పోస్ట్పోన్కు కారణమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' రిలీజైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచనీయకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. అనేక మీటింగుల తర్వాత మొన్న దసరాకు టికెట్ రేట్లను పెంచుకోడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 'రిపబ్లిక్' మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీకే చేసిన ప్రసంగం ఇండస్ట్రీని ఇరకాటంలో పెట్టింది. దాంతో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి, ఆయన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నానికి వివరణ ఇచ్చుకున్నారు.
డిసెంబర్లో అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' రిలీజ్ అవుతోంది. దీనికి టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోగలమని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఒకవేళ అప్పటికి సాధ్యం కాకపోతే సంక్రాంతికి వారం ముందు విడుదలవుతున్న రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' కైనా సమస్యను పరిష్కరించుకోవచ్చని అనుకుంటున్నారు. 'భీమ్లా నాయక్' జనవరి 12న రిలీజ్ అయ్యేటట్లయితే టికెట్ రేట్లు పెంచడానికి ఏపీ గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చని వినిపిస్తోంది. అందుకే ఈ సమస్య పరిష్కారం కావాలంటే 'భీమ్లా నాయక్' సంక్రాంతికి విడుదల కాకుంటేనే మంచిదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారని ప్రచారంలోకి వచ్చింది. అందుకే ఆ సినిమాను వేసవికి పోస్ట్పోన్ చేసుకొనమని ఆ సినిమా నిర్మాతలపై వారు ఒత్తిడి చేస్తున్నారంట.
Also Read