Facebook Twitter
బైరాగుల బండి

                             బైరాగుల బండి                                                                                                                                                                                                         


బొగ్గింజన్ తో నడిచే రైలుబండి .
దాన్ని చూడడం , అందులో ప్రయాణం చేయడం
అప్పట్లో సరదాగా ఉండేది. అందులోని డ్రైవర్లు ఇనుప పారలతో వెనకవైపు ఉన్న బొగ్గును తెచ్చి ఇంజన్ లోకి పోస్తూఉండేవారు. ఆవిరితో కదిలేది. రైలింజనంతా పొగలు కక్కుతూ ఆవిర్లు వెదజల్లుతూ అదో పెద్ద డైనోసార్ లాగా కనిపించేది.

ఆ రైలు ఎక్కడమే గానీ ఎప్పుడు దిగుతామో తెలియదు . ఒక స్టేషన్లో ఆగింది అంటే ఎప్పుడు కదులుతుందో తెలియదు. నీలోని ఓపికంతా ఆవిరి అయితే తప్ప ఈ 'ఆవిరింజన్'గమ్యం చేరేది కాదు. అట్లా సాగేది ప్రయాణం. ప్రయాణికులు తిని పారేసిన చెనిక్కాయ పొట్టు ఎక్కడ చూసిన గాలికి ఎగురుతూ ఉండేది. దీని అసలు పేరు లోకల్. కానీ 'బైరాగుల బండి' అని అంటేనే ఎక్కువ మందికి అర్థమయ్యేది.

ప్రయాణికులంతా దర్జాగా కూర్చుని ఉండేవారు. ఎవరి దగ్గర టిక్కెట్లు ఉండేవి కాదు. టిక్కెట్ల తనిఖీ అధికారులు అని పిలువబడే 'టీసీలు' కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సాధువులు, సన్యాసులు , బైరాగులు రైల్లో ఎక్కడ చూసినా కనిపించే వారు. తంబురా మీటుకుంటూ ఏవేవో జీవిత సత్యాలు తత్వాలు గా పాడుతుండేవారు. 'చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే.. చిత్తము చెడునుర... ఒరే ఒరే... చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచుండట సరే సరే...' అని బ్రహ్మం గారి జ్ఞాన తత్వాన్ని ఒకసారి పాడితే, మరోసారి' దేవ దారి పూల కై నేనొచ్చేదా ... దేవదేవుని పూజకై నేనొచ్చేదా ...' అని సిద్దయ్య పలుకు పాడేవారు. అట్లా వాళ్ల కీలు గొంతుల రాగాలతో, ఇంజన్ వేసే శబ్దాలతో కాలం ముందుకు సాగిపోతూ ఉండేది.

తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని వస్తున్న భక్తులు గోవింద నామాలు పలుకుతూ ఉండేవారు. భోగి ల నిండా గుండు కొట్టించుకున్న వాళ్లే ఎక్కువమంది. వెంట తీసుకెళ్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం వాసన గుప్పుమనేది. అమ్ముకునే వాళ్ల కేకలతో , కొనమని మారాం చేసే పిల్లల ఏడుపుల తో రైలు రైలంతా అదో వింత లోకం లా ఉండేది. రైలు మామండూరు, బాలపల్లె శేషాచలం అటవీ ప్రాంతం మధ్యలో ఆగినప్పుడు గుండెలు అదిరిపోయేవి. ఒకరి ముఖాలు ఒకరు భయం భయంగా చూసుకునే వాళ్ళు.
చిన్న చిన్న స్టేషన్లలో కూడా గంటకు తక్కువ కాకుండా ఆపేవారు. తెచ్చుకున్న తిను బండారాలన్నీ అయిపోతే గాని రైలు కదిలేది కాదు. నీలోని ఓపిక, సహనం అన్నిటిని పరీక్షించడానికే దేవుడి దీన్ని పంపించాడు ఏమో అనిపించేది. ఏదైతే అదే అయ్యింది ఒక్కొక్కసారి ' దిగి నడుచుకుంటూ వెళ్ళిపోదాం' అని కూడా అనిపిస్తూ ఉండేది. ఆగిన స్టేషన్ లో నుంచి స్టేషన్ మాస్టర్ బయటికొచ్చి పచ్చజెండా ఊపితే ప్రాణం లేచి వచ్చేది. అప్పుడు 'ఇంజన్ వేసే విజిల్' మరి కాసేపు వినాలనిపించేది. కుదేలైన దేహానికి కుదుపు వచ్చేది. జీవితం మీద మళ్ళీ కొత్త ఆశ పుట్టేది. అట్లా ఆశనిరాశల మధ్య ఈ రైలు ప్రయాణం సాగేది.

రైల్లో పక్కనున్న వాళ్ల తోనే కాక
ఆ బోగీలో వాళ్లతో వీళ్ళకి, ఈ బోగీలో వాళ్లతో వాళ్లకి పరిచయాలు కూడా అయ్యేవి. బంధువులు కూడా అయిపోతారు ఏమోనని కూడా అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది. అటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో, ఇటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో , వాళ్లకి ఎంతమంది పిల్లలో , వాళ్ళు ఏమి చదువుకుంటున్నారో, వాళ్ళ బంధువులు ఎవరో... ఇట్లాంటి సమాచారమంతా క్షుణ్నంగా తెలుసుకునే మహద్భాగ్యం కలిగేది. అన్నయ్య, వదిన అనే వరసలు కూడా కలిసేవి.

ఆగిన ప్రతి స్టేషన్లో మర చెంబులు తీసుకెళ్లి ఓపిగ్గా, నిదానంగా, నిబ్బరంగా, తోసుకోకుండా, ఒకరు పైన ఒకరు పడకుండా , తాగి నన్ని తాగి, పిల్లలకి తాపించి ఒకటికి రెండు సార్లు తిరిగి నీళ్లు పట్టుకునేవారు. ఆ మరచెంబు ను పిల్లలు ఎంత ఇష్ట పడేవారో !
ఆ తండ్రి తన పిల్లాడిని ఎత్తుకొని పోయి ఇంజన్ డ్రైవర్ తో షేక్ హ్యాండ్ ఇప్పించి నప్పుడు ఆ పిల్లాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. రేపట్నుంచి వేసవి సెలవులు అని అన్నప్పుడు కూడా వాడింత ఆనందపడడు.
రైల్లో వెనకున్న గార్డ్ విజిల్ వేస్తూ పచ్చజెండా ఊపాడు.
ఎట్టకేలకు రైలు కదిలింది.

                                                                  - డాక్టర్ వేంపల్లి గంగాధర్