Facebook Twitter
ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని మనం రక్షిస్తే ..ఆ ధర్మం మనని రక్షిస్తుంది..ఇది ఎప్పటినుండో వింటున్న మాటే అయినా పాటించేవారు యెంత మంది..

ధర్మం వైపు ఉన్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని మన ఇతిహాసాల్లో అనేక ఉదాహరణలున్నాయి. రామాయణంలో రావణుని తమ్ముడు విభీషణుడు రాముని పక్షం వహించినట్లే..   మహాభారతంలో కౌరవుల నుంచి ఒకడు పాండవ పక్షం వహించాడు. మహాభారత యుద్ధం ముగిసేనాటికి బతికి బట్టగట్టిన 11 మందిలో అతడూ ఒకడు. అతడే యుయుత్సుడు. కౌరవులలో మిగిలిన ఏకైక వ్యక్తి. ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుకకు కారకుడైన వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అతడు ఒకరోజు హస్తినాపురాన్ని సందర్శించాడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఆయనకు భక్తిశ్రద్ధలతో అతిథి మర్యాదలు చేసింది. ఆమె సేవలకు మెచ్చి వ్యాసుడు వరం కోరుకోమన్నాడు.  నాకు వందమంది సంతానం కావాలని గాంధారి అంది. వ్యాసుడు ఆ వరమిచ్చి వెళ్ళిపోయాడు.

వరాన్ని పొందిన రెండేళ్ల తర్వాత గాంధారి కౌరవులతోపాటు దుస్సల  అనే పుత్రికనూ కన్నది. కౌరవులు అనగానే దుర్మార్గత్వం. దుష్టత్వం గుర్తుకొస్తుంది.. కానీ కురు వంశంలోనే ధర్మాన్ని ఆచరించే యుయుత్సుడు అనేవాడు కూడా జన్మించాడు. ఇతడు గాంధారికి పుట్టిన వాడు కాదు. సుగధ అనే వైశ్య దాసి ద్వారా ధృతరాష్ట్రుడు కన్న పుత్రుడు. గాంధారికి సంతానం కలగడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందిన ధృతరాష్ట్రుడు సుగధను చేరదీశాడు. దుర్యోధ నుడు, ఇతర కౌరవులు పుట్టిన రోజే యుయుత్సుడు కూడా జన్మించాడు. అయితే చిన్నప్పటి నుంచి దాసి పుత్రునిగా అతడికి అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటిని పట్టించుకోకుండా సకల విద్యలూ అభ్యసించాడు.

60 వేల మందిని ఒక్కసారిగా ఎదుర్కొన గలిగిన అతిరథుని హోదా అతడిది. కౌరవుల వైపు ఉన్న అతిరథుల్లో అతడు ఒకడు. అటువంటి యుయుత్సుడు మొదటి నుంచీ వారి చేతుల్లో అవమానాలు పడుతున్నందువల్ల  వారి దుష్టత్వం తెలిసినందు వల్ల కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడు. కౌరవులకు సంబంధించిన రహస్యాలు పాండవులకు చెప్పి వారి విజయానికి తోడ్పడ్డాడు.. కలియుగం ప్రారంభం అవ్వడంతో పాండవులు అర్జునుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి యుయుత్సుని అతడికి సంరక్షకునిగా నియమించి హిమాలయాలకు వెళ్లి. పోయారు. ఆ విధంగా ధర్మం వైపు నిలిచిన యుయుత్సునికి మేలు చేకూరింది.అందుకే ధర్మ పథంగా జీవించడం ప్రతి ఒకరికి అవసరం.