Facebook Twitter
చెప్పుడు మాటలు వినకు..

చెప్పుడు మాటలు వినకు!

 

 

కోగిర అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో‌ గూడు కట్టుకొని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అదే చెట్టు తొర్రలో ఒక పిల్లి, చెట్టు క్రింద కన్నంలో ఒక ఎలుక నివసించేవి. మూడూ దాదాపుగా సమాన వయస్సువి అవ్వటంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది. జాతులేవీ వాటి స్నేహానికి అడ్డు రాలేదు. అట్లా కొన్నేళ్ళు గడిచాక, "మనం ముగ్గురం స్నేహితులం కదా, ఆ సంగతి లోకానికి అంతటికీ తెలిసేట్లు చేయటం ఎలాగ?" అని అవి చాలా సీరియస్‌గా ఆలోచించాయి.


ఆలోచించి, "ఇకనుండీ రోజూ ముగ్గురం కలిసి వంట చేసుకుని తిందాం" అని నిశ్చయించుకున్నాయి. "కలిసి పని చేస్తూంటే మనం పదిమంది కళ్ళలో పడతాం. అట్లా మన గురించీ, మన స్నేహం గురించీ అందరికీ తెలుస్తుంది" అన్నది పిల్లి. "అవును- నిజమే. కలిసి వంట చేసుకుందాం" అన్నది ఎలుక. "మరి ఎవరు ఏం పని చెయ్యాలి?" అడిగింది కాకి.

 


"ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం. నువ్వు పుల్లలు ఏరుకురా. ఎలుక గింజలు తెస్తుంది. నేను వంట చేస్తాను" అన్నది పిల్లి. "సరే!" అన్నాయి మిగిలిన రెండూ. అట్లా వాటి వంట కార్యక్రమం మొదలైంది. అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాయి. అవి కూడా చక్కగా వండుకొని హాయిగా తింటూ, చీకూ చింతా లేకుండా జీవించినై, కొన్నాళ్ళు.


అట్లా నెల రోజులు గడిచిందో, లేదో- ఒక నక్క చూపు పడింది వీటి మీద. వీటికి మంచి పేరు రావటం దానికి ఇష్టం లేదు. "వీటి స్నేహాన్ని చెడగొట్టాలి, పిల్లిని చంపి తినెయ్యాలి" అనుకుందది. "ఈ మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరు ఉంటారు, పొగిడితే ఎవరు పొంగి పోతారు?" అని ఆలోచించింది. కాకి-రొట్టె ముక్క కథ గుర్తుకొచ్చింది దానికి.


అది కాకి దగ్గరకు వెళ్ళి: "కాకి బావా! ఎంతైనా నువ్వు నువ్వే! మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే. వాళ్ళ పని ఏమున్నది? కడుపులో‌ చల్ల కదలకుండా సుఖంగా‌ ఉంటారు" అన్నది. "అదేం లేదులే, ముగ్గురమూ బాగానే పని చేస్తాం. ఎవరికి వీలైనంత పని వాళ్లం చేస్తాం" అన్నది కాకి. నక్క దాన్ని వదల్లేదు. బ్రాహ్మణుడు-దొంగలు కథ గుర్తు చేసుకున్నది. మళ్ళీ మళ్ళీ కాకిని పలకరించటం, మళ్ళీ‌ మళ్ళీ అదే మాట అనటం చేసింది. ఇట్లా కొన్ని సార్లు అనేసరికి కాకిలో ఆలోచన మొదలైంది.." నిజంగానే ఈ పిల్లి, కాకి పెద్ద పని చేయట్లేదు" అనిపించింది దానికి.

 


దాని ఆలోచనని పసిగట్టిన నక్క "నిజం కాకమ్మా! కావాలంటే ఓ పని చెయ్యి. పిల్లి చేసే పని నువ్వు చేసి చూడు- నీకే అర్థమైపోతుంది, అది ఎంత చవకైన పనో!" అని హితబోధ చేసింది. దాని బుట్టలో పడిపోయిన కాకి వెంటనే మిత్రుల దగ్గరికి పోయి తగవులాడింది- "నేను చాలా అలసిపోతున్నాను. పని బరువు బాగా పడుతున్నది. మీరు సులభం పనులు పెట్టుకొని, నాకు ఇంత కష్టం పని పెట్టారు. అది కుదరదు. ఇప్పుడు పనులు మార్చుకోవాల్సిందే!" అని పట్టుబట్టింది. పిల్లికి, ఎలుకకి కోపం వచ్చింది. "నా కష్టం నీకు తెలీదు. నువ్వు వంట చెయ్యి తెలుస్తుంది!" అన్నది పిల్లి.  "నా పని నాకూ నచ్చట్లేదు. ఎంత ఏరినా గింజలు దొరకట్లేదు- ఆ పని నువ్వు చెయ్యి!" అన్నది ఎలుక.

మూడూ పనులు మార్చుకున్నాయి.

గింజల కోసం వెళ్ళిన పిల్లి నక్క నోట చిక్కింది.

వంట చేసేందుకు వెళ్ళిన కాకి కాస్తా పొయ్యిలో పడి కాలిపోయింది.

పుల్లల కోసం పోయిన ఎలుక మరి ఏమైందో, ఇంకా తిరిగే రాలేదు.

చూసారా! చెప్పుడు మాటలు ఎంత చేటు చేస్తాయో?!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో