రాచమల్లుకు ఎదురుగాలి.. ప్రొద్దుటూరులో తెలుగుదేశందే పై చేయి!
Publish Date:May 3, 2024
Advertisement
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది. వైఎస్ మరణం తరువాత కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ ను వీడి జగన్ కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైనా కడప జిల్లా మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకే జై కొట్టింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్ పునాదులు కదులుతున్న పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎనిమిది పదుల వయస్సున్న వరదరాజులు రెడ్డి పోటీలో ఉన్నారు. చంద్రబాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ఎంపిక చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆయితే ఆయన తనక ఇవే చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలలో సానుకూలతకు కారణమైంది. అన్నిటికీ మించి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సమీప బంధువు బంగారురెడ్డిల అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన స్థానికులు, వ్యాపారులు వరదరాజులురెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం బలం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతా అన్నీ కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రాచమల్లు అరాచకత్వం అన్ని వర్గాల ప్రజలలో ఆయన పట్ల అసహనానికీ, అసంతృప్తికీ కారణమైంది. దీంతో ప్రొద్దుటూరులో తెలుగుదేశం వైపు మొగ్గు కనిపిస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలూ, క్యాడర్ తో సమన్వయం కరవైంది. ఆయన పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటు వేస్తారన్న భావనలో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. వీటన్నిటికీ అదనంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాచమల్లు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీకి ప్రతికూలంగా మారిందంటున్నారు. ప్రొద్దుటూరు పరిస్థితి కడప జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతోందని చెబుతున్నారు. ప్రచారం నుంచి ప్రజా స్పందన వరకూ తెలుగుదేశం కూటమికి సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-facing-public-opposition-25-175044.html