టి20 విమెన్ వరల్డ్ కప్.. నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన టీమ్ ఇండియా
Publish Date:Jun 18, 2026
Advertisement
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నాలో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం (జూన్ 17) నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన పోరులో టీం ఇండియా 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మల అద్భుత బ్యాటింగ్ లో కళ్లు చెదిరే ఆరంభాన్ని అందుకుంది. వీరిరువురూ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు కేవలం 70 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో స్మృతి, షెపాలీలు హాఫ్ సంచరీలు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా.. 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే ఒత్తిడికి లోనై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడే 27 బంతుల్లో 28 పరుగులు, స్టెర్రే కల్లిస్ 13 బంతుల్లో 18 పరుగులతో కాసేపు పోరాడినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. భారత బౌలర్లలో శ్రేయా చరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ మ్యాచ్ ద్వారా ఐసీసీ టోర్నీల్లో అరంగేట్రం చేసిన యువ పేసర్ నందిని శర్మ రెండు వికెట్లు, షఫాలి వర్మ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తికి ఒక వికెట్ దక్కింది. నెదర్ల్యాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ భారీ విజయంతో టీమ్ ఇండియా పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
http://www.teluguone.com/news/content/womens-t20-world-cup-36-223343.html





