చమురు సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్న యుద్దాలు
Publish Date:Mar 29, 2026
Advertisement
చమురు సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్దం, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ల మధ్య రోజురోజుకి తీవ్రతరమౌతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ స్థితిగతులను కుదిపేస్తోంది. అటు రష్యా, ఇటు ఇరాన్ చములు ఎగుమతుల్లో కీలకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నుంచి 90 శాతం చమురు ఎగుమతులు జరిగే ఖార్గ్ ఐలాండ్ను యూఎస్ స్వాధీనం చేసుకుందున్న ప్రచారం కలకలం రేపుతోంది. మరోవైపు రష్యా చమురు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఉస్త్లుగా పోర్టు ఉక్రెయిన్ దాడులతో ఎగుమతులను నిలిపివేయడం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్కు పెద్ద దెబ్బే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనడంతో ధరలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో రష్యా ఆర్థిక లోటు పూరించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజా దాడితో రష్యా చమురు ఆదాయానికి భారీగా గండిపడే పరిస్థితి తలెత్తింది. ఉక్రెయిన్ ప్రధానంగా రష్యా ఇంధన పరిశ్రమపైనే గురి పెట్టింది. ఈ నెలలోనే పలు ఇంధన సంస్థలపై దాడులు చేసింది. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని భారీ చమురు శుద్ది కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. ఇక అమెరికా దళాలు.. ఇరాన్పై వ్యూహాత్మక దాడులను వేగవంతం చేశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా వైమానిక, నౌకాదళాలు భారీ దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్కు చెందిన అత్యంత ప్రధానమైన చమురు ఎగుమతి కేంద్రం 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి. దీనిని స్వాధీనం చేసుకున్నట్లయితే, ఇరాన్ ఆర్థిక మూలాలను అమెరికా దెబ్బతీసినట్లవుతుంది. దీనికి సంబంధించి నివేదికలు అందుతున్నప్పటికీ అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేదు. మరోవైపు, రాబోయే కొన్ని వారాల పాటు ఇరాన్ భూభాగంలో భారీ ఎత్తున 'గ్రౌండ్ ఆపరేషన్స్' నిర్వహించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం అదనపు దళాలను పశ్చిమాసియాకి తరలిస్తున్నది.
రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఉస్త్లుగా నౌకాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. ఇటీవల జరిగిన దాడిలో ఆ పోర్టు కొంతమేర ధ్వంసం అవ్వడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిపివేశారు. తాజాగా అదే పోర్టుపై ఆదివారం(మార్చి 29) మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిని లెనిన్గ్రాడ్ గవర్నర్ ధృవీకరించారు. రష్యా నుంచి భారత్కు ఇంధనం సరఫరా చేసే పోర్టుల్లో ఉస్త్లుగా కీలకమైంది. బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యా ఎగుమతులకు ఈ పోర్టు ప్రధానమైంది. అదే ప్రాంతంలోని ప్రిమోర్క్స్ పోర్టు కూడా ఇటీవల ఉక్రెయిన్ దాడుల్లో బాగా దెబ్బతింది. సముద్ర మార్గంలో రష్యా చమురు ఎగుమతుల్లో 45 శాతం ఆ పోర్టు నుంచే జరుగుతాయి.
ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుండే జరుగుతాయి.
http://www.teluguone.com/news/content/wars-intensifying-the-oil-crisis-36-216370.html





