మోనోరైల్ అన్నారు..మౌనంగా ఉన్నారు : ఏడాది నుండి పడిగాపులు కాస్తున్న వరంగల్ ప్రజలు
Publish Date:Dec 28, 2019
Advertisement
మోనోరైల్ తో వరంగల్ కు కొత్త శోభ సంతరించుకోబోతుందని ఏడాది క్రితం తెలియజేశారు. ప్రపంచ శ్రేణి నగరాల సరసన వరంగల్ ను నిలిపేందుకు కృషి జరుగుతోందని ప్రచారం చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారంగా స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ మోనో రైలు ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆ మేరకు వారిని వరంగల్ నగరంలో తిప్పి సర్వే కూడా చేయించారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు పన్నెండు కిలో మీటర్ లకు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి 22న స్విట్జర్లాండ్ ప్రతినిథులను ఓరుగల్లు గల్లీల్లో తిప్పుతూ మోనోరైల్ రాబోతోందని ఊరించారు. కానీ కొన్నాళ్లకు అది మరిచిపోయి ఆ ఊసే ఎత్తలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో హెచ్ఎండీఏ అధికారులతో వరంగల్లో పర్యటించారు.మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదన పై సమీక్ష నిర్వహించారు.సాధ్యాసాధ్యాలపై చర్చించారు మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు డీపీఆర్ తయారీ తదితర అంశాల పై స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమీక్ష జరిపారు. దీంతో వరంగల్ కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని ఏడాదిలోగా పనులు ప్రారంభమవుతాయని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో గతేడాది మోనోరైల్ పై జరిగిన సర్వేను నగర వాసులు గుర్తు తెచ్చుకుంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలో మోనో రైలు కోసం జరిగిన సర్వే ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. మోనోరైలుకు,మెట్రో రైల్ కు ఉన్న తేడాల పై తీవ్రమైన చర్చ సాగుతోంది. మెజారిటీ ఓరుగల్లు వాసుల మాత్రం మోనోరైల్ పైనే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ తర్వాత వేగంగా విస్తరిస్తున్న మహానగరం వరంగల్ అని అందరికి తెలిసిందే.దినదినాభివృద్ధి చెందుతూ మెట్రో పాలిటన్ నగరాల సరసన నిలిచేందుకు పోటీ పడుతోంది ఓరుగల్లు నగరం.హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరమే ఉండటంతో పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతర వ్యాపార సంస్థలు నగరం పై కన్నేశాయి.ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూడా రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండే యువత ఓరుగల్లు పై ఆసక్తి పెంచుకుంటున్నారు.దీంతో నగరంలో జనం రద్దీ పెరుగుతోంది. ఇప్పటి వరకు వరంగల్ జనాభా 10 లక్షలు దాటింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసి ట్రై సిటీస్ గా అవతరించాయి. ఈ ట్రై సిటీస్ లో ప్రయాణించాలంటే గగనమే. వరంగల్ నుంచి కాజీపేటకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 12 కిలో మీటర్లు ప్రయాణించాలంటే గంటకి పైనే పడుతోంది. నిత్యం ట్రాఫిక్ పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గతేడాది మోనో రైలు ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు సర్వే కూడా నిర్వహించారు.ఈ లోగా ఎలక్షన్లు రావడంతో అదంతా వదిలేశారు. వరంగల్ మహానగరంలో జనాభా కేవలం 10 లక్షలు మాత్రమే. రాజధాని నగరంలో చివరి నుంచి మరోవైపుకు వెళ్లాలంటే 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాని వరంగల్లులో 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ కోసం రిస్కు పడకుండా మోనోరైల్ అందుబాటులోకి తేవాలని నగర వాసులు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/warangal-city-to-get-fully-automated-monorail-soon-25-92661.html