విశాఖలో ఐబీఎం.. లోకేష్ విజయమేగా?
Publish Date:Aug 5, 2026
Advertisement
దిగ్గజ సంస్థ ఐబీఎం విశాఖలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఐబీఎం తిరిగి వైజాగ్లో అడుగుపెట్టడం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి మైలురాయి అనడంలో సందేహం లేదు. ఐబీఎం పునరాగమనం గురించి రాష్ట్ర విద్యా, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా ఐబీఎంకు స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఐబీఎం కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఐ స్ప్రౌట్ భాగస్వామ్యంతో ఈ సెంటర్ పని చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక బోర్డు, ఆఫీస్ ప్రాంగణ ఫొటోలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. దీనికి #ChooseSpeedChooseAP అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) పరిధిలో నమోదు చేసుకున్న ఐబీఎం సంస్థ, రాబోయే మూడేళ్ల కాలంలో 321 కోట్ల రూపాయల విలువైన సేవల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక దశలోనే ఈ సెంటర్లో 500 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. గ్లోబల్ డెలివరీ సెంటర్ ద్వారా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ కన్సల్టింగ్ సేవలను ఈ కేంద్రం నుండి అంతర్జాతీయ క్లయింట్లకు అందించనున్నారు. గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు. ఐటీ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సంప్రదింపులపై ప్రత్యేక దృష్టి సారించి, గ్లోబల్ టెక్నాలజీ సదస్సులలో ఏపీ ప్రాధాన్యతను వివరిస్తూ, వేగవంతమైన అనుమతులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాల హామీతో టెక్ దిగ్జజ సంస్థల చూపు ఏపీవైపు మరల్చగలిగారు. సానుకూల పారిశ్రామిక విధానాలు, పారదర్శక పాలన కారణంగానే గ్లోబల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు పునరాగమనం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదా విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల రాకతో స్థానిక యువతకు తమ సొంత ప్రాంతంలోనే అంతర్జాతీయ స్థాయి ఐటీ కొలువులు లభించే వాతావరణం ఇప్పుడు ఏపీలో నెలకొందంటే అందుకు లోకేష్ చొరవ కారణమని అంటున్నారు. అదలా ఉంచితే.. ఐబీఎం విశాఖ పునరాగమనం మరో ఐటీ ఇన్వెస్ట్ మెంట్ మాత్రమే కాదు. ఈ పరిణామం.. వైసీపీ ఐదేళ్ల హయాంలో ఏం జరిగిందన్న విషయంపై మరో సారి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశ వ్యాప్తంగా చర్చకు తెరతీయడం. వైసీపీ హయాంలో తన కార్యకలాపాలను మూసివేయడానికి ముందు ఐబిఎంకు విశాఖపట్నంలో కార్యాలయం ఉండేది. తాము ఎందుకు వెళ్లిపోయామో ఆ సంస్థ అధికారికంగా ఎప్పుడూ వివరించలేదు. కానీ.. విధానపరమైన అనిశ్చితి, పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలు, గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నిర్ణయాల సమీక్ష కారణంగానే ఐబీఎం రాష్ట్రం నుంచి తరలిపోయిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అంటే వైసీపీ నిర్వాకం వల్లే ఐబీఎం రాష్ట్రం నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ఒక్క ఐబీఎం మాత్రమే కాదు.. ఎన్నో సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఇందుకు కారణం వైసీపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లడమేనన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు, ఐబిఎం తిరిగి వచ్చింది. ఆ సంస్థ విశాఖపట్నంలో ఒక క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాబోయే మూడేళ్లలో 321 కోట్లకు పైగా విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 500కు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మించడానికి భూమి కోసం అన్వేషిస్తోంది. లోకేష్ ఐటీ మంత్రిగా శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ.. రాష్ట్రానికి ఐటీ కంపెనీలను ఆకర్షించడం పై ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమించారు. ఆ శ్రమ, ఆ కృషి, ఆ పట్టుదల.. ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోవడం, లేదా తమ విస్తరణ ప్రణాళికలను విరమించుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు మంత్రి లోకేష్ కారణంగా.. రాష్ట్రానికి పంపెనీలు రావడమే కాదు, కొత్త పెట్టుబడుల గురించి చర్చ జరుగుతోంది. మామూలుగా ఏ కంపెనీ కూడా, రాజకీయాల ఆధారంగా తమ ఇన్వెస్ట్ మెంట్లు చేయదు. వ్యాపార ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభ, మార్కెట్ పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని నమ్మితేనే ఇన్వెస్ట్ చేస్తారు. లోకేష్ ఆ విశ్వాసాన్ని చూరగొన్నారు. Visakhapatnam IBM Office, Nara Lokesh IT Department, Vizag IT Hub, Andhra Pradesh IT Investments, IBM Job Opportunities
http://www.teluguone.com/news/content/visakhapatnam-ibm-office-36-228063.html





