వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం..అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష..!
Publish Date:Jul 30, 2026
Advertisement
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం, మన జాతీయ గేయమైన 'వందేమాతరం' గౌరవార్థం భారత పార్లమెంట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ గేయం వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర అంతరాయం కలిగించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ తరహా నేరాలకు పాల్పడేవారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టసవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. జాతీయ గీతమైన 'జనగణమన', జాతీయ పతాకం, అలాగే భారత రాజ్యాంగానికి లభిస్తున్న చట్టబద్ధమైన గౌరవం, రక్షణలను ఇకపై 'వందేమాతరం' గేయానికి కూడా సమానంగా వర్తింపజేయనున్నారు.భారత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యనాథ్ రాయ్ జూలై 24, 2026న 'జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధక (సవరణ) బిల్లు - 2026' ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అమలులో ఉన్న 1971 నాటి చట్టానికి ఈ సవరణను జోడించారు. ప్రతిపక్షాల ఆందోళనలు, వాకౌట్ల మధ్య రాజ్యసభ జూలై 29న ఈ బిల్లును ఆమోదించగా, జూలై 30న లోక్సభ సైతం వాయిస్ ఓట్ ద్వారా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ ప్రతిపాదిత బిల్లు త్వరలోనే గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర పడిన అనంతరం అధికారిక చట్టంగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారం కేవలం జాతీయ పతాకం, రాజ్యాంగం మరియు జాతీయ గీతం (జనగణమన)లకు మాత్రమే చట్టబద్ధ రక్షణ అందుతోంది. అయితే వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చట్టసవరణను తీసుకువచ్చింది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1875వ సంవత్సరంలో రచించిన ఈ గేయం, 1882లో ఆయన రాసిన ప్రసిద్ధ 'ఆనంద్ మఠ్' నవల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది త్యాగధనులకు ఇది ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన శుభవేళ, ఉదయం 6:30 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో పండిట్ ఓంకార్నాథ్ ఠాకూర్ చేత సంపూర్ణ వందేమాతరం గేయాన్ని ఆలపింపజేయాలని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్వయంగా ఆదేశించారు.ఈ కొత్త చట్టసవరణ ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఎవరైనా కావాలని దానికి అడ్డంకులు సృష్టించినా, గేయ రికార్డింగ్ను ఆపివేసినా లేదా భంగం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. 1971 చట్టంలోని సెక్షన్లను సవరిస్తూ తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం నేరస్థులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశ సంస్కృతి, సార్వభౌమాధికారం మరియు పోరాట వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ జాతీయ గేయానికి అత్యున్నత చట్టబద్ధ గౌరవాన్ని కల్పించడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. Vande Mataram Bill 2026, Prevention of Insults to National Honour Amendment Bill, National Song legal protection, Parliament passes Vande Mataram Bill, 3 years imprisonment for insult, Indian Parliament latest news
http://www.teluguone.com/news/content/vande-mataram-bill-2026-36-227587.html





