మద్యం కుంభకోణం జగన్ కు బిగుస్తున్న ఉచ్చు!?
Publish Date:Jun 13, 2026
Advertisement
తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఈ తుఫాను రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, శరవేగంగా అరెస్టుల పర్వం వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు. సాధారణంగా లోకల్ పోలీసులు లేదా సిట్ చేసే విచారణకు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేసే పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కేసుపై సుమారు నాలుగు చార్జ్షీట్లు దాఖలు చేసి, 33 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ ముగిసిందని సిట్ ప్రకటించినప్పటికీ.. అక్కడితో కథ ఆగిలేదు. ఆ నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కొత్తగా ఈసీఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ఒకరిని అరెస్ట్ చేసిందంటేనే 80 శాతం కేసు నిర్ధారణ అయినట్లేనని రామకృష్ణ అన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తుందని వివరించారు. ఈ కుంభకోణం తాలూకు ఆర్థిక మూలాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్య ఒక మద్యం కార్టన్ రవాణా చేయడానికి కాంట్రాక్ట్ ధర 13 రూపాయలుగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే.. మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. కేవలం రవాణా చార్జీలనే ఏకపక్షంగా 13 రూపాయల నుండి 32 రూపాయలకు పెంచేశారు. అంటే ప్రతి కార్టన్పై 21 రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ రవాణా గోల్మాల్ వల్లే ప్రభుత్వ ఖజానాకు సుమారు 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ, సిట్ ప్రాథమికంగా లెక్క తేల్చాయి. అయితే ఇది కేవలం పిల్ల స్కామ్ మాత్రమేనని, అసలు పెద్ద స్కామ్ అయిన మొత్తం మద్యం కుంభకోణం విలువ సుమారు 3500 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అంటున్నారు. బలంగా ఆరోపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్లో కేవలం ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సిట్ దాఖలు చేసిన రెండవ చార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఐదు నుండి ఏడు సార్లు ప్రస్తావించారు. అక్రమంగా ఆర్జించిన ఈ 3500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో దాదాపు 70 శాతం మేర తాడేపల్లి ప్యాలెస్కే చేరిందని, ఆయనే దీనికి అంతిమ లబ్దిదారు, అంతిమ దోపిడీదారు అని కేసులోని కొందరు ముద్దాయిలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు కూడా ఈ 33 మంది జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు దాదాపు 15 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముద్దాయిలుగా ఉన్న కొందరు అధికారులు అప్రూవర్లుగా మారి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. మాజీ జడ్జి రామకృష్ణ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2029లో కాకుండా, ముందస్తు వ్యూహంలో భాగంగా 2028 చివరిలోనే, అంటే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్లోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే కాదు, ఈ మద్యం కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, వైఎస్ జగన్ జైల్లో ఉండగానే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రామకృష్ణ విశ్లేషించారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి వర్కవుట్ కాదని, ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న ఆయన, ఒకవేళ ఈడీ అరెస్టులు గనుక జగన్ వరకు వెళ్తే, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా నాయకుడు మిగలడని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/troubles-to-jagan-in-liquor-scam-39-222856.html




