గండిపేట భూ కుంభకోణం: వెయ్యి కోట్ల దందా వెనుక అసలు కథ!
Publish Date:Jun 13, 2026
Advertisement
తెలుగువన్ ప్రత్యేకం హైదరాబాద్ మహానగర శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట ప్రాంతంలో వెలుగుచూసిన వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, అతని సోదరుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఈ భారీ దందా అసలు రంగు బయటపడింది. గండిపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు తొమ్మిదిన్నర ఎకరాల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే బలమైన ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు. సెక్రటేరియట్ ఉద్యోగిగా చలామణి అయిన ఒక మధ్యవర్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భరద్వాజ చెప్పారు. ప్రభుత్వ భూమిని క్లీన్ డాక్యుమెంట్లతో మీ చేతికి అందిస్తానని సదరు మధ్యవర్తి నమ్మించడంతో, అతనికి నేరుగా నాలుగు కోట్లు చేతులు మారాయని పోలీసులు చెబుతున్నారనీ, మరో వైపు . తాము మోసపోయామని సదరు మాజీ ప్రజాప్రతినిధి వాదిస్తున్నారనీ భరద్వాజ అన్నారు. , అసలు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమ మార్గాల్లో రెగ్యులరైజేషన్ కోసం కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, మేమే ఇక్కడి భూములకు రక్షకులమని చెప్పుకునే కొందరు తెలంగాణ వాదులు పూర్తిగా మౌనం వహించడం విశేషమన్నారు. గతంలో కోడి చెరువు లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి చిన్న చిన్న భూ వివాదాలపై తీవ్రంగా స్పందించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన నాయకులు, ఇంత పెద్ద ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ సమయం నుండి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలుపుకొని కబ్జా చేసే సరికొత్త వ్యూహానికి తెరలేచింది. ఈ రకమైన కబ్జాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. గండిపేటతో పాటు పటాన్చెరు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజారిటీ ప్రైవేట్ లేఅవుట్లలో, విల్లాల్లో, ఫార్మా కంపెనీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కలిసిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' ( ద్వారా మరియు ధరణి రికార్డుల దర్యాప్తు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తోంది. తెలంగాణ నిజమైన ధనిక రాష్ట్రంగా ఎదగాలంటే, ఇప్పటికైనా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, గత ముప్పై ఏళ్లుగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల చిట్టాను పూర్తిగా బహిర్గతం చేయాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిన ఈ వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి మరియు ప్రజా సంక్షేమానికి ఉపయోగించినప్పుడే ఈ భూ దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యస్ చానెల్ లో వీక్షించండి
http://www.teluguone.com/news/content/real-story-behind-thousand-crore-deal-39-222849.html





