ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Publish Date:Jun 19, 2026
Advertisement
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాలు, మనోవేదన చివరకు నలుగురు ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్య పుట్టింటికి వెళ్లి కొంతకాలంగా తిరిగి ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, అర్ధరాత్రి సమయంలో తన ముగ్గురు చిన్నారులను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాత్రి వేళలోనే జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడం, ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. భార్య పుట్టింటికి వెళ్లడం, కుటుంబంలో నెలకొన్న విభేదాలు, వ్యక్తిగత సమస్యలే ఈ ఘోరానికి కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో అగ్రహారం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కదిలిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/tragedy-in-prakasam-district-36-223504.html





